KL Rahul : రోహిత్, కోహ్లీ ఫెయిల్.. రాజ్‌కోట్‌లో రాహుల్ రఫ్ఫాడించాడు.. సిక్సర్‌తో సెంచరీ

Published : Jan 14, 2026, 05:28 PM IST

KL Rahul : రాజ్‌కోట్ వన్డేలో కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీతో భారత్ 284 పరుగులు చేసింది. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుని 112 పరుగులతో అజేయంగా నిలిచిన రాహుల్, అజారుద్దీన్ రికార్డును బద్దలు కొట్టాడు.

PREV
16
గ్రేట్ కంబ్యాక్: రాజ్‌కోట్‌లో కేఎల్ రాహుల్ పరుగుల వరద

రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చెలరేగిపోయాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన రాహుల్, అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. సిక్సర్‌తో తన ఎనిమిదో వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రాహుల్ పోరాటంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది.

26
కష్టాల్లో ఉన్న జట్టుకు ఆపద్బాంధవుడు కేఎల్ రాహుల్

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభం అంతగా కలిసిరాలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లు త్వరగానే పెవిలియన్ చేరారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ (23) అవుటైన వెంటనే, కేవలం 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

రాహుల్ చాలా ప్రశాంతంగా బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రవీంద్ర జడేజాతో కలిసి 50కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి స్కోరును 200 దాటించాడు. జడేజా అవుటైనప్పటికీ, నితీష్ కుమార్ రెడ్డితో కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 92 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 121.74 స్ట్రైక్ రేట్ తో తన ఆటను కొనసాగించాడు.

36
అజారుద్దీన్ రికార్డు బద్దలుకొట్టిన కేఎల్ రాహుల్

ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా కేఎల్ రాహుల్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ రికార్డును అధిగమించాడు. వన్డే ఫార్మాట్‌లో అజారుద్దీన్ తన 334 మ్యాచ్‌ల కెరీర్‌లో 7 సెంచరీలను మాత్రమే సాధించగలిగాడు. అయితే, రాహుల్ కేవలం తన 93వ వన్డేలోనే 8వ సెంచరీని నమోదు చేయడం విశేషం.

రాహుల్ అంతర్జాతీయ కెరీర్‌లో ఇది 21వ సెంచరీ (టెస్టుల్లో 11, వన్డేల్లో 8, టీ20ల్లో 2). సొంతగడ్డపై రాహుల్‌కు ఇది నాలుగో వన్డే సెంచరీ కాగా, ఆసియా గడ్డపై ఐదోది. న్యూజిలాండ్‌పై రాహుల్‌కు ఇది రెండో సెంచరీ.

46
సిక్సర్‌తో సెంచరీ సంబరాలు చేసుకున్న కేఎల్ రాహుల్

ఇన్నింగ్స్ 49వ ఓవర్‌లో కైల్ జేమీసన్ వేసిన ఫుల్ టాస్ బంతిని రాహుల్ లాంగ్-ఆన్ దిశగా భారీ సిక్సర్‌గా మలిచాడు. దీంతో అతని వ్యక్తిగత స్కోరు మూడంకెలకు చేరింది. హెల్మెట్ తీసి బ్యాట్ ఊపుతూ, విజిల్ వేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. రాహుల్ ఆఖరి వరకు క్రీజులో ఉండి, మహమ్మద్ సిరాజ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముగించాడు.

రాజ్‌కోట్ పిచ్ నెమ్మదిగా మారుతుందని భావించినప్పటికీ, రాహుల్ అద్భుతమైన టైమింగ్‌తో షాట్లు ఆడాడు. మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ మంచి ఆరంభాలు దొరికినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మల్చలేకపోయారు. శుభ్‌మన్ గిల్ మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ 30 పరుగుల మార్కును దాటలేకపోయారు.

56
యువ క్రికెటర్లకు రాహుల్ స్ఫూర్తిదాయక సందేశం

మ్యాచ్‌కు ముందు వడోదరలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో కేఎల్ రాహుల్ యువ క్రికెటర్లతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో రాహుల్ యువకులకు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశాడు. "అవకాశాలు ఎప్పుడూ రాకుండా ఉండవు. 2-3 ఏళ్లు బయట కూర్చోవాల్సి రావచ్చు. స్టేట్ టీమ్‌లో అవకాశం రాకపోతే, మరో టోర్నమెంట్‌లో మీ ప్రతిభను నిరూపించుకోవచ్చు" అని రాహుల్ పేర్కొన్నాడు.

"ఫలితాల గురించి కాకుండా ప్రక్రియను ఆస్వాదించాలి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని రెండు చేతులా అందిపుచ్చుకోవాలి. నిరాశ, కోపం రావడం సహజం, కానీ వాటిని అధిగమించి సిద్దంగా ఉండాలి" అని రాహుల్ తన అనుభవాలను పంచుకున్నాడు.

66
కివీస్ ముందు 285 పరుగుల లక్ష్యం

మొదట బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. అయితే రాహుల్ పోరాటంతో భారత్ 284 పరుగులు చేయగలిగింది. పిచ్ నెమ్మదిస్తుందని అంచనా వేస్తున్నా, సాయంత్రం మంచు ప్రభావం చూపకుండా ఉంటే భారత బౌలర్లకు అవకాశం ఉంటుంది. 300 పరుగుల మార్కును చేరాలని భారత్ భావించినప్పటికీ, 280-290 స్కోరు కూడా ఈ పిచ్‌పై పోరాడగలిగే మొత్తమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories