అసలు లాజిక్ ఏంటంటే..
కనుమ పండుగ రోజు పశువులను పూజిస్తుంటారు. పశువులకు ఇంతటి గౌరవం ఇచ్చే గొప్ప సంస్కృతి ప్రపంచంలో చాలా తక్కువ ప్రదేశాల్లో ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. కనుమ రోజు రైతులు పశువులకు శుభ్రంగా స్నానం చేయించి.. పసుపు కుంకుమలతో పశువులను అలంకరిస్తారు. అనంతరం పశువులకు హారతి ఇచ్చి పూజిస్తారు. ఇక కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అనడానికి ఒక లాజిక్ ఉంది.
పూర్వం ప్రజలు ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండ్లను ఉపయోగించే వారు. ఎంత దూరమైనా ఎడ్ల బండ్లపైనే వెళ్లే వారు. అయితే పశువుల పండుగగా భావించే కనుమ రోజు వాటికి విశ్రాంతి కల్పించాలనే నియమాన్ని తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదనే ఓ నిబంధనను తీసుకొచ్చారని చెబుతుంటారు.
అయితే ఇప్పుడు ఎడ్ల బండ్లు లేవు వాటి స్థానంలో కార్లు వచ్చాయి. కానీ ఆచారాన్ని మాత్రం ఇంకా పాటిస్తూనే ఉన్నారు. ఇంకో ఒక్క రోజు ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో గడిపి తెల్లారి మళ్లీ జీవన ప్రయాణం మొదలు పెట్టాలని పెద్దలు చెబుతుంటారు. ఇదండి కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని చెప్పడంలో ఉన్న లాజిక్.