
నాగ్పూర్ లో బుధవారం ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇటీవల స్వదేశంలో కివీస్ చేతిలో తొలిసారి వన్డే సిరీస్ను కోల్పోయిన టీమిండియా, ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసి మీద ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక సిరీస్ కోసం ఇరు జట్లలోని ప్రధాన ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వచ్చారు.
అయితే, స్టార్ ప్లేయర్లు అందుబాటులోకి రావడంతో తుది జట్టు ఎంపిక విషయంలో టీమిండియా మేనేజ్మెంట్కు కాస్త తలనొప్పిగా మారింది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో ఎవరిని తీసుకోవాలనే విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టు అంచనాలు ఆసక్తిని పెంచాయి.
తిలక్ వర్మ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, తుది జట్టులో చోటు కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. టీ20 జట్టులోకి పునరాగమనం చేసినప్పటికీ, అయ్యర్ బెంచ్కే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఇషాన్ కిషన్.
తొలి మ్యాచ్లో ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తారని టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ధృవీకరించారు. దేశవాళీ వైట్-బాల్ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్, న్యూజిలాండ్ టీ20లతో పాటు వరల్డ్ కప్ జట్టులోనూ ఆశ్చర్యకరంగా చోటు దక్కించుకున్నాడు. దీంతో కెప్టెన్, సెలెక్టర్లకు ఎంపికలో మరిన్ని ప్రత్యామ్నాయాలు లభించాయి.
ఇషాన్ కిషన్ బ్యాటింగ్ స్థానం గురించి టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టత ఇచ్చారు. "ఇషాన్ మూడో స్థానంలో ఆడతాడు. ఎందుకంటే అతను మా వరల్డ్ కప్ జట్టులో ఉన్నాడు, అందుకే మేము అతన్ని ఎంపిక చేశాం. కాబట్టి, ఇది అతని బాధ్యత, అతను తప్పక ఆడాలి. దేశవాళీ క్రికెట్లో అతను చాలా బాగా రాణిస్తున్నాడు. అతను భారత జట్టు తరపున గత 1-1.5 సంవత్సరాలుగా ఆడలేదు. మేము అతన్ని వరల్డ్ కప్ జట్టులోకి తీసుకున్నాం, కాబట్టి అతను ఆడటానికి అర్హుడు" అని సూర్య పేర్కొన్నారు.
ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్ భారత్కు కలిసిరానుంది. అంతేకాకుండా సంజూ శాంసన్కు అదనంగా మరో వికెట్ కీపింగ్ ఆప్షన్ను కూడా ఇషాన్ అందిస్తున్నాడు. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో జార్ఖండ్ తరపున ఇషాన్ కిషన్ పరుగుల వరద పారించాడు. 10 మ్యాచ్ల్లో ఏకంగా 517 పరుగులు సాధించాడు.
ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీల ఉన్నాయి. అంతేకాకుండా ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ సెంచరీతో చెలరేగి, తన జట్టు తొలిసారి ట్రోఫీని గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, భారత్ తరపున ఇషాన్ చివరిసారిగా రెండేళ్ల క్రితం (నవంబర్ 2023) ఆస్ట్రేలియాతో జరిగిన స్వదేశీ టీ20 సిరీస్లో ఆడాడు.
ఇషాన్ కిషన్ చేరిక మినహా, మిగిలిన భారత జట్టు కూర్పు గత ఏడాది చివర్లో దక్షిణాఫ్రికాతో ఆడిన జట్టులాగే ఉండే అవకాశం ఉంది. ఇన్నింగ్స్ ఆరంభించే బాధ్యతలను అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ తీసుకోనున్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగవచ్చు. ఆల్ రౌండర్లుగా శివమ్ దూబే ఐదో స్థానంలో, హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఇక ఫినిషర్ పాత్రలో టీ20 స్పెషలిస్ట్ రింకూ సింగ్ ఏడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు.
వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఎనిమిదో స్థానంలో జట్టుకు సమతూకాన్ని ఇవ్వనున్నాడు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ స్థానం కోసం కుల్దీప్ యాదవ్, ఫామ్లో ఉన్న వరుణ్ చక్రవర్తి మధ్య పోటీ నెలకొంది. డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్స్ ఈ ఇద్దరిలో ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి. పేస్ బౌలింగ్ బాధ్యతలను జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ పంచుకోనున్నారు. సిరీస్ ఓపెనర్కు ఈ ఇద్దరు పేసర్లు ఆడటం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నారు.
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.