దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ 2026పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్పై ఆయన స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ధోనీ ఎనిమిదో లేదా తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేయడం సరైనది కాదని చెప్పారు.
44 ఏళ్ల ధోనీ మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అతను దిగువ స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్న విషయాన్ని డివిలియర్స్ ప్రస్తావించారు. ధోనీ కనీసం ఆరవ స్థానంలో బ్యాటింగ్ చేయాలని సూచించారు. అవసరమైతే ఐదో లేదా నాలుగో స్థానంలో కూడా రావాలని అభిప్రాయపడ్డారు.
25
సీఎస్కే బ్రాండ్లో ధోనీ రోల్?
డివిలియర్స్ మాట్లాడుతూ సీఎస్కే బ్రాండ్ నిర్మాణంలో ధోనీ కీలక పాత్ర పోషించాడని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సీఎస్కే అంటే ధోనీ అనే భావన ఏర్పడిందని చెప్పారు. అయితే, ఇటీవలి కాలంలో ధోనీ పాత్ర ప్రధానంగా జట్టు బ్రాండ్ను నిలబెట్టడానికే పరిమితమైందని అభిప్రాయపడ్డారు. గత సీజన్లో అతని బ్యాటింగ్ ప్రభావం తక్కువగా కనిపించిందని చెప్పారు. ధోనీ ఇంకా మ్యాచ్ను ప్రభావితం చేసే సామర్థ్యం కలిగి ఉన్నాడని అన్నారు. అయితే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేయడం వల్ల అతని ప్రభావం తగ్గుతుందని చెప్పారు. ముందుకు రావాలని పేర్కొన్నారు.
35
సంజు శాంసన్కు డివిలియర్స్ సపోర్టు
సీఎస్కే భవిష్యత్ నాయకత్వంపై కూడా డివిలియర్స్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కెప్టెన్ గా సంజూ శాంసన్ సరైన వ్యక్తి అని స్పష్టం చేశారు. ధోనీ సరైన వారసుడి కోసం ఎదురు చూసిన విషయాన్ని ప్రశంసించారు. సంజూ నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి తగిన వ్యక్తి అని అన్నారు. ధోనీ ఇంకా ఆడితే అతను పెద్ద మ్యాచ్లలో బాధ్యత తీసుకోవాలని సూచించారు.
భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే కూడా సీఎస్కే నిర్ణయాన్ని సమర్థించారు. భారత క్రికెట్లో తరం మార్పు సహజమని చెప్పారు. సునీల్ గవాస్కర్ నుంచి సచిన్, అక్కడి నుంచి విరాట్ కోహ్లీ వరకు మార్పులు జరిగాయని గుర్తుచేశారు. ధోనీ కూడా ఆ మార్పులో భాగమని అన్నారు. సంజూ శాంసన్ రావడం సీఎస్కేకు మంచి నిర్ణయమని తెలిపారు. ఐపీఎల్ ముందు అతని ఫామ్ చాలా బాగుందని చెప్పారు.
55
సీఎస్కేలో సంజూ శాంసన్ పాత్ర ఏమిటి?
కుంబ్లే ప్రకారం సంజూ శాంసన్ సీఎస్కే అభిమానులతో త్వరగా కలిసిపోతాడు. కేరళకు చెందిన అతను తమిళం మాట్లాడగలడని చెప్పారు. వికెట్కీపర్ బ్యాటర్గా ధోనీ తరహాలోనే ఉండటం సీఎస్కేకు ప్లస్ పాయింట్ అని తెలిపారు. అధికారికంగా వైస్ కెప్టెన్ కాకపోయినా సంజు నాయకత్వ గ్రూప్లో కీలక పాత్ర పోషిస్తాడని చెప్పారు. అవసరమైతే రుతురాజ్ గైక్వాడ్ గైర్హాజరీలో సంజూ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఉందని అన్నారు.
గతంలో గైక్వాడ్ గాయపడినప్పుడు ధోనీ మళ్లీ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అదే విధంగా భవిష్యత్లో సంజూ ఆ బాధ్యతలు తీసుకునే అవకాశముందని పేర్కొన్నారు.
కుంబ్లే మాట్లాడుతూ ధోనీ వారసత్వం ఎప్పటికీ నిలుస్తుందని చెప్పారు. సీఎస్కే బ్రాండ్ అతనితో అనుబంధమైందని తెలిపారు. అయితే ఒక దశలో జట్టు ముందుకు సాగాల్సిందేనని స్పష్టం చేశారు. ధోనీ చేసిన సేవలు అపారం అని అన్నారు. భారత క్రికెట్, సీఎస్కేలో ధోనీ పేరు చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు.