IND vs PAK : పాక్‌తో ఆటే కానీ.. షేక్ హ్యాండ్ లేదు.. సూర్య దెబ్బ !

Published : Feb 15, 2026, 07:22 PM IST

No Handshake Policy : టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. సైనికుల త్యాగాలకు గౌరవంగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

PREV
15
నో షేక్ హ్యాండ్.. సూర్య దెబ్బకు కొలంబో స్టేడియంలో హై టెన్షన్

కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న హై-వోల్టేజ్ టీ20 వరల్డ్ కప్ 2026 పోరులో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా తప్పుకున్నారు. గతేడాది ఆసియా కప్ 2025 నుండి కొనసాగుతున్న నో షేక్ హ్యాండ్ పాలసీని టీమ్ ఇండియా ఈ మెగా టోర్నీలోనూ కొనసాగిస్తోంది.

25
ఆసియా కప్ నుండి కొనసాగుతున్న కఠిన నిర్ణయం

భారత జట్టు పాకిస్థాన్‌తో ఆడుతున్నప్పటికీ, మైదానంలో స్నేహపూర్వక కరచాలనాలు చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ వివాదం 2025 ఆసియా కప్ సమయంలో మొదలైంది. అప్పట్లో పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పౌరులకు, భారత సైన్యానికి సంఘీభావంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ నిర్ణయాన్ని అమలులోకి తెచ్చారు. అప్పటి నుండి పురుషుల జట్టుతో పాటు జూనియర్, మహిళా జట్లు కూడా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడం లేదు.

35
ఆపరేషన్ సింధూర్.. అమరవీరులకు నివాళి

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భావోద్వేగాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అమరవీరుల కుటుంబాలకు గౌరవంగా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంతో కనీస స్నేహపూర్వక సంజ్ఞలు కూడా చేయకూడదని బీసీసీఐ, భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. టాస్ సమయంలో ఇద్దరు కెప్టెన్లు కనీసం ఒకరినొకరు చూసుకోకపోవడం గమనార్హం. మ్యాచ్ అనంతరం కూడా ఆటగాళ్లు లేదా సపోర్ట్ స్టాఫ్ ఎవరూ హ్యాండ్ షేక్ చేసుకోరని బీసీసీఐ అధికారి ఒకరు ధృవీకరించారు.

45
టీమ్ ఇండియాలో రెండు కీలక మార్పులు

ఈ కీలక మ్యాచ్ కోసం భారత తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. గాయం నుండి కోలుకున్న అభిషేక్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చారు. అతను సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేశాడు. అలాగే, పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పేసర్ అర్షదీప్ సింగ్ స్థానంలో స్పిన్ మాంత్రికుడు కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ జట్టులో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.

55
గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో భారత్ హవా

ప్రస్తుతం గ్రూప్-ఏలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ (అమెరికా, నమీబియాపై) విజయం సాధించి +3.050 నెట్ రన్ రేట్‌తో ఉంది. పాకిస్థాన్ కూడా రెండు విజయాలతో రెండో స్థానంలో ఉంది. వరల్డ్ కప్ చరిత్రను పరిశీలిస్తే, ఇప్పటివరకు జరిగిన 8 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో భారత్ 7 సార్లు గెలవగా, పాక్ కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచింది. మొత్తం 16 అంతర్జాతీయ టీ20ల్లో భారత్ 13 సార్లు విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.

ఇరు జట్ల ప్లేయింగ్ XI

భారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

పాకిస్థాన్: సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజం, మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, ఉస్మాన్ ఖాన్ (కీపర్), షాహీన్ అఫ్రిదీ, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్.

Read more Photos on
click me!

Recommended Stories