US Iran War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. చైనా తయారు చేసిన క్షిపణి వ్యవస్థలను పాకిస్థాన్ మార్గంగా ఇరాన్కు పంపనున్నారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.
చైనా తయారు చేసిన సుమారు 400 భుజంపై మోసుకెళ్లే ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలు (MANPADS) పాకిస్థాన్ ద్వారా ఇరాన్కు చేరనున్నాయనే కథనాలపై వైట్ హౌస్లో మీడియా ట్రంప్ను ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆయన, అలాంటి సమాచారం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తనతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేయబోమని హామీ ఇచ్చారని, ఆ హామీని ఉల్లంఘిస్తే తాను నిరాశ చెందుతానని వ్యాఖ్యానించారు.
25
వార్తల్లో ఏముంది?
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరాన్ తన వైమానిక రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చైనాతో ఒక ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం 300 నుంచి 400 వరకు చైనా తయారు చేసిన QW-12, FN-16 వంటి పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలను ఇరాన్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. వీటి విలువ సుమారు 60 నుంచి 70 మిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా. ఈ సరుకు చైనాలోని ఉరుమ్కీ నగరం నుంచి బయలుదేరి పాకిస్థాన్ మీదుగా ఇరాన్కు చేరుతుందని కథనాలు పేర్కొన్నాయి.
35
ఖండించిన చైనా, పాకిస్థాన్
ఈ ప్రచారాన్ని చైనా విదేశాంగ శాఖ పూర్తిగా తోసిపుచ్చింది. ఇలాంటి వార్తలకు ఎలాంటి ఆధారాలు లేవని, తాము ఎప్పటికీ శాంతి, వివాదాల పరిష్కారానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. మరోవైపు పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఐఎస్పీఆర్ కూడా ఈ ఆరోపణలను నిరాధారం అని పేర్కొంది. చైనా నుంచి ఇరాన్కు ఆయుధాల రవాణాలో పాకిస్థాన్ పాత్ర ఉందన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టంచేసింది.
ఇటీవలి కాలంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో పాకిస్థాన్ మధ్యవర్తిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ట్రంప్ కూడా పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ పాత్రను గతంలో ప్రశంసించారు. ఇలాంటి సమయంలో చైనా ఆయుధాలను పాకిస్థాన్ ద్వారా ఇరాన్కు పంపుతున్నారనే వార్తలు నిజమైతే, వాషింగ్టన్-ఇస్లామాబాద్ సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అధికారికంగా ఈ ఆరోపణలను ఇరు దేశాలు ఖండించడంతో పరిస్థితి ప్రస్తుతం స్పష్టత కోసం ఎదురుచూస్తోంది.
55
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య పెరిగిన ఆసక్తి
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి కథనాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవైపు ఇరాన్ తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు అమెరికా చైనా పాత్రపై నిఘా ఉంచుతోంది. అయితే చైనా, పాకిస్థాన్ చేసిన అధికారిక ఖండనలతో ఈ అంశంపై ఇంకా స్పష్టమైన ఆధారాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం అంతర్జాతీయ దౌత్యరంగంలో ఆసక్తికర చర్చగా మారింది.