ఫెంగల్ తుఫాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీవ్రత తగ్గినా పలు జిల్లాలో వర్షాలు మాత్రం కొనసాగుతున్నాయి. దీంతో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లోని స్కూళ్లకు సెలవులు కొనసాగుతున్నాయి.
విల్లపురం, తిరువణ్ణామలై, ధర్మపురి, కృష్ణగిరి, కల్లకురిచి, కడలూరు, పుదుచ్చేరి జిల్లాల్లో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు కురిసాయి. ఈ వరదల కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించింది. పలు జిల్లాల్లో ప్రాణనష్టం కూడా జరిగింది.
కేవలం ఒకే రోజులో కృష్ణగిరి, మైలాపూర్ వంటి ప్రాంతాల్లో 50 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పుదుచ్చేరిలో 20 ఏళ్ల తర్వాత 49 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసాయి. ఈ వర్షాల కారణంగా నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నారు. చెరువులు, జలాశయాలు, నీటికుంటలు వరదనీటితో నిండుకుండల్లా మారాయి.
నీటి ప్రవాహాలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పశువుల కాపరులు, రైతులు జాగ్రత్తగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా జాగ్రత్తగా వుండాలని... ఏమాత్రం వరద నీరు కాలనీల్లోకి చేరినా వుంటనే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.