India vs Pakistan : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్తో జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఆడకుండానే టీమిండియా ఖాతాలోకి 2 పాయింట్లు చేరుతాయి.
IND vs PAK : షాకింగ్ నిర్ణయం.. టీ20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ను బహిష్కరించిన పాకిస్థాన్ !
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి కేవలం కొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో ఒక భారీ కుదుపు చోటుచేసుకుంది. దాయాదుల పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ, పాకిస్థాన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీలో భారత్తో జరగాల్సిన హై-ప్రొఫైల్ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాక్ అధికారికంగా ప్రకటించింది.
26
పాక్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం
ఆదివారం (ఫిబ్రవరి 1) సాయంత్రం పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్తో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం పాక్ ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. "ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొనేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. అయితే, ఫిబ్రవరి 15న భారత్తో షెడ్యూల్ చేసిన మ్యాచ్లో మాత్రం పాకిస్థాన్ జట్టు మైదానంలోకి దిగదు" అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో కొలంబోలో జరగాల్సిన మహా సమరంపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
36
భారత్కు లభించనున్న వాకోవర్
ఐసీసీ నిబంధనల ప్రకారం, ఒక జట్టు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ఆడేందుకు నిరాకరిస్తే, ప్రత్యర్థి జట్టుకు వాకోవర్ లభిస్తుంది. పాకిస్థాన్ గనుక భారత్తో మ్యాచ్ ఆడకపోతే, టీమిండియాకు నేరుగా 2 పాయింట్లు కేటాయిస్తారు. ఇది గ్రూప్ దశలో భారత్కు భారీ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. మరోవైపు, పాకిస్థాన్ జట్టు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకోవాలంటే గ్రూప్ దశలో మిగిలిన మూడు మ్యాచ్ల్లోనూ తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఒక్క మ్యాచ్ ఓడినా ఆ టీమ్ తర్వాతి స్టేజ్ కు వెళ్లడం కష్టతరమవుతుంది.
ఐసీసీ, స్పాన్సర్లు, బ్రాడ్ కాస్టర్లకు భారీ నష్టాలు
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అది ఒక భారీ వాణిజ్య మార్కెట్. ఐసీసీకి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే మ్యాచ్ ఇదే. ప్రకటనదారులు, స్పాన్సర్లు, అధికారిక బ్రాడ్ కాస్టర్లు ఈ మ్యాచ్పై వేల కోట్లు పెట్టుబడి పెడతారు. ఇప్పుడు పాక్ బహిష్కరణ నిర్ణయంతో ఐసీసీ భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)పై కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వార్షికంగా ఐసీసీ నుంచి పాకిస్థాన్కు అందే ఆదాయ వాటాలో కూడా కోత విధించే అవకాశం ఉంది.
56
పాక్ జట్టు, సెలెక్టర్ల స్పందనలు ఇవే
ఈ నిర్ణయానికి ముందే పాకిస్థాన్ తన 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. సల్మాన్ అలీ ఆఘా కెప్టెన్సీలో బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది వంటి కీలక ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేశారు. జట్టు ఎంపికపై హెడ్ కోచ్ ఆకిబ్ జావేద్ మాట్లాడుతూ, "సెలెక్టర్లుగా మా పని జట్టును ఎంపిక చేయడం. టోర్నీలో పాల్గొనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మా ఛైర్మన్ ఇప్పటికే చెప్పారు. మేము ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవాలి" అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో పాక్ కూడా ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అలాగే, భారత్ పై గెలిచే అవకాశం లేకనే పాక్ ఈ డ్రామాలు ఆడుతోందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
66
పాక్ నిర్ణయంతో భవిష్యత్తు పరిణామాలు ఏమిటి?
ప్రస్తుతానికి పాకిస్థాన్ శ్రీలంకకు చేరుకుని టోర్నీలో మిగిలిన మ్యాచ్లు ఆడుతుందని సమాచారం. అయితే ఫిబ్రవరి 15 నాటి మ్యాచ్ విషయంలో ఐసీసీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ చివరి నిమిషంలో చర్చలు ఫలించకపోతే, క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఆదరణ కలిగిన మ్యాచ్ ఒకటి రద్దు కావడం ఖాయం. ఇది క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చే అంశం. రాబోయే రోజుల్లో ఐసీసీ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.