Sanju Samson : సచిన్ ఒక్క ఫోన్ కాల్.. సంజూ తలరాత మారిపోయింది! అసలు ఏం జరిగిందంటే?

Published : Mar 09, 2026, 01:18 AM IST

Sanju Samson : అద్భుతమైన ఆటతో అదరగొట్టి టీ20 వరల్డ్ కప్ 2026లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు సంజూ శాంసన్. తన కష్టకాలంలో సచిన్ టెండూల్కర్ అందించిన సహకారం గురించి భావోద్వేగపూరిత విషయాలను పంచుకున్నారు. అవి వైరల్ గా మారాయి.

PREV
16
టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్.. సంజూ శాంసన్ వీరబాదుడు వెనుక ఉన్న రహస్యం ఇదే

టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత్ మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ విజయంలో కేరళ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించారు. టోర్నమెంట్ ఆరంభంలో రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన సంజూ, ఆ తర్వాత అద్భుత ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కెరీర్ లో ఎదుర్కొన్న చీకటి రోజులను, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనకు ఎలా అండగా నిలిచారో గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

26
కుప్పకూలిన కలలు.. మళ్ళీ చిగురించిన ఆశ

వరల్డ్ కప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ ఘోరంగా విఫలమయ్యారు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 46 పరుగులు మాత్రమే చేయడంతో ఆయన తన స్థానాన్ని కోల్పోయారు. ఆయన స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా జట్టులోకి తీసుకున్నారు.

"నిజం చెప్పాలంటే న్యూజిలాండ్ సిరీస్ తర్వాత నేను పూర్తిగా కుప్పకూలిపోయాను. నా కలలు చెదిరిపోయాయని భావించాను. ఇక నేను ఏం చేయగలను అని ఆలోచించాను. కానీ దేవుడి ప్రణాళికలు వేరుగా ఉన్నాయి. క్లిష్ట సమయాల్లో నాకు అవకాశం వచ్చింది, దేశం కోసం నా శాయశక్తులా కృషి చేశాను" అని సంజూ తన మనసులోని మాటను పంచుకున్నారు.

36
సచిన్ టెండూల్కర్ మార్గదర్శకత్వంలో సంజూ

కష్టకాలంలో ఉన్నప్పుడు దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తనకు వెన్నంటి నిలిచారని సంజూ వెల్లడించారు. గత రెండు నెలలుగా తాను సచిన్ సర్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నానని తెలిపారు. "ఆస్ట్రేలియాలో జట్టుకు దూరంగా ఉన్నప్పుడు, నా మనస్తత్వం ఎలా ఉండాలో సచిన్ సర్‌ను అడిగి తెలుసుకున్నాను. ఆయనతో సుదీర్ఘంగా మాట్లాడాను. నిన్న రాత్రి (ఫైనల్‌కు ముందు) కూడా ఆయన నాకు ఫోన్ చేసి నేను ఎలా ఉన్నానో అడిగి తెలుసుకున్నారు. ఆయన వంటి లెజెండ్ నుండి స్పష్టత, ఆట పట్ల అవగాహన లభించడం నా అదృష్టం" అని సంజూ పేర్కొన్నారు.

46
రికార్డుల వేటలో సంజూ ప్రయాణం

ఈ టోర్నమెంట్‌లో సంజూ శాంసన్ కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 321 పరుగులు సాధించారు. ఇందులో 199.37 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. వెస్ట్ ఇండీస్‌పై 97*, సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 89, ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 89 పరుగులు చేసి వరుసగా మూడు కీలక మ్యాచ్‌ల్లో భారత్‌ను గెలిపించారు. ఫైనల్‌లో సంజూ చేసిన 89 పరుగులు టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఫైనల్‌లో ఒక బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరుగా రికార్డు సృష్టించింది. గతంలో మార్లన్ శామ్యూల్స్ (85*), కేన్ విలియమ్సన్ (85) పేరిట ఉన్న రికార్డులను ఆయన అధిగమించారు.

56
సంజూ రెండేళ్ల నిరీక్షణకు ఫలితం

2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో కూడా సంజూ సభ్యుడిగా ఉన్నారు. కానీ వెస్ట్ ఇండీస్, అమెరికాలో జరిగిన ఆ టోర్నీలో ఆయనకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. "ఆ సమయంలో నేను బెంచ్‌పై కూర్చున్నప్పుడే ఈ రోజు గురించి కలలు కన్నాను. కష్టపడి పనిచేశాను. ఆ నిరీక్షణే ఈరోజు నన్ను ఇక్కడికి చేర్చింది. ఈ విజయం నాకు ఒక కలలా అనిపిస్తోంది" అని సంజూ ఆనందం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ సాధించిన ఒకే వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగుల రికార్డును కూడా సంజూ ఈ టోర్నీలో అధిగమించడం గమనార్హం.

66
సంజూ కోసం దేవుడి ప్రణాళికలు మరి !

అభిషేక్ శర్మ అస్వస్థతకు గురికావడంతో నమీబియా మ్యాచ్ ద్వారా జట్టులోకి వచ్చిన సంజూ, ఆ తర్వాత తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. సంజూ మాట్లాడుతూ.. "ఒకానొక దశలో నా కెరీర్ ముగిసిపోయింది అనుకున్నాను. కానీ క్లిష్టమైన క్వార్టర్ ఫైనల్ (వెస్టిండీస్ తో) మ్యాచ్‌లో అవకాశం రావడం, అక్కడ నుండి వెనుదిరిగి చూడకపోవడం అంతా దేవుడి దయ. నాకు సపోర్టుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా మా సీనియర్ ఆటగాళ్లకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతుడిని" అని సంజూ పేర్కొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories