Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026కు ముందు రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతను కేవలం అదృష్టం మీద ఆధారపడుతున్నాడని హెచ్చరించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభానికి కౌంట్డౌన్ మొదలైంది. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో అందరి దృష్టి రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. గత సీజన్లో సంచలన ప్రదర్శనతో రికార్డులు సృష్టించిన ఈ కుర్రాడికి, భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు. సూర్యవంశీ ప్రస్తుతానికి కేవలం అదృష్టం మీద మాత్రమే రాణిస్తున్నాడని ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.
25
సంచలన రికార్డుల వైభవ్ సూర్యవంశీ
వైభవ్ సూర్యవంశీ అతి చిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచంలో అసాధారణ మైలురాళ్లను అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అమ్ముడైన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందడమే కాకుండా, ఒక భారతీయుడిగా అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీని కూడా నమోదు చేశాడు. అంతేకాకుండా, అండర్-19 ప్రపంచకప్లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచి భారత్ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన అతను, ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్ కొట్టి తన సత్తాను చాటుకున్నాడు. కేవలం 7 మ్యాచ్ల్లో 206.55 స్ట్రైక్ రేట్తో 252 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
35
ఉతప్ప చేసిన లక్ కామెంట్స్ ఏంటి?
స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన రాబిన్ ఉతప్ప, వైభవ్ ఆటతీరుపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. "గత 12 నెలలుగా వైభవ్ ఆడుతున్న ప్రతి మ్యాచ్ను నేను నిశితంగా గమనిస్తున్నాను. అతను అద్భుతమైన ఆటగాడు అనడంలో సందేహం లేదు. కానీ అతని బ్యాటింగ్ చూస్తుంటే, అతను కొంతవరకు అదృష్టం మీద ఆధారపడి ఆడుతున్నాడని నాకు అనిపిస్తోంది" అని ఉతప్ప అన్నారు. ప్రత్యర్థి జట్లు ఇప్పటివరకు అతన్ని ఒక కొత్త ఆటగాడిగానే చూశాయని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని ఆయన గుర్తు చేశారు.
ఏదైనా కొత్త ఆటగాడు వచ్చినప్పుడు వారి బలాబలాలు ప్రత్యర్థులకు తెలియవు. దీనినే ఉతప్ప నోవెల్టీ అని పేర్కొన్నారు. "ఇప్పుడు ఆ కొత్తదనం పోయింది. ప్రత్యర్థి జట్లు వైభవ్ ఆటను విశ్లేషించడం మొదలుపెట్టాయి. అతనికి ఎక్కడ బౌలింగ్ చేయాలి, ఏ ప్రాంతంలో ఇబ్బంది పెట్టాలి అనే విషయాలపై వారు వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ఈ సీజన్ అతనికి ఒక పెద్ద పాఠంలా ఉండబోతోంది. అతను పరుగులు సాధించవచ్చు, కానీ గత ఏడాది తరహాలో ఆధిపత్యం చెలాయించడం కష్టం కావచ్చు" అని ఉతప్ప వివరించారు.
55
రాజస్థాన్ రాయల్స్ కొత్త వ్యూహం
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ సరికొత్త రూపంలో కనిపిస్తోంది. సుదీర్ఘకాలం కెప్టెన్గా ఉన్న సంజూ శాంసన్ కు వీడ్కోలు పలికిన టీమ్, ఈసారి రియాన్ పరాగ్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అలాగే స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్లో యశస్వి జైస్వాల్తో కలిసి వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. 15 ఏళ్ల వయసులోకి అడుగుపెడుతున్న వైభవ్, ఈసారి జట్టులో కీలక సభ్యుడిగా అన్ని మ్యాచ్ల్లోనూ ఆడే అవకాశం కనిపిస్తోంది.