Thalapathy Vijay : ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడు ప్రజలకు టీవీకే బాస్ విజయ్ దళపతి కృతజ్ఞతలు తెలిపారు. నోటును ఓడించి ప్రజాస్వామ్యాన్ని గెలిపించారంటూ విడుదల చేసిన భావోద్వేగ లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. వెండితెరపై తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దళపతి విజయ్, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ తన సత్తా చాటారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 108 స్థానాలను కైవసం చేసుకుని, అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అద్భుత ఫలితాల తర్వాత దళపతి విజయ్ తన మనసులోని మాటను ప్రజలతో పంచుకున్నారు. ఈ ఎన్నికల్లో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఒక లేఖను విడుదల చేశారు.
25
విమర్శలకు భయపడలేదు.. ప్రజల్నే నమ్ముకున్నాం
పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచే ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నామని విజయ్ గుర్తు చేసుకున్నారు. "నన్ను ఎందరో ఎగతాళి చేశారు, తక్కువ చేసి మాట్లాడారు. రాజకీయాల్లో ఇవన్నీ సహజమని నేను ముందుకు సాగాను. ఎవరిపైనా ఆధారపడకుండా, కేవలం ప్రజలనే నమ్ముకుని ఈ ఎన్నికల యుద్ధంలో ఒంటరిగా నిలబడ్డాం" అని ఆయన పేర్కొన్నారు. వ్యతిరేకం కాదంటూనే కొందరు తనను అవమానించారని, తనపై తప్పుడు ప్రచారాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
35
అమ్మలా అక్కున చేర్చుకున్న తమిళ ప్రజలు
ఎన్ని విమర్శలు ఎదురైనా తమిళనాడు ప్రజలు తనను ఒక కన్నతల్లిలా కాపాడుకున్నారని విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు చూపించిన ప్రేమ వెలకట్టలేనిదని, భారత రాజకీయాల్లోనే ఇదొక అద్భుతమైన ఎన్నికగా మిగిలిపోతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు తనపై చూపించిన ప్రేమ, ఒక కుటుంబంలా తనను ముందుకు నడిపించడం చూసి విజయ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మార్పు కోరుకునే ప్రతి బిడ్డ ఈ గెలుపులో భాగస్వామి అని ఆయన కొనియాడారు.
తమిళనాడులో చాలా కాలంగా భయపెడుతున్న డబ్బు రాజకీయాన్ని ఈ ఎన్నికల ద్వారా ప్రజలు పాతాళంలోకి తొక్కేశారని విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "డబ్బుతో ఓట్లను కొనాలనుకునే వారికి ప్రజలు బుద్ధి చెప్పారు. నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు. అవినీతి లేని, నిజాయితీతో కూడిన రాజకీయాలకు టీవీకే ఒక బలమైన పునాది అని ఈ ఫలితాలు నిరూపించాయి" అని ఆయన స్పష్టం చేశారు.
55
వారియర్స్ కు ధన్యవాదాలు.. అందరినీ ప్రేమిస్తా
ఈ విజయం కోసం రాత్రింబవళ్లు కష్టపడిన పార్టీ కార్యకర్తలకు, నిర్వాహకులకు, సోషల్ మీడియాలో పోరాడిన 'వర్చువల్ వారియర్స్'కు విజయ్ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈసారి తనకు ఓటు వేయడం మరిచిపోయిన వారు కూడా భవిష్యత్తులో తనను ప్రేమిస్తారని, వారి కోసం కూడా తాను పనిచేస్తానని విజయ్ చెప్పారు.