దీపావళి రోజు కూడా ఉపవాసం ఉంటారు.. దీని వెనుకున్న చరిత్ర తెలుసా?

First Published Nov 4, 2023, 3:38 PM IST

Diwali 2023: దీపావళికి లక్ష్మీదేవిని, వినాయకుడుని పూజిస్తే జీవితంలోని అన్ని బాధలు తొలగిపోయి సిరి, సంపదలు, కీర్తి, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. అయితే ఈ రోజున ఆడవారు ఉపవాసం కూడా ఉంటారు. ఎందుకంటే? 

Diwali 2023: దీపావళి పండుగను ఎంతో పవిత్రమైన పండుగగా పరిగణిస్తారు. అందుకే ఈ పండుగ సందర్భంగా ఇంటినంతా శుభ్రం చేసి పాత, పనికిరాని వస్తువులన్నింటినీ ఇంట్లోంచి తీసేస్తారు. అలాగే విరిగిపోయిన దేవుళ్ల విగ్రహాలను కూడా తొలగిస్తారు. కొత్త లక్ష్మీదేవి విగ్రహాలను కొంటుంటారు. అంతేకాదు ఈ పండుగ సందర్భంగా తమ బాధలు, కష్టాలన్నీ తొలగిపోవాలని చాలా మంది ఆడవారు ఈ రోజు ఉపవాసం కూడా ఉంటారు. కానీ దీపావళి ఉపవాసం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. 
 

దీపావళికి ఉపవాసం ఉండేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు. తర్వాత తలస్నానం చేసి ఇంటిని, ఇంటి దేవాలయాన్ని శుభ్రం చేస్తారు. కొత్తబట్టలు ధరించి లక్ష్మీదేవికి దీపం వెలిగించి పూజ చేస్తారు. మరి ఈ ఉపవాసం ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
 

దీపావళి ఉపవాసం కథ

పురాణాల ప్రకారం.. ఒకసారి లక్ష్మీదేవి కార్తీక మాసం అమావాస్య రోజు వైకుంఠధామం నుంచి భూలోకానికి వస్తుంది. అమవాస్య కారణంగా చుట్టూ చీకటిగా ఉండటంతో ఆమె తిరిగి వెళ్లేందుకు దారి తప్పుతుంది. దీంతో అమ్మవారు ఆ రాత్రి భూలోకంలోనే ఉండి సూర్యోదయం తర్వాత వైకుంఠధామానికి వెళదామని అనుకుంటుంది. అయితే రాత్రి పొద్దుపోవడంతో అందరూ తలుపులు మూస్తారు. అయితే అమ్మవారికి దూరం నుంచి ఒక ఇంటి తలుపులు తెరిచి, దీపం వెలిగించిన ఇళ్లు కనిపిస్తుంది. దీంతో అమ్మవారు ఆ ఇంటికి వెళుతుంది. లోపలికి వెళ్లడానికి ఆ ఇంట్లో ఉన్న వృద్ధురాలి అనుమతితో ఆ రాత్రంతా అమ్మవారు అక్కడే ఉంటుంది. అయితే ఆ  వృద్ధురాలు నిద్రలేచేసరికి అమ్మవారు ఉండదు. అలాగే చిన్న ఇళ్లు రాజభవనంలా మారుతుంది. అంతేకాదు ఆ ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బు, రత్నాలు, ధాన్యం, నగలే కుప్పలు కుప్పలుగా కనిపిస్తాయి.
 

అమావాస్య రాత్రి దీపం వెలిగించడం
    
కార్తీక అమావాస్య రోజు రాత్రి ప్రతి ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రదమని జ్యోతిష్యులు చెప్తారు. ఈ రోజు తలుపులు తెరిచి  ఉంచడం వల్ల లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతారు. శాస్త్రాల ప్రకారం.. దీపావళి నాడు ఉపవాసం ఉన్నవారి ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతారు.
 

click me!