
ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉన్న ప్రంబనన్ ఆలయానికి ప్రతి సంవత్సరం మిలియన్ల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అసలు ఈ ఆలయానికి, భారతదేశానికి ఉన్న సంబంధం ఏంటి? భారత్ ఈ పురాతన ఆలయాన్ని ఎందుకు పునర్నిర్మిస్తోంది? ఈ విషయాలన్నీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి.
భారతదేశం, ఇండోనేషియా దేశాల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధం ఈనాటిది కాదు. శతాబ్దాల నాటి చరిత్ర దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. 9వ శతాబ్దంలో నిర్మించిన ఈ చరిత్రాత్మక ప్రంబనన్ ఆలయ కాంప్లెక్స్, భారత ఉపఖండానికి, ఆగ్నేయ ఆసియాకు మధ్య జరిగిన మతపరమైన, చారిత్రక మార్పిడికి అద్దం పడుతోంది. రెండు దేశాల మధ్య ఉన్న ఈ బలమైన బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇప్పుడు సరికొత్త అడుగులు పడ్డాయి.
ఇండోనేషియాలోని యోగ్యకర్త సమీపంలో ఉన్న ప్రంబనన్, ఆ దేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. హిందూ మతంలోని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, శివుడు కోలువైన ఆలయం ఇది. ఈ కాంప్లెక్స్ మధ్యలో త్రిమూర్తుల కోసం మూడు భారీ ఉపాలయాలు ఉన్నాయి. వీటిలో శివుడి ఆలయం అన్నింటికంటే ఎత్తైనది. ఇది దాదాపు 47 మీటర్ల ఎత్తుతో గంభీరంగా కనిపిస్తుంది. హిందూ విశ్వాన్ని ప్రతిబింబించేలా ఈ ఆలయ నిర్మాణాన్ని అప్పట్లో డిజైన్ చేశారు. ఒకప్పుడు ఈ ప్రాంగణంలో మొత్తం 240 ఆలయాలు ఉండేవని చరిత్ర చెబుతోంది. ఈ అద్భుతమైన రాతి శిల్పకళను చూడటానికే ప్రపంచం నలుమూలల నుండి టూరిస్టులు ఇక్కడికి తరలివస్తుంటారు.
ఈ ఆలయాల గోడలపై చెక్కిన రాతి శిల్పాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. భారతీయ పురాతన ఇతిహాసమైన రామాయణాన్ని ఈ గోడలపై అత్యంత అద్భుతంగా చెక్కారు. ఆలయ ప్రాంగణంలో నడుస్తూ ఉంటే, రాముడు, సీత కథను ఒక కామిక్ బుక్ లాగా విజువల్ గా చూస్తూ చదవొచ్చు. ఇండోనేషియా వెర్షన్ రామాయణాన్ని ఇక్కడి శిల్పాల్లో అద్భుతంగా ఆవిష్కరించారు.
ఇక ఇక్కడ జరిగే మరో ప్రధాన ఆకర్షణ 'రామాయణ బ్యాలెట్'. ప్రతి సంవత్సరం మే, అక్టోబర్ నెలల మధ్య, పౌర్ణమి రాత్రుల్లో ఈ ప్రంబనన్ ఆలయ బ్యాక్డ్రాప్లో ఓపెన్-ఎయిర్ థియేటర్ లో ఈ ప్రదర్శన ఇస్తారు. లైట్లతో వెలిగిపోయే ఆలయాల ముందు, సాంప్రదాయ జావానీస్ నృత్యం, సంగీతంతో రామాయణ కథను కళ్లముందు ఉంచుతారు. ఈ అద్భుతాన్ని చూడటానికి మిలియన్ల మంది తరలివస్తుంటారు.
రెండు దేశాల ఉమ్మడి నాగరికత వారసత్వాన్ని కాపాడటానికి భారతదేశం ఇప్పుడు ఇండోనేషియా ప్రంబనన్ ఆలయాన్ని పునర్నిర్మిస్తోంది. భారత ప్రభుత్వ యాక్ట్ ఈస్ట్ విధానంలో భాగంగా ఈ సాంస్కృతిక దౌత్యానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లీడ్ చేస్తోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన ఈ ఆలయాన్ని పూర్వ వైభవానికి తీసుకురావడానికి ఏఎస్ఐ నిపుణులు రంగంలోకి దిగారు.
ఈ చరిత్రాత్మక పరిరక్షణ ప్రాజెక్టును భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో సంయుక్తంగా ప్రారంభించారు. యోగ్యకర్తలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి ప్రాజెక్టుకు సంబంధించిన ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ భాగస్వామ్యం రెండు దేశాల మధ్య ఉన్న బలమైన అంతర్జాతీయ సంబంధాలకు, సాంస్కృతిక బంధానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ పురాతన ఆలయాన్ని పునర్నిర్మించడానికి ఏఎస్ఐ అనాస్టైలోసిస్ అనే ప్రత్యేకమైన పురావస్తు సాంకేతికతను ఉపయోగిస్తోంది. అంటే, కూలిపోయిన లేదా దెబ్బతిన్న పురాతన కట్టడాలను వాటి అసలు రాళ్లను ఉపయోగించే మళ్లీ నిర్మించడం అన్నమాట. రాళ్లన్నింటినీ ఒక పజిల్ లాగా ఒకదానితో ఒకటి అమర్చి, ఆలయానికి ఎలాంటి నష్టం జరగకుండా, దాని చారిత్రక ప్రామాణికత దెబ్బతినకుండా జాగ్రత్తగా రీబిల్డ్ చేస్తారు. ఈ వినూత్న పద్ధతి వల్ల ఆలయం తన పాత రూపాన్ని, పవిత్రతను కోల్పోకుండా ఉంటుంది.
భారతదేశం, ఇండోనేషియా మధ్య ఉన్న ఈ లోతైన నాగరికత సంబంధాల వల్లే, అంతర్జాతీయ పరిరక్షణ భాగస్వామ్యాలు ఈ ఉమ్మడి వారసత్వాన్ని రాబోయే తరాల కోసం కాపాడుతున్నాయి.