Wrestlers’ protest: పతకాలు, అవార్డులను తిరిగిచ్చేసిన అథ్లెట్లు వీరే..

First Published Dec 28, 2023, 5:29 PM IST

Wrestlers’ protest: డబ్ల్యూఎఫ్ఐ నిర్ణయాలు తీసుకునేటప్పుడు దాని నిబంధనలను పాటించనందుకు క్రీడా మంత్రిత్వ శాఖ రెజ్లింగ్ సంఘాన్ని సస్పెండ్ చేసింది. ఈ క్ర‌మంలోనే భారత ఒలింపిక్ సంఘం ముగ్గురు సభ్యుల అడ్ హాక్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, పతకాలు, అవార్డులను తిరిగిచ్చేసిన ప‌లువురు అథ్లెట్లు త‌మ పోరాటం కొన‌సాగుతుంద‌ని తెలిపారు. 
 

Image credit: PTI

Athletes who returned medals and awards: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై భారత అగ్రశ్రేణి రెజ్లర్లు కొందరు తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ ఆందోళ‌న‌లు చేస్తున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగ్ కు వ్యతిరేకంగా వారు నిరంతరం గళం విప్పుతునే ఉన్నారు. తాజాగా డబ్ల్యూఎఫ్ఐలో చోటు చేసుకున్న పరిణామాలకు నిరసనగా కొందరు రెజ్లర్లు తమ అవార్డులను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. సింగ్ స‌న్నిహితుడైన సంజయ్ సింగ్ ను డబ్ల్యూఎఫ్ ఐ అధ్యక్షుడిగా ఎన్నికైన నేప‌థ్యంలో అథ్లెట్లు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. వారిలో.. 
 

సాక్షి మాలిక్

సాక్షి మాలిక్ ఈ నిర‌స‌న‌ల‌కు కేంద్ర బిందువుగా ఉన్నారు.  త‌మ నిరసనను మ‌రింతగా పెంచుతూ రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన సాక్షి ప్ర‌క‌టించారు. సంజయ్ సింగ్ సహా కొత్త డబ్ల్యూఎఫ్ఐ యాజమాన్యంతో పాటు ఆఫీస్ బేరర్లందరినీ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. అయితే ఇది సాక్షి నిర్ణయంపై ప్రభావం చూపిందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. 
 

Image credit: PTI

భజరంగ్ పూనియా

ప్రముఖ రెజ్లర్ భజరంగ్ పూనియా తన పద్మశ్రీని తిరిగి ఇచ్చారు. ఇది దేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం. దేశానికి ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టే వారికి మాత్రమే ప్రదానం చేస్తారు. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన భ‌జ‌రంగ్ పూనియా  తన అవార్డును తిరిగి ఇచ్చేశారు. 'మేం దేవుడిని మాత్రమే నమ్ముతాం. నా సోదరీమణులు, కూతుళ్ల కోసం నా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశాను. నేను వారి గౌరవం కోసం దానిని తిరిగి ఇచ్చాను. వారికి న్యాయం జరిగే వరకు నేను ఎటువంటి గౌరవాన్ని కోరుకోను. జైహింద్' అని బజరంగ్ ట్వీట్ చేశాడు.
 

Vinesh Phogat

వినేష్ ఫోగట్

వినేశ్ ఫోగట్ తన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, అర్జున అవార్డులను తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంది. "దేశం కోసం పతకాలు సాధించినప్పుడు దేశం మొత్తం మమ్మల్ని గర్వంగా అభివర్ణించింది. ఇప్పుడు న్యాయం కోసం గళమెత్తితే మమ్మల్ని దేశద్రోహులు అంటున్నారు. ప్రధాని గారూ, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మేము దేశద్రోహులమా?" ఎక్స్ లో పోస్ట్ చేసిన బహిరంగ లేఖలో ఫొగట్ ప్రధాని నరేంద్ర మోడీకి అడిగారు.
 

Image credit: PTI

వీరేందర్ సింగ్ యాదవ్

వీరేందర్ సింగ్ యాదవ్ ఈ ఉద్యమంలో చేరారు. డెఫ్లింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ కూడా తన పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికను వ్యతిరేకిస్తున్న తోటి రెజ్లర్లకు సంఘీభావంగా గూంగా పహిల్వాన్ గా పేరొందిన ఈ అథ్లెట్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.
 

click me!