
Indian Premier League : ఐపిఎల్ అంటేనే ధనాధన్ క్రికెట్... దీనికి సరిగ్గా సరిపోతాడు టీమిండియా క్రికెటర్ అభిషేక్ శర్మ. ఇలాంటి మరో హిట్టర్ ఐపిఎల్ లో ఎంట్రీ ఇస్తే... ఇక బౌలర్లకు దబిడిదిబిడే. ఇలా యువ సంచలనం కార్తీక్ శర్మ భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నాడు. దేశవాళి క్రికెట్లో అదరగొట్టిన ఈ శర్మ మరో అభిషేక్ శర్మలా ఆడితేమాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో ఇంకో ట్రోఫీ ఖాయం.
ఇండియన్ యువ క్రికెటర్ కార్తీక్ శర్మ దేశవాళి క్రికెట్లో అపార ప్రతిభ చాటాడు. రాజస్థాన్కు చెందిన ఈ ఆటగాడు 2006 ఏప్రిల్ 26న జన్మించాడు. రాజస్థాన్ క్రికెట్ టీంలో వికెట్ కీపర్, బ్యాట్స్మన్గా జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇతడు రైట్ హ్యాండ్ బ్యాట్స్మన్. చిన్న వయసులోనే అతని దూకుడు బ్యాటింగ్, స్ట్రోక్ప్లే, ఫినిషింగ్ సామర్థ్యం క్రికెట్ దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లో ఆడుతూ వేగంగా పరుగులు చేయగల సామర్థ్యం ఇతడిని ప్రత్యేకంగా నిలుపుతోంది. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ ఇతడికి ఈ ఐపిఎల్ లో అవకాశం కల్పిస్తోంది.
దేశవాళి క్రికెట్ విషయానికి వస్తే 2024-25 సీజన్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన అతను డెబ్యూ మ్యాచ్లోనే శతకం సాధించి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో కూడా అద్భుతంగా రాణించి కొంత కాలానికి జట్టుకు ప్రధాన బలంగా మారాడు. అలాగే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన దూకుడు బ్యాటింగ్తో గుర్తింపు తెచ్చుకున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ తక్కువ సమయంలోనే దేశవాళి క్రికెట్లో ప్రముఖ ఆటగాడిగా ఎదిగాడు.
మొత్తంగా చూస్తే కార్తీక్ శర్మ భవిష్యత్లో భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకునే సామర్థ్యం ఉన్న ఆటగాడిగా అభిమానులు భావిస్తున్నారు. వికెట్ కీపింగ్, పవర్ హిట్టింగ్, ఒత్తిడిలో ఆడగల నైపుణ్యం అతడిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. కొనసాగుతున్న ఫామ్ను దృష్టిలో ఉంచుకుంటే, త్వరలోనే అంతర్జాతీయ స్థాయిలో కూడా తన ప్రతిభను నిరూపించే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఐపిఎల్ లో అదరగొడితే జాతీయ జట్టులో కూడా చోటు దక్కించుకునే అవకాశాలున్నాయి.
భారత యువ క్రికెటర్ ప్రశాంత్ వీర్ దేశవాళి క్రికెట్లో తన ప్రతిభతో గుర్తింపు పొందాడు… ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆటగాళ్లలో ఒకడు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఈ క్రికెటర్ దేశవాళి క్రికెట్ లో అదరగొడుతున్నాడు... అందుకే ఐపిఎల్ లో అత్యధిక ధరకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇతడి ప్రారంభ ధర రూ.30 లక్షలు అయితే ఏకంగా రూ.14.2 కోట్లు చెల్లించి కొనుగోలు చేసిందంటే ఇతడి ఆటతీరు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
దేశవాళి క్రికెట్లో మహారాష్ట్ర తరఫున ప్రశాంత్ వీర్ ఆడుతున్నాడు. ముఖ్యంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన ప్రతిభను ప్రదర్శించాడు. ఈ టోర్నీలో అతని ఆగ్రెసివ్ బ్యాటింగ్, కీలక సమయంలో ఇన్నింగ్స్ను మార్చే సామర్థ్యం సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఇందులో 9 వికెట్లు తీయడమే కాదు 170 స్ట్రైక్ రేట్ 122 పరుగులు చేశాడు. ఇతడు ఫీల్డింగ్ లోనూ అదరగొడుతున్నాడు... అందుకే అతడు మరో జడేజా అవుతాయడనే నమ్ముతున్నారు అభిమానులు.
భారత యువ ఆల్రౌండర్ మంగేష్ యాదవ్ సాధారణ పరిస్థితుల నుంచి అద్భుతమైన క్రికెట్ స్థాయికి చేరుకున్న స్ఫూర్తిదాయక ఆటగాడు. 2002 అక్టోబర్ 10న మధ్యప్రదేశ్లోని చింధవాడ జిల్లా బోర్గావ్లో జన్మించాడు. చిన్న వయస్సులోనే పల్లెటూరి వాతావరణంలో క్రికెట్ ప్రాక్టీస్లో పాల్గొని, తర్వాత ప్రతిభ దారుణంగా మెరుగై నేషనల్ దృష్టికి వచ్చాడు. అతను లెఫ్ట్-ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా, అలాగే అవసరమైన సమయంలో క్రికెటింగ్ ఛాలెంజెస్లో బ్యాటింగ్ కూడా చేయగల ఆటగాడిగా గుర్తింపబడ్డాడు.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అతన్ని భారీగా రూ. 5.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది ఒక అన్ క్యాప్డ్ (అంతర్జాతీయ స్థాయిలో ఇంకా ఆడని) డొమెస్టిక్ ఆటగాడికి పెద్ద డీల్ గా చెప్పదగ్గది. ఇలా మంగేష్ తన ప్రతిభను ప్రపంచానికి చూపే అవకాశాన్ని కూడా పొందాడు. ఇంకా ఈ ఐపిఎల్ డీల్ ఇతని కుటుంబ పరిస్థితులలో కూడా మార్పేసింది.
మొత్తంగా చూస్తే మంగేష్ యాదవ్ దేశవాళి క్రికెట్లో రాణిస్తూ ఇప్పుడు ఐపిఎల్ లో అద్భుతాలు చేసేందుకు సిద్దంగా ఉన్నారు. అతని బౌలింగ్లో వేగం, యార్కర్ సామర్థ్యం, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయగల నైపుణ్యం అతన్ని భవిష్యత్తులో భారత క్రికెట్లో మరింత విస్తృత అవకాశాలు అందించడం ఖాయం.