
రామాయణంలో సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత.. అశోక వనంలో బంధించిన విషయం మనకు తెలిసిందే. కానీ, యుగాలు మారినా, కాలం గడిచినా... ఆ అశోక వనం ఇప్పటికీ శ్రీలకంలోని కొండల్లో సజీవంగా ఉందని మీరు నమ్ముతారా? సీతాదేవి కోసం వెతుక్కుంటూ హనుమంతుడు అడుగుపెట్టిన నేల, సీతాదేవి రాముడి కోసం ఎదురు చూసిన ఆ పవిత్ర స్థలం ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలంటే..శ్రీలకంలోని ‘సీతా ఎలియా’ కి వెళ్లాల్సిందే...
వాల్మికీ రామాయణం, విష్ణు పురాణం, తులసీదాస్ రామచరిత మానస్ లలో అశోకవనం ప్రసావన ఉంది.రావణుడి బందీగా ఉన్నప్పటికీ, సీతాదేవి శ్రీరామునిపై తన భక్తిని, నిష్ఠను ఇక్కడే చాటుకుంది.
సీతాదేవిని వెతుక్కుంటూ హనుమంతుడు శ్రీలంక మొత్తం వెతికినప్పుడు... మొదటిసారి ఆమెను కనుగొన్నది ఈ అశోకవనంలోనే. శ్రీరాముని ఆనవాళ్లుగా ఉంగరాన్ని చూపించి, శ్రీరాముడు వచ్చి తీసుకువెళ్తాడని ఆమెకు నమ్మకం కలిగించింది కూడా ఇక్కడే. స్థానిక పురాణాల ప్రకారం, రావణుడు సీతాదేవిని అనేక గుహల గుండా తిప్పి... చివరికి ఈ ప్రదేశానికి తీసుకువచ్చాడని, ఇక్కడే ఆమె మళ్లీ సూర్యుని వెలుతురు చూసిందని నమ్ముతారు.
1. హక్గాలా బొటానికల్ గార్డెన్ (Hakgala Botanical Garden) ఇది పురాణ ప్రసిద్ధమైన అశోక వనంగా విస్తృతంగా ప్రాచుర్యం పొందింది.
సీతాదేవిని బంధించిన ప్రదేశంగా ప్రచారంలో ఉన్న 'సీతా పోకున' కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రదేశం ప్రకృతి సౌందర్యాలతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. గులాబీలు, రంగు రంగుల పువ్వులతో.. చూడటానికి చాలా అందంగా ఉంటుంది.
2. సీతా అమ్మన్ ఆలయం (Seetha Amman Temple) శ్రీలంకలోని అత్యంత పవిత్రమైన రామాయణ క్షేత్రాలలో ఇది ఒకటి.
ఇక్కడ సీతాదేవి, శ్రీరాముడు, లక్ష్మణుడు ,హనుమంతుల విగ్రహాలు కొలువై ఉన్నాయి.
ఆలయ సమీపంలోని రాళ్లపై హనుమంతుని పాదముద్రలు ఉన్నాయని నమ్ముతారు. సీతాదేవిని వెతుక్కుంటూ హనుమంతుడు వచ్చినప్పుడు ఈ పాదముద్రలు పడ్డాయని నమ్ముతారు.
3. సీతా ఝర్నా (Seetha Jharna) ఆలయం వద్ద ప్రవహించే రాతి ప్రవాహాన్నే 'సీతా ఝర్నా' అంటారు. బందీగా ఉన్న సమయంలో సీతాదేవి ఇక్కడే స్నానం చేసిందని స్థానిక నమ్మకం.
ఇక్కడికి ఎలా వెళ్లాలి..?
సీతా ఎలియా సందర్శించడానికి సముద్ర మట్టానికి సుమారు 1,868 మీటర్ల ఎత్తులో ఉండే ప్రసిద్ధ హిల్ స్టేషన్ 'నువర ఎలియా' (Nuwara Eliya) ను ప్రధాన కేంద్రంగా ఎంచుకోవడం చాలా అనుకూలంగా ఉంటుంది. శ్రీలంకలోని ప్రధాన నగరమైన క్యాండీ (Kandy) నుండి నువర ఎలియాకు రోడ్డు మార్గం (బస్సు/ట్యాక్సీ) ద్వారా లేదా సుందరమైన పర్వత ప్రాంతాల గుండా సాగే అందమైన రైలు ప్రయాణం ద్వారా సులభంగా చేరుకోవచ్చు.
నువర ఎలియా ప్రధాన పట్టణం నుండి సీతా ఎలియా గ్రామం కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అక్కడికి చేరుకోవడానికి లోకల్ ట్యాక్సీలు లేదా అక్కడ అందుబాటులో ఉండే ఆటోల ద్వారా చాలా తక్కువ సమయంలో వెళ్లవచ్చు.
ఆలయ నియమాలు..
ఈ సీతాదేవి ఆలయంలోకి ఉచిత ప్రవేశం ఉంది. ఆలయ నియమాల ప్రకారం సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి. పాదరక్షలు బయటే విడవాలి.
అయితే, ఈ ఆలయం కొండ ప్రాంతంలో ఉంది కాబట్టి.. వాతావరణం క్షణాల్లో మారిపోతూ ఉంటుంది. ఏడాది పొడవునా వర్షం లేదా పొగమంచు ఉండే అవకాశం ఉంది, కాబట్టి రెయిన్ కోట్ లేదా జాకెట్ వెంట ఉంచుకోవడం మంచిది.
రామ నవమి, దీపావళి పండుగల సమయంలో ఈ ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.