Hardik Pandya : సెంచరీ కొట్టినా సెలెక్ట్ కాలేదు.. హార్దిక్ పాండ్యాపై బీసీసీఐ షాకింగ్ నిర్ణయం ! ఎందుకు?

Published : Jan 03, 2026, 10:26 PM IST

Hardik Pandya : న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎంపిక కాలేదు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న పాండ్యాను ఎందుకు ఎంపిక చేయలేదనే చర్చ మొదలైంది. అయితే, దీనివెనుకు బీసీసీఐ మరో మాస్టార్ ప్లాన్ ఉందని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు. 

PREV
15
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా దూరం: అసలు కారణం బయటపెట్టిన బీసీసీఐ

భారత క్రికెట్ అభిమానులకు, క్రీడా విశ్లేషకులకు ఆశ్చర్యం కలిగించే విధంగా, న్యూజిలాండ్‌తో జరగనున్న రాబోయే వన్డే సిరీస్‌కు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక కాలేదు. శనివారం బీసీసీఐ (BCCI) ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో పాండ్యా పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది.

జనవరి 11న బరోడాలో ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో భారత్ 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, జట్టు ఎంపికకు కొద్ది గంటల ముందే దేశవాళీ క్రికెట్‌లో హార్దిక్ అద్భుత సెంచరీ సాధించినప్పటికీ, అతన్ని పక్కన పెట్టడం వెనుక ఉన్న కారణాలను బీసీసీఐ వివరించింది.

25
బీసీసీఐ కీలక ప్రకటనలో ఏముంది? అసలు కారణం ఇదే

హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయకపోవడం వెనుక ప్రధాన కారణం అతని బౌలింగ్ ఫిట్‌నెస్ అని బీసీసీఐ స్పష్టం చేసింది. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) నుండి హార్దిక్ పాండ్యాకు పూర్తి ఫిట్‌నెస్ క్లియరెన్స్ రాలేదు. ఒక వన్డే మ్యాచ్‌లో పూర్తి కోటా అయిన 10 ఓవర్లు బౌలింగ్ చేయడానికి అతను ఇంకా సిద్ధంగా లేడని వైద్య బృందం రిపోర్టు ఇచ్చింది.

ఈ విషయంపై బీసీసీఐ ఎక్స్ లో ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. "హార్దిక్ పాండ్యా ఒక మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేయడానికి బీసీసీఐ COE నుండి క్లియరెన్స్ పొందలేదు. రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026ను దృష్టిలో ఉంచుకుని, అతని వర్క్ లోడ్ ను జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంది" అని బోర్డు పేర్కొంది. కేవలం బ్యాటర్‌గా కాకుండా, ఆల్ రౌండర్‌గా అతని సేవలు ప్రపంచ కప్‌లో భారత్ కు కీలకం కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది.

35
విజయ్ హజారే ట్రోఫీలో పాండ్యా విధ్వంసం

జట్టు ప్రకటనకు కొద్ది గంటల ముందే, హార్దిక్ పాండ్యా విజయ్ హజారే ట్రోఫీలో బరోడా తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. విదర్భతో జరిగిన ఈ మ్యాచ్‌లో బరోడా జట్టు 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు హార్దిక్ క్రీజులోకి వచ్చాడు. తన బ్యాటింగ్‌తో చెలరేగిపోయిన హార్దిక్, తన కెరీర్‌లో తొలి లిస్ట్-ఏ సెంచరీని నమోదు చేశాడు.

అతను కేవలం 92 బంతుల్లోనే 133 పరుగులు సాధించాడు. ఇందులో 11 భారీ సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు బాది మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అయితే, బ్యాటింగ్‌లో అదరగొట్టినప్పటికీ, బౌలింగ్‌లో మాత్రం అతను కేవలం 2 ఓవర్లు మాత్రమే వేయగలిగాడు. ఇది అతని బౌలింగ్ ఫిట్‌నెస్ ఇంకా పూర్తిగా మెరుగుపడలేదని సూచిస్తుంది.

45
పాండ్యా గాయాలు.. టీ20 ప్రపంచ కప్ పై ఫోకస్

ఆసియా కప్ 2025 సందర్భంగా హార్దిక్ పాండ్యా క్వాడ్రిసెప్స్ గాయానికి గురయ్యాడు. దీని కారణంగా అతను దాదాపు రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. అనంతరం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పూర్తి చేసుకుని, ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ సిరీస్‌లో కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు.

ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఈ మెగా టోర్నీలో హార్దిక్ పాత్ర ఎంతో కీలకం. 2024లో భారత్ విజయం సాధించడంలో అతను ముఖ్య భూమిక పోషించాడు. కాబట్టి, మరోసారి అతని సేవలను సంపూర్ణంగా వినియోగించుకోవడానికి, ప్రస్తుతానికి అతన్ని వన్డేల నుండి పక్కన పెట్టి, కేవలం టీ20లపైనే దృష్టి సారించేలా మేనేజ్‌మెంట్ ప్లాన్ చేస్తోంది. అందుకే అతన్ని టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు కానీ, వన్డేలకు దూరం పెట్టారు.

55
షమీకి కూడా షాక్..

హార్దిక్ పాండ్యాతో పాటు, సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ కూడా ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. గాయం నుండి కోలుకుంటున్న షమీ జట్టులోకి వస్తారని ఊహాగానాలు వచ్చినప్పటికీ, సెలెక్టర్లు అతని విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో జరిగే టెస్ట్ మ్యాచ్‌లు, ప్రపంచ కప్ కోసం అతన్ని పూర్తిగా సిద్ధం చేయాలనేది వారి ఆలోచనగా కనిపిస్తోంది.

మరోవైపు, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టులో ఉన్నప్పటికీ, అతని లభ్యత ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. బీసీసీఐ COE నుండి గ్రీన్ సిగ్నల్ వస్తేనే అతను బరిలోకి దిగుతాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు తిరిగి వన్డే జట్టులోకి వచ్చారు. శుభ్‌మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు ఇదే

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్.

Read more Photos on
click me!

Recommended Stories