
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చి హీరోగా రాణిస్తున్నాడు సుధీర్ బాబు. అయితే హీరోగా ప్రారంభంలో విజయాలు అందుకున్న ఆయనకు ఇటీవల కాలంలో సరైన విజయాలు దక్కడం లేదు. అనేక ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నారు, కమర్షియల్ చిత్రాలు చేస్తున్నారు. కానీ తనకు బిగ్ బ్రేక్ ఇచ్చే మూవీ పడటం లేదు. దీంతో చాలా రోజులుగా స్ట్రగుల్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్లోకి వెళ్లి `జటాధర` చిత్రంలో నటించాడు. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషించారు. ఈచిత్రంతో సోనాక్షి తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్గా ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్. ఈ మూవీకి వీరిద్దరు దర్శకులు కావడం విశేషం. అలాగే జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్హల్, నిఖిల్ నందా నిర్మించారు. టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకున్న ఈ మూవీ నేడు శుక్రవారం(నవంబర్ 7)న హిందీతోపాటు తెలుగులో విడుదలైంది. ఈ సినిమాని ప్రసాద్ ఐమాక్స్ లో వీక్షించాను. థియేటర్ వద్ద కొంత హడావుడి కనిపించింది. మరి సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఉందా? సుధీర్ బాబు ఎట్టకేలకు హిట్ కొట్టాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
శివ(సుధీర్ బాబు) ఘోస్ట్ హంటర్(ఆత్మలను కనిపెట్టడం). దెయ్యాలపై రీసెర్చ్ చేసి థీసిస్ రాస్తుంటాడు. పడాబడ్డ బంగ్లాలోకి వెళ్లి ఆత్మలను కనిపెడుతుంటాడు. ఆత్మలు, దెయ్యాలు లేవని చెబుతుంటాడు. అయితే ఈ ఘోస్ట్ హంటింగ్ ని పేరెంట్స్(రాజీవ్ కనకాల, ఝాన్సీ) అతన్ని ఆపుతుంటారు. అయితే వాళ్లకి చెప్పకుండా ఓ సారి రుద్రాయ నగరం అనే గ్రామానికి వెళ్తాడు. అక్కడ లంకె బిందలు ఉన్నాయని కొందరు పూజలు చేస్తుంటారు. ఇంతలో తన ఇంట్లో ప్రమాదం జరుగుతుంది. ఝాన్సీకి గాయమవుతుంది. శివ రుద్రాయ నగరం వెళ్లారని తెలిసి పేరెంట్స్ బాధపడుతుంటారు. ఈ క్రమంలోనే తన ఇంట్లో ఓ ఫోటో కనిపిస్తుంది. అందులో ఉన్నది ఎవరు అని అడగ్గా అసలు కథ చెబుతారు రాజీవ్ కనకాల. తాము మీ పేరెంట్స్ కాదని, అసలు పేరెంట్స్ ఆ ఫోటోలో ఉన్న వారే అని చెబుతారు. మరో వైపు తనని ప్రేమించిన సితార(దివ్య ఖోస్లా) శివ జాతకం ఒక స్వామి(శుభలేఖ సుధాకర్)కి ఇవ్వగా ఆయన జాతకం చూసి ఆశ్చర్యపోతారు. శివకి మృత్యువు వెంటాడుతుందని చెబుతాడు. అతనికి చిన్నప్పట్నుంచి మృత్యుగండం ఉందని, ధన పిశాచి వెంటాడుతుందని చెబుతాడు. మరి ఇంతక అసలు శివ ఎవరు? ఆయన్ని మృత్యువు ఎందుకు వెంటాడుతుంది? తన పేరెంట్స్ ఎలా చనిపోయారు? ధన పిశాచి(సోనాక్షి సిన్హా) శివని ఎందుకు వెంటాడుతుంది? తన మృత్యువు నుంచి బయటపడేందుకు ఏం చేశారనేది? ఇందులో శిల్సా శిరోద్కర్ పాత్రేంటి? శివ ధన పిశాచితో ఎలా పోరాడాడు? అనేది మిగిలిన కథ.
సూపర్ నేచురల్ కథకి, మైథాలజీ అంశాలను జోడించి రూపొందించిన చిత్రమిది. లంకె బిందలు అనే కాన్సెప్ట్ మనం చాలా కాలంగా వింటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా అలాంటి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అందులో ఎంత నిజం ఉందనేది మిస్టరీ. వీటి కోసం ఇప్పటికీ పూజలు, బలివ్వడం జరుగుతూనే ఉంది. అదే కాన్సెప్ట్ ని శివతత్వానికి ముడిపెట్టి ఈ సినిమాని రూపొందించారు. సినిమా ప్రారంభం నుంచి ఆసక్తికరంగా సాగుతుంది. బంగారం నిల్వ కోసం వేసే బంధనాలు గురించి చెప్పడం ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. మరోవైపు హీరో ఘోస్ట్ హంటింగ్ చేయడం, పాత బంగ్లాలోకి వెళ్లి ఆత్మలను వెతకడం ఎంగేజ్ చేస్తుంది. అందులో కొన్ని హర్రర్ ఎలిమెంట్లు ఉత్కంఠకి గురి చేస్తాయి. ఆ తర్వాత ఏం లేదని చెప్పడంతో నిరాశ కలుగుతుంది. ప్రతి సారి ఇదే జరుగుతుంది. మరోవైపు హీరోయిన్తో ఫ్యామిలీ ఎపిసోడ్లు చూపిస్తూ ఈ దెయ్యాల ఉత్కంఠ నుంచి కొంత రిలీఫ్నిస్తుంటారు. అయితే హీరో జాతకం ఓ స్వామి చూసిన తర్వాత కథ మరింత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకునేలా ఉంటుంది. అదే సమయంలో వేగంగా వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది.
