U19 World Cup 2026: భారత్ ఖాతాలో మరో ప్రపంచకప్.. ఇంగ్లాండ్‌ను దంచికొట్టిన కుర్రాళ్లు !

Published : Feb 06, 2026, 08:35 PM ISTUpdated : Feb 06, 2026, 08:58 PM IST

U19 World Cup Final 2026: హరారేలో జరిగిన అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఇంగ్లాండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. వైభవ్ సూర్యవంశీ 175 పరుగులతో రికార్డు సృష్టించాడు.

PREV
15
ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన యువ భారత్.. 6వ సారి వరల్డ్ కప్ కైవసం

యువ భారత్ మరోసారి ప్రపంచ క్రికెట్‌పై తన ఆధిపత్యాన్ని చాటుకుంది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్లో భారత్ 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. ఈ విజయంతో భారత్ రికార్డు స్థాయిలో ఆరోసారి అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ వీరవిహారంతో భారీ స్కోరు సాధించిన టీమిండియా, అనంతరం బౌలింగ్‌లోనూ అదరగొట్టి ఇంగ్లాండ్‌ను కట్టడి చేసింది.

25
వైభవ్ సూర్యవంశీ రికార్డుల వేట

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2012లో ఉన్ముక్త్ చంద్ చేసిన 111 పరుగుల రికార్డును వైభవ్ బద్దలుకొట్టాడు. వైభవ్, ఆయుష్ రెండో వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియా భారీ స్కోరుకు పునాది వేశారు.

35
ఐసీసీ ఫైనల్ చరిత్రలో అత్యధిక స్కోరు

50 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. పురుషుల 50 ఓవర్ల ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. గతంలో 2003 ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌పై ఆస్ట్రేలియా చేసిన 359/2 పరుగులే రికార్డుగా ఉండేది. భారత్ తరఫున ఆయుష్ (53), అభిజ్ఞాన్ కుందు (40), కనిష్క్ చౌహాన్ (37 నాటౌట్) కీలక పరుగులు సాధించారు. చివరి ఓవర్లలో కనిష్క్ మెరుపులు మెరిపించడంతో భారత్ 400 పరుగుల మార్కును దాటింది.

45
పోరాడి ఓడిన ఇంగ్లాండ్

412 పరుగుల అసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కేవలం 100 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు, ఒక దశలో 183 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే కైలెబ్ ఫాల్కనర్ ఒంటరి పోరాటం చేస్తూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. జేమ్స్ మింటోతో కలిసి అతను ఎనిమిదో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే 40.2 ఓవర్లలో 311 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగియడంతో భారత్ 100 పరుగుల తేడాతో విజయం సాధించింది.

55
భారత్ విజయ పరంపర

ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్, ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించింది. 2000, 2008, 2012, 2018, 2022 తర్వాత ఇప్పుడు 2026లో ఆరోసారి ట్రోఫీని గెలుచుకుంది. గతంలో 2022 ఫైనల్లోనూ భారత్ ఇంగ్లాండ్‌నే ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఇంగ్లాండ్ జట్టు ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్కసారి (1998లో) మాత్రమే అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. తాజాగా జరిగిన ఫైనల్లో భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లారు.

Read more Photos on
click me!

Recommended Stories