
Bangladesh Cabinet : బంగ్లాదేశ్ అనేది ముస్లిం మెజారిటీ దేశం... ఇక్కడ మైనారిటీలైన హిందువులపై ఇటీవల దాడులు పెరిగిపోయాయి. షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత రాజకీయ అస్థిరత ఏర్పడి మతపరమైన ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో హిందువులపై, వారి దేవాలయాలపై దాడులు మొదలయ్యాయి... ఈ క్రమంలోనే కొందరు హిందువులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలాంటి ఉద్రిక్త సమయంలో బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరిగాయి.. ఇందులో ఆసక్తికర పలితాలు వెలువడ్డాయి. ఈ ముస్లిం మెజారిటీ దేశంలో కొందరు మైనారిటీ హిందూ నాయకులు కూడా విజయం సాధించారు. వీరిలో ఒకరు గయేశ్వర్ చంద్ర రాయ్.
బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో తారిఖ్ రెహమాన్ సారథ్యంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అద్భుత విజయం సాధించింది. దేశంలోని మొత్తం 299 స్థానాల్లో BNP, దాని మిత్రపక్షాలు ఏకంగా 212 సీట్లు సాధించాయి... దీంతో తారిఖ్ నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడనుంది.
అయితే బంగ్లాదేశ్ లో ఏర్పాటయ్యే ఈ నూతన ప్రభుత్వంలో హిందూ నేతకు మంత్రి పదవి దక్కనుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) కీలక నేత గయేశ్వర్ చంద్ర రాయ్ను కొత్త కేబినెట్లో చేర్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఈసారి బిఎన్పి నుంచి ఇద్దరు హిందూ అభ్యర్థులు మాత్రమే గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. వారిలో గయేశ్వర్ చంద్ర రాయ్ ఒకరు.
తారిఖ్ రెహమాన్ కొత్త కేబినెట్లో మొత్తం 40 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది. పాత, కొత్త ముఖాలతో సమతుల్యం పాటించాలని తారిఖ్ భావిస్తున్నారు. మంత్రి పదవి ఖాయమైన వారిలో గయేశ్వర్ చంద్ర రాయ్ పేరు బలంగా వినిపిస్తోంది.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని కెరాని గంజ్ లో జ్ఞానేంద్ర చంద్ర రాయ్, సుమతి దంపతులకు 1951, నవంబర్ 1 న గయేశ్వర్ చంద్ర రాయ్ జన్మించారు. విద్యార్థి దశ నుండే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న గయేశ్వర్ 1978లో యువత ఏర్పాటుచేసిన బంగ్లాదేశ్ జాతీయవాది జుబో డాల్ లో చేరారు. ఇందులో అంచెలంచెలుగా ఎదిగి ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరారు.
అయితే ఎంపీ కాకుండానే బంగ్లాదేశ్ మంత్రిగా పనిచేసిన ఘనత గయేశ్వర్ ది. ఖలీదా జియా ప్రభుత్వంలో టెక్నోక్రాట్ కోటాలో బంగ్లా అటవీ, పర్యావరణ, మత్స్య, పశుసంవర్ధన శాఖ మంత్రిగా పనిచేశారు. 2008 లొ మొదటిసారి బిఎన్సి పార్టీ తరపున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేశారు... అయితే ఇందులో ఓడిపోయారు. ఇలా రాజకీయంగా ఒడిదుడుకులు ఎదురైనా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు... ఈ క్రమంలో తాజా ఎన్నికల్లో విజయం సాధించారు.. ఇప్పుడు మంత్రివర్గంలో కూడా చోటు దక్కించుకోబోతున్నారు గయేశ్వర్ చంద్ర రాయ్.
గయేశ్వర్ చంద్ర రాయ్ BNP విధాన రూపకల్పన బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని ఖలీదా కుటుంబంతో ఆయనకు చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. షేక్ హసీనా పాలనలో కూడా గయేశ్వర్ ఖలీదాకు సపోర్ట్ గానే నిలిచారు. 1978 నుంచి BNP సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈసారి గయేశ్వర్ బావమరిది నిటోయ్ రాయ్ చౌదరి కూడా BNP గుర్తుపై గెలిచారు. దీంతో గయేశ్వర్ పదవికి ప్రాధాన్యం పెరిగింది.
ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం... మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంఘీర్, సలావుద్దీన్ చౌదరి, మీర్జా అబ్బాస్, హఫీజ్ ఉద్దీన్ అహ్మద్, అమీర్ ఖోస్రు మహమూద్ చౌదరి, అబ్దుల్ మొయిన్ ఖాన్ లు బంగ్లాదేశ్ మంత్రివర్గంలో చేరడం దాదాపు ఖాయమైంది. వీరంతా గతంలో ఖలీదా జియా ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. కేబినెట్లో సమతుల్యం కోసం తారిఖ్ కొందరు కొత్తవారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. వీరిలో షామా ఒబైద్ (ఫరీద్పూర్-2), అఫ్రోజా ఖానమ్ రీటా (మాణిక్గంజ్-3), న్యాయవాది ఫర్జానా షర్మిన్ పుతుల్ (నటోర్-1) ఉన్నారు.
బంగ్లాదేశ్ జనాభాలో హిందూ సమాజం వాటా 9 శాతం. గతంలో కూడా ప్రభుత్వంలో హిందూ వర్గానికి చెందిన నేతలు మంత్రి పదవులు చేపట్టారు. షేక్ హసీనా ప్రభుత్వం ఎప్పుడూ కనీసం ఇద్దరు హిందువులను మంత్రులుగా నియమించేది. యూనస్ ప్రభుత్వంలోనూ హిందూ సమాజానికి చెందిన బిధాన్ చంద్ర పోద్దార్కు చోటు కల్పించారు.