T20 World Cup 2026 : టాస్ నుంచి సంజూ మాస్ వరకు.. విండిస్ పై టీమిండియా గెలుపుకు టాప్ 7 రీజన్స్

Published : Mar 02, 2026, 12:48 PM IST

టీ20 వరల్డ్ కప్ 2026 డూ ఆర్ డై మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా ఆడింది. అన్ని విషయాల్లోనూ పైచేయి సాధించిన ఇండియన్ టీం విండీస్ ను చిత్తుచేసింది. టాస్ నుండి సంజూ మాస్ ఇన్నింగ్స్ వరకు టీమిండియా గెలుపుకు ప్రధాన కారణాలివే..

PREV
18
వరల్డ్ కప్ ట్రోఫీకి 2 అడుగుల దూరంలో భారత్...

ICC T20 World Cup 2026 : సూపర్-8 లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా, వెస్టిండిస్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ నుంచి బౌలింగ్ వ్యూహాల వరకు అన్నీ భారత్‌కు కలిసొచ్చాయి. సంజూ శాంసన్ కీలక భాగస్వామ్యాలతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో టీ20 ప్రపంచకప్ లో భారత్ సెమీస్ కు చేరుకుంది... స్వదేశంలో ట్రోఫీని అందుకునేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచింది.

28
ఇండియా-వెస్టిండిస్ మ్యాచ్ లో కలిసొచ్చిన అంశాలివే...

 1. టాస్ గెలుపు… 

సెమీస్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియాకు శుభారంభం లభించింది. టాస్ గెలవడం భారత్‌కు కీలకంగా మారింది. భారీ హిట్టర్లున్న వెస్టిండీస్‌పై ఎంత లక్ష్యమైనా సేఫ్ కాదు. దానికి తోడు రాత్రి మంచు కురవడం వల్ల రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం సులభమవుతుంది. ఈ పరిస్థితుల్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం మ్యాచ్‌లో కీలక మలుపు అయింది.

38
2. పవర్ ప్లే వ్యూహాలు

రోస్టన్ చేజ్, కెప్టెన్ షాయ్ హోప్ పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా ఆడారు. కానీ హోప్‌ను భారత బౌలర్లు స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. మరోవైపు చేజ్ దూకుడుగా ఆడినా, హోప్ స్కోరింగ్ వేగం పెంచలేకపోయాడు. పవర్‌ప్లేలోని ఆరు ఓవర్లలో విండీస్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు మాత్రమే చేసింది. ఇందులో చేజ్ 11 బంతుల్లో 20 పరుగులు చేయగా, హోప్ 25 బంతులు ఎదుర్కొని 25 పరుగులే చేశాడు.

48
3. బుమ్రాతో ప్రయోగం సక్సెస్

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పవర్‌ప్లేలో బుమ్రాతో కేవలం ఒకేఒక్క ఓవర్ మాత్రమే వేయించాడు. క్రీజులో ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్లు ఉండటంతో అక్షర్ పటేల్‌తో రెండు ఓవర్లు పూర్తిచేశాడు. ప్రమాదకరమైన షిమ్రాన్ హెట్‌మైర్ కోసం బుమ్రాను దాచిపెట్టాడు కెప్టెన్.

షాయ్ హోప్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన హెట్‌మైర్ దూకుడుగా ఆడుతూ భారత్‌కు ప్రమాదకరంగా మారాడు. 11 ఓవర్లకు 99/1తో విండీస్ భారీ స్కోరుపై కన్నేసింది. ఈ దశలో సూర్య తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. 12వ ఓవర్‌లో బుమ్రాను బౌలింగ్‌కు పిలిచాడు. ఆ ఓవర్ మూడో బంతికి హెట్‌మైర్‌ను, ఐదో బంతికి రోస్టన్ చేజ్‌ను ఔట్ చేసి బుమ్రా డబుల్ స్ట్రైక్ ఇచ్చాడు. ఇది విండీస్ జోరుకు బ్రేకులు వేసింది.

58
4. 200 పరుగులకే విండీస్ ను కట్టడిచేయడం...

చివరి రెండు ఓవర్లలో 20 పరుగులు ఇచ్చినా వెస్టిండీస్‌ను 200 పరుగుల లోపు కట్టడి చేయడం కీలకంగా మారింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 19వ ఓవర్‌లో కేవలం 6 పరుగులే వచ్చాయి. స్కోరును 200 లోపు ఆపడంతో, ఈ లక్ష్యాన్ని ఛేదించగలమనే ఆత్మవిశ్వాసం భారత్‌కు లభించింది.

68
5. సంజూ శాంసస్ బ్యాటింగ్

విండీస్ బౌలర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్‌ల గురించి భయపడ్డారు కానీ సంజూను పెద్ద ప్రమాదంగా భావించలేదు. అందుకే ఆరంభంలో అతని బలహీనత అయిన షార్ట్ బంతులతో దాడి చేయలేదు. అభిషేక్, కిషన్ ఔటయ్యేసరికి సంజూ క్రీజులో కుదురుకున్నాడు. పేసర్ షమార్ జోసెఫ్ వచ్చినా, సంజూపై షార్ట్ బాల్ వ్యూహాన్ని పెద్దగా ప్రయోగించలేదు. దీంతో సంజూ ఓపెనర్ గా, సూపర్ స్ట్రైకర్‌గా, ఫినిషర్‌గా రాణించి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.

సంజూ కీలక భాగస్వామ్యాలు నిర్మించి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. అభిషేక్‌తో కలిసి 29, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో 58, తిలక్ వర్మతో 42, హార్దిక్ పాండ్యాతో 38 పరుగుల కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

78
6. రన్ రేట్ పెరగకుండా జాగ్రత్తలు..

భారత్ గెలవాలంటే ఓవర్‌కు దాదాపు 10 పరుగులు అవసరం. ఈ రన్‌రేట్‌ను 10 దాటకుండా భారత బ్యాటింగ్ లైనప్ జాగ్రత్త పడింది. వికెట్లు పడినా, డాట్ బాల్స్‌తో ఒత్తిడి పెరిగిన ప్రతిసారి సంజూ బౌండరీలు బాదాడు. బౌండరీ లేదా సిక్స్ కొట్టిన తర్వాత, మళ్లీ భారీ షాట్‌కు ప్రయత్నించకుండా సింగిల్ తీసి స్ట్రైక్ రొటేట్ చేయడం కూడా మ్యాచ్‌లో కీలకంగా మారింది.

88
7. మంచు ఎఫెక్ట్

రాత్రి కురిసిన మంచు కారణంగా విండీస్ స్పిన్నర్లు గుడకేశ్ మోటీ, రోస్టన్ చేజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇద్దరూ రెండేసి ఓవర్లు బౌలింగ్ చేసి, తలా 18 పరుగులు ఇచ్చారు. కానీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.

భారత్ విజయంతో టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ కు లైన్ క్లియర్ అయ్యింది. బుధవారం జరిగే తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఇక గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్‌లో భారత్, ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్‌లో జరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories