
స్టార్ సింగర్ సునీత కొడుకు ఆకాష్ గోపరాజు ఇప్పటికే హీరోగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. తాజాగా ఆయన `కొత్త మలుపు` అనే చిత్రంలో నటించాడు. శివ వర ప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భైరవి ఆర్థ్యా హీరోయిన్గా నటించింది. తథాస్తు క్రియేషన్స్ పతాకంపై తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రం నేడు శుక్రవారం(జూన్ 12)న విడుదలైంది. మరి ఈ సారి ఆకాష్కి హిట్ పడిందా? సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
కమల్(ఆకాష్) భవిష్యత్ గురించి ఆలోచన లేకుండా ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక ఫంక్షన్ కోసం తూర్పు గోదావరి జిల్లాలోని ఓ గ్రామానికి వెళ్తాడు కమల్. అక్కడ పల్లెటూరి అమ్మాయి వరలక్ష్మి(బైరవి ఆర్థ్యా)ని చూసి ఆమె అందానికి ఫిదా అవుతాడు. అయితే అక్కడ ఓ రోజు రాత్రి అనుకోని పరిస్థితుల్లో ఇబ్బందికర పరిస్థితుల్లో ఇరుక్కున్న కమల్ని ఓ అమ్మాయి కాపాడుతుంది. కానీ ఆమె ఎవరో తెలియదు. ఆమెని వెతికేందుకు వరలక్ష్మి సపోర్ట్ చేస్తుంది. తన వెంటే ఉంటుంది. ఈ జర్నీలో వీరిద్దరు ప్రేమలో పడతారు. తాను వెతుకుతున్న అమ్మాయి వరలక్ష్మినేనని తెలుసుకునేలోపే, ఆమె మరో యువకుడితో ఉన్న ఫోటో కమల్ చేతికి చిక్కుతుంది. దీంతో ప్రేమలో అనుమానాలు, అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఆ యువకుడు ఎవరు? వరలక్ష్మికి అతనికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ అపార్థాల మధ్య కమల్-వరలక్ష్మి ప్రేమ ఎలాంటి మలుపులు తీసుకుంది? అనేదే సినిమా మిగిలిన కథ.
సరికొత్త విలేజ్ లవ్ స్టోరీ ఇది. ప్రేమ, అపార్థాలు, నమ్మకం, గతం, ప్రస్తుతం మధ్య జరిగే భావోద్వేగ సంఘర్షణను దర్శకుడు శివ కేశనకుర్తి చక్కగా తెరపై ఆవిష్కరించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథకు గోదావరి ప్రాంతం అందాలను జోడించి ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించారు. సినిమా ప్రారంభం నుంచే ఫ్రెష్ ఫీల్ను కలిగిస్తుంది. పల్లెటూరి వాతావరణం, పెళ్లి సందడి, స్నేహితుల సరదా సంభాషణలు, హీరో-హీరోయిన్ల మధ్య నడిచే సన్నివేశాలు ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తాయి. ముఖ్యంగా మొదటి భాగంలో వచ్చే కామెడీ ఎపిసోడ్స్, గోదావరి ప్రాంతానికి ప్రత్యేకమైన కామెడీ స్టయిల్ మంచి వినోదాన్ని అందిస్తాయి. రెండో భాగంలో కథ భావోద్వేగాల వైపు మలుపు తిరుగుతుంది. ప్రేమలో అనుమానం ఎంత ప్రమాదకరమో, ఒకరి గతాన్ని పట్టుకుని తీర్పు చెప్పడం ఎంత తప్పో చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే సందేశం ఈ తరం యూత్ని ఆలోచింప చేస్తుంది. `ప్రతి ఒక్కరికీ ఒక గతం ఉంటుంది. కానీ మన జీవితంలోకి వచ్చిన వ్యక్తి ప్రస్తుతాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. గతాన్ని తవ్వుకుంటూ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు` అనే సందేశాన్ని దర్శకుడు చాలా బాగా తెరపై ఆవిష్కరించారు. గోదావరి అందాలు, విజువల్స్, ఆకాష్, భైరవిల మధ్య లవ్ ట్రాక్, వారి కెమిస్ట్రీ ఆకట్టుకుంటాయి. అలాగే రఘుబాబు, పృథ్వీ కామెడీ నవ్విస్తుంది. ఫ్యామిలీ అంశాలు, క్లైమాక్స్ అలరించేలా ఉంటుంది. ఎమోషనల్గా ముగుస్తుంది. కాకపోతే కథనం రెగ్యూలర్గా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అక్కడక్కడే కథ తిరుగుతున్నట్టుగా ఉంటుంది. డ్రామా ఊహించేలా ఉంటుంది. వాహ్ ఫ్యాక్టర్స్ లేవు. ట్విస్ట్ మాత్రం బాగుంది.
కమల్ పాత్రలో ఆకాష్ బాగా నటించాడు. గత చిత్రంతో పోల్చితే చాలా మెచ్యూర్ గా కనిపించాడు. అంతే సహజంగా చేసి మెప్పించాడు. ఫస్టాఫ్లో ఎనర్జీతో, రెండో భాగంగా ప్రేమలో పడ్డ యువకుడిగా మెప్పించాడు. ఎమోషనల్ సీన్లలో బాగా చేశాడు. సినిమాలో హీరోయిన్ భైరవి పాత్ర మరో బలమైన రోల్గా చెప్పొచ్చు. వరలక్ష్మి పాత్రలో ఆమె సహజత్వం కనిపిస్తుంది. గ్రామీణ యువతిగా అమాయకత్వం, ప్రేమలోని భావోద్వేగాలను ఎంతో సహజంగా వ్యక్తపరిచింది. క్లైమాక్స్లో ఆమె నటన హైలైట్గా నిలుస్తుంది. గోదావరి యాసలో వచ్చే డైలాగ్లతో రఘుబాబు, పృథ్వీ ఆద్యంతం నవ్వులు పూయించారు. చాలా రోజుల తర్వాత వీరిద్దరు బాగా నవ్వించారు. గోపి పాత్రలో సిద్ధు మంచి నటన కనబరిచాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
యశ్వంత్ నాగ్ అందించిన పాటలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ భావోద్వేగ సన్నివేశాలను మరింత బలపరిచింది. కెమెరామెన్ సుమంత్ కచర్ల, జవహర్ రెడ్డి అందించిన విజువల్స్ సినిమాకు పెద్ద ప్లస్. గోదావరి ప్రాంతంలోని ప్రకృతి అందాలను అద్భుతంగా చిత్రీకరించారు. ప్రతి ఫ్రేమ్ కనువిందుగా ఉంది. నిర్మాణ విలువలకు కొదవలేదు. రిచ్గా ఉంది. ఎడిటింగ్ పరంగా ఇంకా కేర్ తీసుకోవాలి. దర్శకుడు ఎంచుకున్న కథ బాగుంది. కథనం కొంత రొటీన్గా ఉన్నా, ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంది. కామెడీ, ఫ్యామిలీ అంశాలతో అన్నింటిని బ్యాలెన్స్ చేశారు. ఎమోషన్స్ ని బాగా పండించారు. నేటి యువతకు అవసరమైన సందేశాన్ని కలగలిపిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని తెరకెక్కించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
ప్రేమలో నమ్మకం విలువ తెలియజేసే చిత్రం. మంచి సరదా ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్.
రేటింగ్: 2.75