
టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ దశలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్పై నెలకొన్న ఉత్కంఠ దాదాపు తొలగిపోయే దశకు చేరుకుంది. ఈ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని ప్రకటించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), ఇప్పుడు వెనక్కి తగ్గినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మధ్య జరిగిన కీలక చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. సుమారు రూ. 4,000 కోట్లకు పైగా విలువైన ఈ మ్యాచ్ను రద్దు చేసుకోవడం ఇష్టం లేని ఐసీసీ, పాకిస్థాన్తో చర్చలు జరిపి అడ్డంకిని తొలగించే ప్రయత్నం చేసింది.
అయితే, ఈ చర్చల్లో పాకిస్థాన్ ఐసీసీ ముందు పలు డిమాండ్లను ఉంచగా.. జై షా నేతృత్వంలోని అంతర్జాతీయ క్రికెట్ మండలి వాటిలో కీలకమైన వాటిని తిరస్కరించింది. పలు మీడియా రిపోర్టుల ప్రకారం.. ఐసీసీ, పీసీబీ మధ్య జరిగిన చర్చల సారాంశం, తిరస్కరించిన డిమాండ్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి..
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐదు ప్రధాన డిమాండ్లను ఐసీసీ ముందు ఉంచగా.. వాటిలో కొన్నింటికి మాత్రమే సానుకూల స్పందన లభించింది. ముఖ్యంగా భారత్తో సంబంధం ఉన్న డిమాండ్లను ఐసీసీ తోసిపుచ్చింది.
1. బంగ్లాదేశ్కు ఆర్థిక జరిమానా వద్దు: టీ20 ప్రపంచకప్లో పాల్గొననందున బంగ్లాదేశ్కు జరిమానా విధించవద్దని, వారి రెవెన్యూ వాటాను పూర్తిగా చెల్లించాలని పీసీబీ కోరింది. దీనికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై ఎలాంటి పెనాల్టీ ఉండదని, ఇది తమ మునుపటి నిర్ణయమేనని ఐసీసీ స్పష్టం చేసింది.
2. బంగ్లాదేశ్కు పరిహారంగా మరో ఈవెంట్: వచ్చే సైకిల్లో బంగ్లాదేశ్కు అదనపు ఐసీసీ ఈవెంట్ కేటాయించాలని పీసీబీ డిమాండ్ చేసింది. వచ్చే సైకిల్లో అండర్-19 ప్రపంచకప్ నిర్వహణ బాధ్యతను బంగ్లాదేశ్కు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది.
3. భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్: భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగేలా ఐసీసీ చొరవ తీసుకోవాలని పీసీబీ గట్టిగా కోరింది. ఈ డిమాండ్ను ఐసీసీ తిరస్కరించింది. ద్వైపాక్షిక సిరీస్లు తమ పరిధిలోకి రావని, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో కూడా తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.
4. ట్రై సిరీస్ : భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య ట్రై-సిరీస్ నిర్వహించాలని పీసీబీ ప్రతిపాదించింది. తమ అధికార పరిధిలో ఈ అంశం లేదని పేర్కొంటూ ఐసీసీ ఈ ప్రతిపాదనను కూడా తిరస్కరించింది.
5. 2026లో బంగ్లాదేశ్లో భారత్ పర్యటన: 2026లో భారత్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటించేలా ఐసీసీ హామీ ఇవ్వాలని పీసీబీ కోరింది. పర్యటనలు అనేవి రెండు బోర్డుల మధ్య జరిగే ద్వైపాక్షిక ఒప్పందాలని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని ఐసీసీ స్పష్టం చేసింది.
లాహోర్లో జరిగిన ఈ సమావేశంలో ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, పీసీబీ చైర్మన్ మోసిన్ నక్వీ, బీసీబీ ప్రెసిడెంట్ అమినుల్ ఇస్లాం పాల్గొన్నారు. ఐసీసీ తన నిర్ణయాలను స్పష్టం చేసిన తర్వాత, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను సంప్రదించేందుకు పీసీబీ చైర్మన్ మోసిన్ నక్వీ సమయం కోరారు. ఇందుకు ఐసీసీ 24 గంటల గడువు ఇచ్చింది. రాబోయే కొద్ది గంటల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 15న కొలంబో లో జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ను పాకిస్థాన్ ప్రభుత్వం మొదట బాయ్కాట్ చేయాలని నిర్ణయించింది. బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి తప్పించినందుకు నిరసనగా, సంఘీభావం తెలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. అయితే, తాజా పరిణామాల ప్రకారం పాకిస్థాన్ బోర్డు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 15న జరగాల్సిన గ్రూప్-ఏ మ్యాచ్ యథాతథంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అధికారికంగా యూటర్న్ తీసుకున్నారా అనే ప్రశ్నకు మోసిన్ నక్వీ స్పందిస్తూ.. "బంగ్లాదేశ్ మా సోదర దేశం. వారి విషయంలో మేం రాజీపడలేదు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఐసీసీ, బంగ్లాదేశ్ బోర్డుల నుంచి సమాచారం వచ్చిన వెంటనే మేం పూర్తి వివరాలు వెల్లడిస్తాం" అని పేర్కొన్నారు.
భారత్లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలు, కేకేఆర్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను జట్టు నుంచి తొలగించడం వంటి కారణాలతో బంగ్లాదేశ్ జట్టు భారత్లో మ్యాచ్లు ఆడటానికి నిరాకరించింది. తమ మ్యాచ్లన్నీ భారత్ వెలుపల నిర్వహించాలని కోరింది. దీనికి ఐసీసీ అంగీకరించకపోవడంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను టోర్నీలోకి తీసుకున్నారు. దీనికి నిరసనగానే పాకిస్థాన్ తొలుత బాయ్కాట్ అస్త్రం ప్రయోగించింది. కానీ ఇప్పుడు ఐసీసీ చర్చల తర్వాత పాక్ మెత్తబడినట్లు స్పష్టమవుతోంది.