సెకండాఫ్ మొత్తం హీరో ఫ్లాష్ బ్యాక్తో నడుస్తుంది. అందులో బంగారం నిధుల కోసం పూజలు చేయడం, ధన పిశాచి రావడం, అది బలికోరుకోవడం, ఇలా వరుసగా మనుషులు బలి కావడం వంటి సన్నివేశాలతో సినిమా మరోస్థాయిలో అనిపిస్తుంది. ఇందులో సోనాక్షి ఎంట్రీ అదిరిపోయిందని చెప్పాలి. అయితే ఆ తర్వాత సీన్లు అంతగా కిక్ ఇచ్చేలా లేవు. ఎంతసేపు అక్కడక్కడే కథ తిరుగుతుంది. క్లైమాక్స్ వరకు హీరో ఉండడు. ధన పిశాచి ఎపిసోడ్ చాలా సాగదీసినట్టుగా ఉంటుంది. హోమాలు, అఘోరపూజలు, శివుడి కోసం అష్టలింగాల స్థాపన వంటి సీన్లు కొంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. అయితే ఆ సీన్లకి తగ్గట్టుగా అంతటి ఎమోషన్ క్యారీ కాకపోవడం పెద్ద మైనస్గా చెప్పొచ్చు. మూవీ ప్రారంభం నుంచే సాగదీసినట్టుగా ఉండటంతో బోరింగ్గా అనిపిస్తుంది. సెకండాఫ్లో ఆత్మలంటూ, ధన పిశాచి అంటూ హడావుడి తప్ప అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చూపించాలనుకుంటారనేది క్లారిటీ లేదు. సీన్ బై సీన్ వస్తుంటాయి. వాటి మధ్య పొంతన కుదరలేదు. సీరియస్ ఎమోషన్ అనేది సినిమాలో క్యారీ కాలేదు. దీంతో ఆడియెన్స్ కి అది కనెక్ట్ కాదు. దీనికితోడు బీజీఎం కూడా చాలా పేలవంగా ఉంది. హర్రర్, థ్రిల్లర్ ఎపిసోడ్, సెకండాఫ్లో వచ్చే ధన పిశాచి సినిమాపైకి ప్రధాన బలంగా చెప్పాలి. క్లైమాక్స్ సైతం అదిరిపోయింది.
శివ పాత్రలో సుధీర్ బాబు చాలా బాగా నటించాడు. పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. నటుడిగా ఆయన ది బెస్ట్ ఇచ్చాడు. లుక్ పరంగానూ చాలా బాగా ఉన్నాడు. సినిమాని తన భుజాలపై మోశాడని చెప్పొచ్చు. సితార పాత్రలో దివ్య ఖోస్లా ఉన్నంతలో బాగానే చేసింది, కానీ కొత్త ఫేస్ కావడంతో ఆమె పాత్ర పెద్దగా కనెక్ట్ కాదు. శివ పేరెంట్స్ గా రాజీవ్ కనకాల, ఝాన్సీ ఉన్నంతలో మెప్పించారు. సోనాక్షిసిన్హా ధన పిశాచిగా రెచ్చిపోయి చేసింది. కాకపోతే ఆమెకి పెద్దగా డైలాగులు లేకపోవడం గమనార్హం. శిల్పా శిరోద్కర్ సైతం అదరగొట్టింది. శివ ఫ్రెండ్ పాత్ర ఆకట్టుకునేలా ఉంది. రవి ప్రకాష్, ఇందిరా, రోహిత్ పతాక్ వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
సినిమాకి రాజీవ్ రాజ్ మ్యూజిక్ ఫర్వాలేదు. పాటలు బాగున్నాయి. బీజిఎం కొన్ని చోట్ల మాత్రమే మెప్పించింది. చాలా వరకు రొటీన్గా అనిపించింది. సమీర్ కళ్యాణి కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎడిటింగ్ పరంగా మరింత శ్రద్ధ పెట్టాల్సింది. చాలా చోట్ల సీన్ సీన్కి లింక్ మిస్ అయ్యింది. వీఎఫ్ఎక్స్ దారుణంగా ఉన్నాయి. దర్శకుడు అభిషేక్ జైస్వాల్, వెంకట్ కళ్యాణ్ ఎంచుకున్న కథ బాగానే ఉంది. కానీ దాన్ని తెరకెక్కించడంలో సక్సెస్ కాలేకపోయారు. ఎమోషన్స్ ని బలంగా చూపించాల్సింది. ధన పిశాచి ఎపిసోడ్, క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి. వాహ్ ఫీలింగ్ తెప్పిస్తుంది. ఎపిసోడ్ల వైజ్గా కొన్ని బాగా చేశారు. కానీ సినిమాగా కొంత తడబాటు కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సిన్సియర్ ప్రయత్నమని చెప్పొచ్చు.
ఫైనల్గా.. ధన పిశాచి ఎపిసోడ్, క్లైమాక్స్ కోసం కోసం మాత్రమే `జటాధర`. హర్రర్ మూవీస్, ఆథ్యాత్మిక అంశాలు ఇష్టపడే వారికి నచ్చే మూవీ.
రేటింగ్-2.5