అవినీతి ఆరోపణలు:
దేశంలో పెరిగిపోతున్న అవినీతి అంతమే లక్ష్యమంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేజ్రీవాల్ అదే అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం ఈ పార్టీ ఓటమికి ప్రాథమిక కారణంగా రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలైన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లపై అవినీతి ఆరోపణలు రావడం, కేజ్రీవాల్ మొదలు పలు నాయకులు జైలుకు వెళ్లడం పార్టీ ప్రతిష్టతను దెబ్బతీశాయని చెప్పాలి.
కేజ్రీవాల్ అరెస్ట్:
కేజ్రీవాల్ అరెస్ట్ ఆ పార్టీకి పెద్ద దెబ్బే అని చెప్పాలి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లడం ఆ తర్వాత ఆయన రాజీనామా చేయడం నాయకత్వ అస్థిరతకు కారణమైంది. కొత్త ముఖ్యమంత్రిగా అతిషిని నియమించడం వెనువెంటనే ఎన్నికలు రావడం ఇవన్నీ ఆప్పై ప్రభావం చూపాయి. ముఖ్యంగా కేజ్రీవాల్ విశ్వసనీయతపై ప్రజల్లో నమ్మకం తగ్గింది.
కాంగ్రెస్ కూడా:
ఒక రకంగా ఢిల్లీలో ఆప్ ఓటమికి కాంగ్రెస్ కూడా కారణమని చెప్పొచ్చు. పార్లమెంట్ ఎన్నికల్లో 'ఇండియా' కూటమి కలిసి పోటీ చేయడం అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేయడం కూడా మైనస్గా మారింది. కాంగ్రెస్ ఓట్లను చీల్చడం వల్ల ఆప్ పార్టీకి గండి కొట్టినట్లైంది.
కలహాలు:
ఓవైపు అవినీతి ఆరోపణలు మరోవైపు పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలు కూడా ఆప్ ఓటమికి కారణంగా చెప్పొచ్చు. కైలాష్ గెహ్లాట్, రాజ్ కుమార్ ఆనంద్ వంటి ప్రముఖ నేతల రాజీనామాలు పార్టీని దెబ్బతీశాయి.
హామీలు నెరవేర్చకపోవడం:
ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీల్లో కొన్నింటినీ నిలబెట్టుకోలేదనే వాదనలు వినిపించాయి. ముఖ్యంగా యమునా నదిని శుభ్రపరచడం, నీటిని అందించడం వంటి హమీలు నెరవేర్చకపోవడం కూడా ఆ పార్టీ ఓటమికి కారణమని రాజకీయ నిపుణులు విశ్లేసిస్తున్నారు.
యువత, మహిళలు దూరమవ్వడం:
ఆమ్ ఆద్మీ పార్టీపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు బాగా ఉపయోగించుకున్నాయి. లిక్కర్ స్కామ్ ఆ పార్టీ ప్రతిష్టతను దెబ్బతీశాయి. ముఖ్యంగా యువత, మహిళ, కొత్త ఓటర్లు ఆమ్ ఆద్మీకి దూరమైనట్లు తెలుస్తోంది.
12 ఏళ్లు పాలించడం:
సహజంగానే ఒక పార్టీ నిర్వీరామంగా 12 ఏళ్ల పాటు పాలిస్తే ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది, ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటారు. అందులోనూ ఆప్పై అవినీతి ఆరోపణలు ఎదురవడం, దేశమంతా మోదీ ఫ్యాక్టర్ బలంగా ఉండడం కూడా ఢిల్లీలో ఆప్ ఓటమికి కారణంగా చెప్పొచ్చు.