
ఐపీఎల్ 2026 వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ను ఏకంగా రూ. 25.20 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఒక విదేశీ ఆటగాడికి పలికిన అత్యధిక ధర కాగా, ఓవరాల్గా మూడో అత్యంత ఖరీదైన కొనుగోలు.
ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడంపై అనేక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, కేకేఆర్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ స్పందించారు. ఈ రికార్డు స్థాయి పెట్టుబడిని ఆయన గట్టిగా సమర్థించుకున్నారు. కేవలం ఒక్క సీజన్ కోసం కాకుండా, దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యానే గ్రీన్ను ఎంచుకున్నామని ఆయన స్పష్టం చేశారు.
కేకేఆర్ జట్టులో సుదీర్ఘ కాలం పాటు కీలక పాత్ర పోషించిన ఆండ్రీ రస్సెల్ ప్రస్తుతం జట్టులో లేరు. రస్సెల్ శకం ముగియడంతో, ఫ్రాంచైజీని భవిష్యత్తులో ముందుకు నడిపించే సత్తా ఉన్న ఆటగాడి కోసం కేకేఆర్ అన్వేషించింది. ఈ క్రమంలోనే కామెరాన్ గ్రీన్ సరైన ఎంపికగా భావించామని నాయర్ తెలిపారు.
"మేము గ్రీన్ కోసం ఎంతవరకైనా వెళ్లాలని నిర్ణయించుకున్నాం. డబ్బు ఆదా చేయడం గురించి మేము ఆలోచించలేదు. మా దగ్గర నిధులు ఉన్నాయి, అందుకే ఖర్చు చేశాం. ఆండ్రీ రస్సెల్ వెళ్ళిపోయిన తర్వాత, జట్టు బాధ్యతలను భుజాన వేసుకునే ఆటగాడు మాకు అవసరం. ఆ సామర్థ్యం గ్రీన్లో ఉందని మేము బలంగా నమ్మాము" అని నాయర్ జియోస్టార్తో మాట్లాడుతూ వెల్లడించారు. గ్రీన్ నియామకం తమకు అత్యంత ముఖ్యమని, అది చర్చలకు తావులేని విషయమని ఆయన పేర్కొన్నారు.
వచ్చే సీజన్లో గ్రీన్ను ఎలా ఉపయోగించుకోబోతున్నారో కూడా నాయర్ వివరించారు. గ్రీన్ కేవలం ఆల్ రౌండర్ మాత్రమే కాదని, టాప్ ఆర్డర్ బ్యాటర్గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. "కామెరాన్ గ్రీన్ టాప్ 3లో బ్యాటింగ్ చేస్తాడు. ఒక సీజన్లో 500 పరుగులు చేయగల సత్తా అతనికి ఉంది. గతంలో ఐపీఎల్లో అతను ఈ ఘనత సాధించాడు కూడా. అతను మా జట్టులోని అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు" అని నాయర్ అన్నారు.
గత గణాంకాలను విశ్లేషిస్తూ, కేకేఆర్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు 400 కంటే ఎక్కువ పరుగులు చేసినప్పుడల్లా జట్టు అద్భుత విజయాలు సాధించిందని ఆయన గుర్తు చేశారు. అదే ఫార్ములాను ఈసారి కూడా నమ్ముతున్నామని, గ్రీన్ నుంచి భారీ పరుగులు ఆశిస్తున్నామని తెలిపారు.
కామెరాన్ గ్రీన్ అంతర్జాతీయ టీ20ల్లో 21 మ్యాచ్లలో 32.56 సగటుతో 521 పరుగులు చేశారు. ఇందులో అతని స్ట్రైక్ రేట్ 160.30గా ఉంది. అలాగే 12 వికెట్లు కూడా తీశారు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే, గతంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 29 మ్యాచ్లలో 707 పరుగులు చేశారు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లోనూ రాణించి 16 వికెట్లు పడగొట్టారు. ఈ ఆల్ రౌండ్ ప్రదర్శనే కేకేఆర్ అతనిపై ఇంత భారీగా డబ్బులు కురిపించడానికి ప్రధాన కారణం.
ఇదే వేలంలో కేకేఆర్ తమ మాజీ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ను తిరిగి దక్కించుకోవడంలో విఫలమైంది. వెంకటేశ్ కోసం కేకేఆర్ రూ. 6.8 కోట్ల వరకు బిడ్ వేసినప్పటికీ, చివరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అతన్ని రూ. 7 కోట్లకు సొంతం చేసుకుంది. దీనిపై నాయర్ స్పందిస్తూ, "వెంకటేశ్ మాకు ఆరంభం నుంచి ఫ్రాంచైజీ ప్లేయర్గా ఉన్నాడు. మేము అతన్ని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించాము. ఇతర జట్లు వేరే ఆటగాళ్ల కోసం డబ్బు దాచుకుంటున్నాయని భావించి, వెంకటేశ్ తక్కువ ధరకే దొరుకుతాడని ఆశించాము. కానీ ఆర్సీబీ గట్టి పోటీ ఇచ్చింది. అతను కేకేఆర్ కోసం అద్భుతంగా ఆడాడు. అతని కొత్త ప్రయాణానికి ఆల్ ది బెస్ట్" అని పేర్కొన్నారు.
ఈ వేలంలో కేకేఆర్ మొత్తం 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 64.3 కోట్లు ఖర్చు చేసింది. గ్రీన్తో పాటు మతీషా పతిరానా, ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్ర వంటి స్టార్లను జట్టులోకి తెచ్చుకుంది. ఐపీఎల్ 2026 మార్చి 26న ప్రారంభం కానుంది. అజింక్య రహానే నాయకత్వంలో, కొత్త కూర్పుతో బరిలోకి దిగుతున్న కేకేఆర్, గత సీజన్ వైఫల్యాలను మర్చిపోయి ప్లేఆఫ్స్ చేరడమే లక్ష్యంగా పెట్టుకుంది. రస్సెల్ లేని లోటును గ్రీన్ భర్తీ చేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.