
దేశవ్యాప్తంగా ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయ రహదారుల్లోని కొన్ని ప్రత్యేక నిర్మాణాలపై టోల్ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గించేందుకు కేంద్ర రవాణా శాఖ కొత్త విధానాన్ని ప్రకటించింది. అయితే ఈ తగ్గింపు ప్రతి రహదారికి వర్తించదు. ప్రత్యేకంగా నిర్మించిన సొరంగాలు, ఎలివేటెడ్ రోడ్లు, వంతెనలు, ఫ్లైఓవర్ల వంటివి ఉన్న చోట్ల మాత్రమే ఇది అమల్లోకి రానుంది.
ఈ తగ్గింపు నిర్ణయం ద్వారా ముఖ్యంగా లాంగ్డిస్టెన్స్ ప్రయాణాలు చేసే వాహనదారులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ప్రయాణదారులు చిన్నదైన వంతెనలపై కూడా భారీగా టోల్ చెల్లించాల్సి వస్తోంది. దీని వల్ల వారి ప్రయాణ ఖర్చు ఎక్కువవుతోంది. కొత్త మార్గదర్శకాలు అయితే ఆ ఒత్తిడిని గణనీయంగా తగ్గించబోతున్నాయి.
2008లో అమలులోకి వచ్చిన జాతీయ రహదారి ఫీజు పాలసీని కేంద్రం తాజాగా సవరించింది. ఇందులో భాగంగా టోల్ ఛార్జీలు లెక్కించే విధానాన్ని కూడా మార్చింది. ఇకపై ప్రత్యేక నిర్మాణాలున్న చోటలకోసం ఒక కొత్త ఫార్ములాను రూపొందించారు.
ఈ పద్ధతి ప్రకారం, ప్రత్యేక నిర్మాణం ఉన్న జాతీయ రహదారి భాగంలో ఆ నిర్మాణ పొడవును ముందుగా 10తో గుణించి, దాన్ని ఆ సెక్షన్ మొత్తం పొడవుతో కలిపేస్తారు. తర్వాత ఆ ప్రత్యేక నిర్మాణ పొడవును మళ్ళీ తీసివేస్తారు. అదే సమయంలో, ఆ సెక్షన్ మొత్తం పొడవును 5తో గుణిస్తారు. ఈ రెండు లెక్కల్లో ఏదైతే తక్కువ వస్తుందో దాన్ని ఆధారంగా తీసుకుని టోల్ ఛార్జీ నిర్ణయిస్తారు.
ఈ గణన విధానం టోల్ను సమర్థవంతంగా లెక్కించడమే కాకుండా ప్రయాణికులపై టోల్ భారం తగ్గించడానికీ ఉపయోగపడనుంది. ప్రత్యేక నిర్మాణాల ఖర్చు తక్కువ చేస్తేనే ప్రయాణ ఖర్చు తగ్గుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
ఈ చర్య వల్ల ఎక్కువ ప్రయోజనం పొందే వారు సుదూర ప్రయాణాలు చేసే వ్యక్తులు, వాణిజ్య వాహనాలు నడిపేవారు, అలాగే వంతెనలు, టన్నెళ్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ప్రయాణించే ప్రజలు. గతంలో ఒక్కో చిన్న వంతెనకే వేర్వేరు టోల్ స్టేషన్లు ఉండేవి. ఇప్పుడు టోల్ను సమగ్రంగా లెక్కించడంతో అటువంటి చిన్న టోల్ స్టేషన్ల అవసరం కూడా తగ్గనుంది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం టోల్ తగ్గింపుతో ఆగిపోకుండా, రవాణా ఖర్చును కూడా గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. వ్యాపారరంగం, ట్రాన్స్పోర్ట్ రంగానికి ఇది మంచి ఊతమివ్వనుంది.
ఇంకా ఈ కొత్త విధానం ఎప్పుడు నుంచీ అమల్లోకి వస్తుందో స్పష్టంగా ప్రకటించలేదు. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ త్వరలో ఈ సంబంధిత ఉత్తర్వులను విడుదల చేసే అవకాశముంది. ఎలాంటి రహదారులు, ఏ ఏ ప్రాంతాల్లో ఈ తగ్గింపు అమలు అవుతుందో కూడా త్వరలో అధికారికంగా తెలియజేస్తారు.
మొత్తంగా, కొత్త టోల్ విధానం వల్ల ప్రయాణికులపై భారం తగ్గడం, సమర్థవంతమైన లెక్కింపు విధానం రాకతో ప్రయాణాలను మరింత సులభతరం చేయడం జరుగుతోంది. కేంద్రం తీసుకున్న ఈ మార్పులు రవాణా రంగానికే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకూ ఉపయోగపడేలా ఉంటాయని ఆశిస్తున్నారు.