
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2025-26 సీజన్కు సంబంధించి టీమిండియా సీనియర్ పురుషులు, మహిళల జట్ల వార్షిక ప్లేయర్ రిటైనర్షిప్ (సెంట్రల్ కాంట్రాక్ట్) జాబితాను ప్రకటించింది. అక్టోబర్ 1, 2025 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు అమలులో ఉండే ఈ ఒప్పందాలలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ నుండి ఊహించని షాక్ తగిలింది. వీరిద్దరూ టాప్ గ్రేడ్ నుండి కిందకు పడిపోయారు.
టీ20 ప్రపంచ కప్ 2026 మధ్య బీసీసీఐ ఈ వార్షిక ఒప్పందాలను ప్రకటించింది. సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన ఈ జాబితాలో జట్టును మూడు గ్రేడ్లుగా విభజించారు. ఈసారి ఉన్న అతిపెద్ద మార్పు ఏమిటంటే, టాప్ విభాగమైన గ్రేడ్ A+ ను పూర్తిగా తొలగించారు. గతంలో ఈ విభాగంలో ఉన్న రోహిత్, కోహ్లీలను ఇప్పుడు గ్రేడ్-బి లో చేర్చడం గమనార్హం.
బీసీసీఐ తన కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ విధానంలో భారీ ప్రక్షాళన చేసింది. గత కాంట్రాక్టులలో ఉన్న ఏ ప్లస్ గ్రేడ్ను బోర్డు తొలగించింది. గతంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి నలుగురు స్టార్ ఆటగాళ్లు ఈ టాప్ గ్రేడ్లో ఉండేవారు. కానీ, 2025-26 సీజన్ జాబితాలో ఈ కేటగిరీని ఎత్తివేశారు.
తాజా జాబితా ప్రకారం, టాప్ గ్రేడ్ ఏ లో కేవలం ముగ్గురు ఆటగాళ్లకు మాత్రమే చోటు దక్కింది. టెస్ట్, వన్డే కెప్టెన్గా వ్యవహరిస్తున్న శుభ్మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలు మాత్రమే ఈ టాప్ గ్రేడ్లో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే ఈ గ్రేడ్లో పెద్ద మార్పులే జరిగాయి. గతంలో గ్రేడ్-ఏలో ఉన్న సిరాజ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ ఇప్పుడు గ్రేడ్-బికి పడిపోయారు.
భారత క్రికెట్ను ఏలిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు గ్రేడ్-బికి పరిమితం కావడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి ప్రధాన కారణం వారి రిటైర్మెంట్ నిర్ణయాలే అని తెలుస్తోంది. ఈ ఇద్దరు దిగ్గజాలు టెస్టులు, టీ20 ఇంటర్నేషనల్ ఫార్మాట్ల నుండి వైదొలిగారు. ప్రస్తుతం వారు కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే యాక్టివ్గా ఉన్నారు.
కేవలం ఒక ఫార్మాట్లో మాత్రమే అందుబాటులో ఉండటం వల్లే బీసీసీఐ వీరిని గ్రేడ్-బి జాబితాలో చేర్చినట్లు స్పష్టమవుతోంది. గతంలో అన్ని ఫార్మాట్లలో ఆడేటప్పుడు వీరు ఏ ప్లస్ గ్రేడ్లో ఉండేవారు. తాజా నిర్ణయంతో వీరి ర్యాంక్ పడిపోవడమే కాకుండా, వార్షిక ఆదాయంలో కూడా మార్పు రానుంది.
ఈ కాంట్రాక్ట్ లిస్టులో మరో సంచలనం స్టార్ బౌలర్ మహమ్మద్ షమీని పక్కన పెట్టడం. 2025-26 సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుండి షమీని పూర్తిగా తొలగించారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తరపున ఆడి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచినప్పటికీ, అతనికి కాంట్రాక్ట్ దక్కలేదు. సెలెక్టర్ల భవిష్యత్ ప్రణాళికల్లో షమీ లేరని బీసీసీఐ ఈ నిర్ణయం ద్వారా పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లయింది.
బీసీసీఐ విడుదల చేసిన అధికారిక జాబితా ప్రకారం ఆటగాళ్ల విభజన ఈ క్రింది విధంగా ఉంది..
గ్రేడ్ A : శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా
గ్రేడ్ B : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్. గతంలో ఈ గ్రేడ్లో ఐదుగురు ఉండగా, ఇప్పుడు 11 మందికి చోటు దక్కింది.
గ్రేడ్ C : అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్.
గ్రేడ్ల మార్పుతో ఆటగాళ్ల వార్షిక వేతనాల్లో కూడా మార్పులు జరిగాయి. కొత్త జాబితా ప్రకారం వేతనాల వివరాలు ఇలా ఉన్నాయి..
గ్రేడ్ A: రూ. 7 కోట్లు (శుభ్మన్ గిల్, బుమ్రా, జడేజా).
గ్రేడ్ B: రూ. 5 కోట్లు (రోహిత్, కోహ్లీ, పాండ్యా సహా మరికొంత మంది ప్లేయర్లు).
గ్రేడ్ C: రూ. 3 కోట్లు (రింకూ సింగ్, అక్షర్ పటేల్ తదితరులు).
గతంలో ఏ ప్లస్ గ్రేడ్లో ఉన్నప్పుడు రోహిత్, కోహ్లీలకు రూ. 7 కోట్లు లభించేవి. ఇప్పుడు గ్రేడ్-బికి మారడంతో వారికి రూ. 5 కోట్లు మాత్రమే లభించనున్నాయి. అంటే వారి వార్షిక ఆదాయంలో రూ. 2 కోట్ల మేర కోత పడింది.