Sun Risers : సన్‌రైజర్స్ లోకి పాక్ ప్లేయర్.. ఎందుకు కావ్యా ఇలా చేశావు? రచ్చ స్టార్ట్ !

Published : Mar 12, 2026, 11:00 PM IST

Kavya Maran : ద హండ్రెడ్ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కావ్యా మారన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం సోషల్ మీడియాలో పెను వివాదానికి దారితీసింది.

PREV
16
పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన కావ్యా మారన్ పై వెల్లువెత్తిన విమర్శలు

ఇంగ్లాండ్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక క్రికెట్ లీగ్ ద హండ్రెడ్ 2026 వేలంలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు ఇండియాలో రచ్చ లేపుతోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సంబంధం ఉన్న సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు, పాకిస్థాన్‌కు చెందిన మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను భారీ ధర చెల్లించి దక్కించుకుంది. అయితే, ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. గతంలో భారత్‌కు వ్యతిరేకమైన పోస్టులు పెట్టిన ఆటగాడిని భారతీయ యాజమాన్యం ఉన్న జట్టు ఎలా కొనుగోలు చేస్తుందని నెటిజన్లు కావ్యా మారన్‌ను టార్గెట్ చేస్తున్నారు.

26
వేలంలో హోరాహోరీ.. సన్ రైజర్స్ భారీ ధర

లండన్‌లో జరిగిన ద హండ్రెడ్ ప్లేయర్ డ్రాఫ్ట్‌లో అబ్రార్ అహ్మద్ పేరు రాగానే ఫ్రాంచైజీల మధ్య పోటీ నెలకొంది. తొలుత ట్రెంట్ రాకెట్స్ 1,00,000 పౌండ్లతో బిడ్డింగ్ ప్రారంభించగా, కావ్యా మారన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ లీడ్స్ పట్టువదలకుండా పోరాడింది. చివరికి 1,90,000 పౌండ్లు (సుమారు రూ. 2.34 కోట్లు) వెచ్చించి అబ్రార్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ లింక్ ఉన్న ఒక ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన మొట్టమొదటి పాకిస్థాన్ ఆటగాడిగా అబ్రార్ అహ్మద్ రికార్డు సృష్టించారు. ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న ఈ స్పిన్నర్ కోసం సన్‌రైజర్స్ ఇంత భారీ మొత్తం వెచ్చించడం గమనార్హం.

36
వివాదానికి కారణమైన పాత పోస్టులు

అబ్రార్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకోవడంపై భారతీయ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అతను గతంలో సోషల్ మీడియాలో చేసిన వివాదాస్పద పోస్టులు. ముఖ్యంగా 2019లో జరిగిన భారత్-పాక్ సరిహద్దు ఉద్రిక్తతలు, కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఉదంతాన్ని ఉద్దేశించి అబ్రార్ ఎగతాళి చేస్తూ పోస్టులు పెట్టారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. 'ఆపరేషన్ సింధూర్' ప్రస్తావనతో భారత సైన్యాన్ని కించపరిచేలా అతను వ్యవహరించాడని, అటువంటి వ్యక్తికి భారత ఫ్రాంచైజీ సపోర్టు ఇవ్వడం ఏంటని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కావ్యా మారన్‌ను ట్యాగ్ చేస్తూ "ఎందుకు కావ్యా ఇలా చేశావు?" అంటూ ట్రోలింగ్ మొదలైంది.

46
అపోహలను పటాపంచలు చేసిన కావ్యా మారన్

ద హండ్రెడ్ వేలానికి ముందు ఐపీఎల్ జట్లు ఉన్న యాజమాన్యాలు ఏవీ పాకిస్థాన్ ఆటగాళ్లను కొనుగోలు చేయవని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఎంఐ లండన్, సన్‌రైజర్స్ లీడ్స్, సదరన్ బ్రేవ్, మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ వంటి జట్లు పాక్ ప్లేయర్లకు దూరంగా ఉంటాయని బిబిసి వంటి సంస్థలు విశ్లేషించాయి. కానీ, కావ్యా మారన్ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ అబ్రార్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు. ఇదే వేలంలో మరో పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌ను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ కొనుగోలు చేయగా, హరీస్ రౌఫ్, షాదాబ్ ఖాన్ వంటి ప్రముఖ ఆటగాళ్లు అమ్ముడుపోలేదు.

56
గత వివాదాల నీడలో తాజా నిర్ణయం

గతంలోనూ ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఐపీఎల్ 2026 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడుల నేపథ్యంలో అభిమానుల నుంచి నిరసనలు వ్యక్తమవడంతో, బీసీసీఐ సూచన మేరకు అతడిని జట్టు నుంచి విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అబ్రార్ అహ్మద్ విషయంలోనూ అదే స్థాయి ఆగ్రహం కనిపిస్తోంది. భారత సైన్యాన్ని అవమానించిన ఆటగాడిని ప్రోత్సహించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

66
అబ్రార్ అహ్మద్ రికార్డులు ఏంటి?

వివాదాలు పక్కన పెడితే, క్రికెట్ పరంగా అబ్రార్ అహ్మద్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. 2022లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతను, అనతి కాలంలోనే మిస్టరీ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2024 నుండి ఇప్పటివరకు 40 కంటే తక్కువ టీ20 మ్యాచ్‌లలో 50కి పైగా వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేట్ కూడా అద్భుతంగా ఉండటంతో ఇంగ్లీష్ పరిస్థితుల్లో అతను కీలకం అవుతాడని సన్‌రైజర్స్ భావించింది. హ్యారీ బ్రూక్ కెప్టెన్సీలోని సన్‌రైజర్స్ లీడ్స్ జట్టులో అబ్రార్ కీలక బౌలర్‌గా బరిలోకి దిగనున్నాడు. అయితే, మైదానం బయట చెలరేగుతున్న ఈ వివాదం జట్టుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి మరి.

Read more Photos on
click me!

Recommended Stories