Puri Jagannath: పూరీ జగన్నాథ ఆలయంలో ఏటా జ్యేష్ఠ పౌర్ణమి రోజున ‘స్నాన పూర్ణిమ’ను చాలా ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ వేడుకలో 108 కుండలతో స్వామివారికి ఎందుకు స్నానం చేస్తారు? స్నానం చేశాక స్వామికి జ్వరం ఎందుకు వస్తుంది? ఈ రహస్యాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశంలో ఉన్న అత్యంత పవిత్రమైన చార్ ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం ఒకటి. కలియుగ వైకుంఠంగా పిలవబడే ఈ క్షేత్రంలో అడుగుపెడితే పూరీ జగన్నాథ్ చరిత్ర, ఆలయానికి సంబంధించి ఎన్నో రసహాస్యాలు ఉన్నాయి. గాలికి ఎదురుగా ఎగిరే జెండా, నీడ పడని గోపురం, దేవుడికి జ్వరం రావడం.. ఇలా ఇక్కడి ప్రతి ఆచారం, ప్రతి నిర్మాణం వెనుక ఎన్నో దివ్య రహస్యాలు దాగున్నాయి.
26
108 కుండల సుగంధ జలాలతో స్నానం
జగన్నాథ స్వామి పుట్టినరోజునే ఈ స్నాన పూర్ణిమగా జరుపుకుంటారని భక్తుల నమ్మకం. ఈ రోజున స్వామివారికి జరిగే ప్రత్యేక స్నాన ఘట్టాన్ని చూడటానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. స్నాన పూర్ణిమ రోజు ఉదయాన్నే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవి, సుదర్శన చక్రం విగ్రహాలను గర్భగుడి నుంచి బయటకు తీసుకువచ్చి, ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ప్రదేశంలో ఉండే ‘స్నాన బేది’ (స్నాన గద్దె) పై ఉంచుతారు. ఆ తర్వాత ఆలయంలోని సువర్ణ బావి (బంగారు బావి) నుంచి తెచ్చిన 108 కుండల పవిత్ర జలాలతో స్వామివార్లకు ఘనంగా అభిషేకం చేస్తారు. ఈ నీటిలో పసుపు, చందనం, కస్తూరి, పువ్వులు కలిపి సుగంధ జలంగా మారుస్తారు.
36
గజవేషం (గణేశుడి రూపం)
స్నానాభిషేకం పూర్తయిన తర్వాత, సాయంత్రం వేళ జగన్నాథుడిని, బలభద్రుడిని ‘గజవేషం’ లో అంటే వినాయకుడి రూపంలో అలంకరిస్తారు. ఒకసారి గణేశ భక్తుడైన ఒక పండితుడు పూరీకి వచ్చినప్పుడు, జగన్నాథుడిలో తన ఇష్టదైవమైన వినాయకుడిని చూపించమని కోరగా.. స్వామివారు ఈ గజ రూపంలో దర్శనమిచ్చారని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ రోజు స్వామివారిని గజరూపంలో పూజిస్తారు.
ఈ ఉత్సవంలో అత్యంత వింతైన, ఆసక్తికరమైన ఘట్టం ఇక్కడే మొదలవుతుంది. 108 కుండల చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రా దేవి అనారోగ్యానికి గురవుతారు (అంటే దేవుళ్లకు జ్వరం వస్తుంది). అందుకే 15 రోజుల పాటు స్వామివారి దర్శనం నిలిపివేస్తారు. జ్వరం రావడం వల్ల స్వామివార్లను అస్వస్థతా గదికి లేదా అనాసర ఘర్కు తరలిస్తారు. ఆ రోజు నుంచి వరుసగా 15 రోజుల పాటు భక్తులకు స్వామివారి దర్శనం ఉండదు. ఈ సమయాన్ని ‘అనవసర కాలం’ అంటారు.
56
వనమూలికలు, ఆయుర్వేద కషాయాలతో చికిత్స
ఈ 15 రోజులు గుడిలో ఎలాంటి పూజలు, నైవేద్యాలు ఉండవు. కేవలం రాజ వైద్యులు మాత్రమే లోపలికి వెళ్లి స్వామివార్లకు ప్రత్యేకమైన వనమూలికలు, ఆయుర్వేద కషాయాలు, పండ్ల రసాలు అందిస్తూ చికిత్స చేస్తారు. దేవుళ్లకు పడక విశ్రాంతిఇస్తారు.
66
కోలుకున్నాక రథయాత్ర!
వైద్యుల చికిత్సతో 15 రోజుల తర్వాత స్వామివారు పూర్తిగా కోలుకుంటారు. అలా కోలుకున్న తర్వాత వచ్చే రోజనే ‘నవయౌవన దర్శనం’ అంటారు. అంటే సరికొత్తగా, మరింత కాంతివంతంగా స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఆ తర్వాతే ప్రపంచ ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది.
దేవుడిని కూడా తమ ఇంట్లో మనిషిలా భావించి, ఆయనకు స్నానం చేయించడం, జ్వరం వస్తే ఉపచారం చేయడం అనేది కేవలం పూరీ జగన్నాథ క్షేత్రంలోనే కనిపిస్తుంది. అందుకే ఈ ‘స్నాన పూర్ణిమ’ సనాతన సంస్కృతిలో ఎంతో ప్రత్యేకమైనది.