Team India : టీ20 ప్రపంచకప్ 2026లో దక్షిణాఫ్రికాపై భారత్ ఓటమి తర్వాత, కోచ్ గౌతమ్ గంభీర్ జట్టులో రాజకీయం చేస్తున్నారంటూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ తీవ్ర విమర్శలు చేశారు. టీమిండియాలో పాలిటిక్స్ నిజమేనా?
గౌతమ్ గంభీర్పై పాకిస్థాన్ మాజీ స్టార్ సంచలన ఆరోపణలు
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ ఎదుర్కొన్న ఘోర పరాజయం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ఈ ఓటమి తర్వాత భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ గంభీర్ పనితీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గంభీర్ తన రాజకీయ స్వభావాన్ని భారత జట్టులోకి తీసుకువచ్చారని, ఇది జట్టు ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని ఆయన ఆరోపించారు.
26
గంభీర్ రాజకీయ నేపథ్యంపై విమర్శలు
అహ్మద్ షెహజాద్ ఒక టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. 2019 నుండి 2024 వరకు తూర్పు ఢిల్లీ ఎంపీగా పనిచేసిన గంభీర్ అనుభవాన్ని ప్రస్తావించారు. "ఏ రంగంలో ఉన్నా పూర్తి ఏకాగ్రత అవసరం. గంభీర్ రాజకీయాల్లోకి వెళ్ళాడు, అది అతని ఆలోచనా విధానాన్ని మార్చివేసింది. అతను రాజకీయాల్లో పెద్దగా విజయం సాధించలేదు, కానీ అదే రాజకీయాన్ని ఇప్పుడు జట్టు వాతావరణంలోకి కూడా తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది. గౌతమ్ గంభీర్ చేస్తున్న ఈ రాజకీయం భారత జట్టు ఇమేజ్ను దెబ్బతీసింది" అని షెహజాద్ వ్యాఖ్యానించారు. గంభీర్ నిర్ణయాలు జట్టు ప్రయోజనాల కంటే ఇతర అంశాల ఆధారంగా సాగుతున్నాయని ఆయన పరోక్షంగా విమర్శించారు.
36
కుల్దీప్ యాదవ్ ను పక్కన పెట్టడం పై అనుమానాలు
ఈ ప్రపంచకప్లో స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టడంపై షెహజాద్ విస్మయం వ్యక్తం చేశారు. జట్టులో ఉన్న వనరులను గంభీర్ సరిగ్గా వినియోగించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. "కుల్దీప్ యాదవ్ లాంటి మ్యాచ్ విన్నర్ జట్టులో ఉన్నప్పటికీ, అతడిని సరిగ్గా వాడుకోవడం లేదు. పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత కుల్దీప్ యాదవ్ను సూర్యకుమార్ యాదవ్ నెట్టినట్లు ఒక సంఘటన జరిగింది. బహుశా క్రమశిక్షణ చర్యల వల్లనో లేదా సూర్యకుమార్తో ఉన్న విభేదాల వల్లనో కుల్దీప్ను పక్కన పెట్టారని ప్రజలు అనుకుంటున్నారు. లేకపోతే, అంతటి ప్రభావం చూపే ఆటగాడిని ఎవరూ బెంచ్కే పరిమితం చేయరు" అని షెహజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో అక్షర్ పటేల్ను కాదని వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకోవడంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నిర్ణయాన్ని కేవలం అభిమానులే కాకుండా, సీనియర్ ఆటగాడు ఆర్. అశ్విన్ వంటి వారు కూడా ప్రశ్నించారు. గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు జట్టును ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో భారత్ నెట్ రన్ రేట్ -3.800కు పడిపోయింది. ఇది సెమీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చింది.
56
సోషల్ మీడియాలో భారత అభిమానుల ఆగ్రహం
షెహజాద్ చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు. ముందు మీ జట్టు సంగతి చూసుకోండి అంటూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. బాబర్ ఆజంపై అసూయతో టీవీల్లో కూర్చుని మాట్లాడే వ్యక్తికి టీమ్ ఇండియా గురించి మాట్లాడే అర్హత లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్వైపాక్షిక సిరీస్లలో భారత్ అద్భుతంగా రాణించిందని, ఒక ఓటమిని పట్టుకుని రాజకీయం అంటగట్టడం సరికాదని వారు సమర్థిస్తున్నారు.
66
భారత్ పుంజుకుంటుందన్న యూసుఫ్ పఠాన్
మరోవైపు, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ భారత జట్టుకు సపోర్టుగా నిలిచారు. టీమ్ ఇండియా ఎలా పుంజుకోవాలో తెలుసని ఆయన ధీమా వ్యక్తం చేశారు. "దక్షిణాఫ్రికాతో ఓటమి బాధాకరమే, కానీ భారత జట్టు సవాళ్లను ఎదుర్కోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. చెన్నైలో జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్లో భారత్ భారీ తేడాతో విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. జింబాబ్వే కూడా మంచి క్రికెట్ ఆడుతోంది, కానీ ఒత్తిడిలో భారత్ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తుంది" అని పఠాన్ పేర్కొన్నారు. భారత్ తన తదుపరి మ్యాచ్లలో జింబాబ్వే, వెస్టిండీస్లను భారీ తేడాతో ఓడిస్తేనే సెమీస్ అవకాశాలు బలంగా ఉంటాయి.