India vs South Africa: కటక్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ తో సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆరుగురు బ్యాటర్లు, ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల కలయికతో బలమైన జట్టుతో సిద్ధంగా ఉంది.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ మంగళవారం కటక్లోని బారాబతి స్టేడియంలో ప్రారంభం కానుంది. సాయంత్రం 7 గంటలకు మొదలయ్యే ఈ తొలి టీ20 కోసం ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికపై టీమిండియా థింక్ట్యాంక్లో చర్చలు సాగుతున్నాయి. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆరుగురు బ్యాటర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో భారత జట్టు బరిలోకి దిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
25
ఓపెనింగ్ జోడీ: గిల్తో పాటు అభిషేక్ రెడీ
ఈ మ్యాచ్లో భారత జట్టు ఓపెనింగ్ బాధ్యతలను అభిషేక్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ నిర్వహించనున్నారు. గాయం కారణంగా దూరమైన గిల్ ఇటీవలే ఫిట్నెస్ క్లియరెన్స్ పొంది జట్టులోకి తిరిగి వచ్చాడు.
దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ సమయంలో ఆయన మెడ గాయం కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు పూర్తి శక్తితో తిరిగి వచ్చిన గిల్ ఈ మ్యాచ్లో కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది.
35
నంబర్ 3లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపులు
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నారు. తన దూకుడైన ఆటతీరుతో వేగంగా స్కోరు చేసే సూర్యకుమార్కు కటక్ పిచ్ రన్స్కు అనుకూలంగా ఉంటుంది. బంతి సరిగ్గా బ్యాట్పైకి వచ్చే పరిస్థితి ఉండటంతో ఏ బౌలర్కైనా ఆయనను ఆపడం కష్టమే అని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
మిడిల్ ఆర్డర్ లో తిలక్, అక్షర్, శాంసన్
నాలుగో స్థానంలో తిలక్ వర్మ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 36 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 47.43 సగటుతో 996 రన్స్ చేసిన తిలక్.. రెండు సెంచరీలు, నాలుగు అర్థశతకాలు కూడా నమోదు చేశాడు.
ఐదో స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ నిలవనున్నారు. 83 టీ20 ఇంటర్నేషనల్స్లో 637 రన్స్, 79 వికెట్లు తీసిన అక్షర్ పటేల్ భారత్కు కీలక ఆటగాడు.
ఆరవ స్థానంలో వికెట్కీపర్ బ్యాట్స్మన్ సంజూ శాంసన్ వచ్చే అవకాశం ఉంది. లోయర్ ఆర్డర్ లో దూకుడైన హిట్టింగ్ చేయడంలో శాంసన్ పాత్ర కీలకం కానుంది. దీంతో శివం దూబే, జితేష్ శర్మలు మొదటి మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవన్లో ఉండకపోవచ్చు.
రీఎంట్రీకి సిద్ధమైన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఏడో స్థానంలో ఉంటారు. బౌలింగ్ చేయడానికి పూర్తిగా సిద్ధమైన హార్దిక్, తన ఆల్రౌండ్ ప్రతిభతో మ్యాచ్ను పూర్తిగా మార్చగల సత్తా ఉన్న ప్లేయర్. భారత్ తరఫున 120 టీ20 మ్యాచ్లు ఆడి 1860 రన్స్, 98 వికెట్లు సాధించిన అనుభవం ఉంది.
స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
స్పిన్ బౌలింగ్ బాధ్యతలను కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి నిర్వహిస్తారు. దీంతో వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్లో బెంచ్పైనే ఉండే అవకాశం కనిపిస్తోంది.
పేస్ అటాక్ లో బుమ్రా, అర్షదీప్
పేస్ బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ తప్పనిసరిగా ఉంటారు. ఈ ఇద్దరూ కలిసి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైన్అప్ను బాగా ఇబ్బంది పెట్టగలరు. హార్దిక్ పాండ్యా మూడో పేసర్గా వ్యవహరించడంతో హర్షిత్ రాణాకు ఈ మ్యాచ్లో ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కడం కష్టమే.