Sanju Samson : వెస్టిండీస్తో జరిగిన కీలక పోరులో సంజూ శాంసన్ 97 నాటౌట్ పరుగులతో వీరవిహారం చేశాడు. దీంతో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్కు దూసుకెళ్లింది.
మైదానంలో పరుగుల వరద.. కళ్లలో ఆనంద బాష్పాలు.. వెస్టిండీస్పై టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన సంజూ, తన కల నెరవేరిన వేళ భావోద్వేగానికి లోనయ్యాడు. 'దేశం కోసం ఆడాలని కలలు కన్న రోజు నుండి ఈ క్షణం కోసం నేను వేచి చూశాను' అంటూ తన మనసులోని మాటను పంచుకున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సాష్టాంగ నమస్కారం చేసేలా చేసిన ఆ ఇన్నింగ్స్, సంజూ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 ఆఖరి పోరులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్తో జరిగిన ఈ డూ ఆర్ డై పోరాటంలో సంజూ శాంసన్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్తో చెలరేగి, భారత్కు 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో టీమిండియా సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఫిబ్రవరి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్తో భారత్ సెమీఫైనల్ తలపడనుంది.
25
సంజూ శాంసన్ శివతాండవం
196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఈ దశలో బాధ్యత తీసుకున్న సంజూ శాంసన్.. విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 50 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. చివరి ఓవర్లో భారత్ విజయానికి 7 పరుగులు అవసరం కాగా, రొమారియో షెపర్డ్ వేసిన మొదటి బంతికే సిక్సర్ బాదిన సంజూ, ఆ తర్వాత ఫోర్ కొట్టి మ్యాచ్ను ముగించాడు.
35
విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన సంజూ
ఈ ఇన్నింగ్స్తో సంజూ శాంసన్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్లో లక్ష్య ఛేదనలో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సంజూ నిలిచాడు. గతంలో 2016లో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ చేసిన 82 పరుగుల రికార్డును సంజూ ఇప్పుడు అధిగమించాడు. విరాట్ కోహ్లీ లేకపోయినా, భారత్ 160 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సంజూ శాంసన్ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తుండగా, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మైదానంలోనే వంగి సంజూకు నమస్కారం చేశాడు. సంజూ ఆడిన అద్భుత ఇన్నింగ్స్కు గౌరవంగా సూర్య ఇలా చేశాడు. వెంటనే సంజూ తన కెప్టెన్ను ఆలింగనం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
55
సంజూ శాంసన్ భావోద్వేగం
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత సంజూ శాంసన్ భావోద్వేగానికి లోనయ్యాడు. "ప్రపంచం మొత్తం నా చుట్టూ ఉన్నట్లు అనిపిస్తోంది. దేశం కోసం ఆడాలని కలలు కన్న రోజు నుండి ఈ క్షణం కోసం నేను వేచి చూశాను. నా ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. నాపై నాకే సందేహాలు కలిగాయి. కానీ నేను నమ్మకాన్ని వదల్లేదు. ఈ రోజు నన్ను ఆశీర్వదించిన దేవుడికి ధన్యవాదాలు" అని సంజూ అన్నాడు. విరాట్, రోహిత్ వంటి దిగ్గజాలు డగౌట్లో కూర్చుని ఆడుతుంటే చూసి తాను ఎంతో నేర్చుకున్నానని సంజూ పేర్కొన్నాడు.
విండీస్ పోరాటం వృధా
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్ 25 బంతుల్లో 40 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, మరో 4 బంతులు మిగిలి ఉండగానే 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సెమీఫైనల్లో భారత్ ఇప్పుడు ఇంగ్లాండ్ను ఢీకొట్టబోతోంది.