ఇరాన్ నుంచి క్షిపణులు లేదా డ్రోన్ దాడులు జరిగే ప్రమాదం ఉందనే సమాచారంతో ముందస్తుగా చర్యలు తీసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఈ చర్యను “ప్రీవెంటివ్ స్ట్రైక్”గా పేర్కొంది. ఇరాన్ నుంచి ప్రతీకార దాడులు జరిగే అవకాశంతో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలకు రక్షిత ప్రాంతాల దగ్గరే ఉండాలని సూచించారు. ఈ ప్రకటనతో రెండు దేశాల మధ్య ఘర్షణ మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
స్పందించిన ఇరాన్
టెహ్రాన్పై దాడి జరిగినట్లు ఇరాన్ అధికారికంగా ధృవీకరించింది. అయితే ఎంత నష్టం జరిగిందో, ఎంతమంది మృతి చెందారో ఇంకా ప్రకటించలేదు. ఇజ్రాయెల్ ముందస్తు దాడి పేరుతో యుద్ధాన్ని ప్రారంభించిందని ఇరాన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశంపై అంతర్జాతీయ వర్గాలు దృష్టి సారించాయి.
అణు చర్చల తర్వాత దాడి
ఇరాన్ అణు కార్యక్రమంపై పాశ్చాత్య దేశాలతో చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం. ఈ దాడి వల్ల దౌత్య ప్రయత్నాలకు దెబ్బ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమమే ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణంగా కొనసాగుతోంది.
ఏం జరగనుంది.?
ఇజ్రాయెల్ దాడికి ఇరాన్ ఎలా ప్రతిస్పందిస్తుందన్నది ఇప్పుడు కీలక అంశంగా మారింది. ప్రతీకారంగా క్షిపణులు లేదా డ్రోన్ దాడులు జరిగే ప్రమాదం ఉందని అంచనాలు ఉన్నాయి. ఇరాన్ ప్రతీకారం తీసుకుంటే ఈ ఘర్షణ పూర్తి స్థాయి యుద్ధంగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మధ్యప్రాచ్య ప్రాంతం మొత్తం ఈ ఉద్రిక్తత ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది.