
ప్రస్తుతం దేవుళ్లకు మాంసాన్ని నైవేధ్యంగా పెట్టవచ్చా? పెట్టకూడదా? అన్నదానిపై పెద్ద చర్చ సాగుతోంది. ఇటీవల పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన ప్రముఖ ఆద్యాత్మిక గురువు బాగేశ్వర్ బాబా (ధీరేంద్ర కృష్ణ గర్గ్) దుర్గాపూజ సమయంలో హిందువులు మాసాంహారం తినవద్దని, శాఖాహారమే తీసుకోవాలని పిలుపునివ్వడం ఈ వివాదానికి కారణమయ్యింది.
బెంగాలీలు దుర్గాపూజ సమయంలో చేపలు, ఇతర మాంసాహారాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు, ప్రసాదంగా కూడా ఇవే తీసుకుంటారు. అనాదిగా వస్తున్న ఈ సాంప్రదాయాన్ని బాగేశ్వర్ బాబా వ్యతిరేకించడం దుమారం రేపుతోంది. టిఎంసి, కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలే కాదు చివరికి హిందుత్వపార్టీగా గుర్తింపుపొందిన బిజెపి సైతం బాగేశ్వర్ బాబా వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
కేవలం బెంగాల్ లోనే కాదు దేశంలోని మరికొన్ని దేవాలయాన్ని దేవుళ్లకు మాంసాహారాన్ని నైవేధ్యంగా పెట్టే సాంప్రదాయాలు ఉన్నాయి. అన్ని హిందూ దేవాలయాల్లో నైవేద్య సంప్రదాయం ఒకేలా ఉండదు... కొన్ని శక్తి, తాంత్రిక, గ్రామ దేవతల ఆలయాల్లో మేక, కోడి వంటి జీవులను బలిచ్చి మాంసాహారమే నైవేద్యంగా పెడతారు. ఇంకొన్నిచోట్ల ఏకంగా ఆల్కహాల్ కూడా నైవేద్యంగా సమర్పించే ఆచారాలున్నాయి. ఇలా తెలంగాణలో గ్రామ దేవతలకు మాంసం, కల్లు సమర్పించడం చూస్తుంటాం. మరి దేశవ్యాప్తంగా మాంసం, మందు దేవుళ్లకు నైవేద్యంగా పెట్టే ప్రత్యేక ఆలయాలేవో ఇక్కడ తెలుసుకుందాం.
నవరాత్రుల టైంలో అమ్మవారి గుళ్ల దగ్గర నాన్-వెజ్ అమ్మకాలపై ప్రస్తుతం తీవ్ర చర్చ సాగుతోంది. ఈ సమయంలో మన దేశంలో ఉన్న హిందూ సంప్రదాయాల్లోని వైవిధ్యం గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది. దేశంలోని అన్ని దేవాలయాల్లో నైవేద్యం ఒకేలా ఉండదు. చాలా గుళ్లలో పండ్లు, స్వీట్లు, శాకాహార ప్రసాదాలు పెట్టినా.. కొన్ని శక్తి, తాంత్రిక, గ్రామదేవతల ఆలయాల్లో మాత్రం చేపలు, మాంసం, ఆల్కహాల్ కూడా నైవేద్యంలో భాగమే.
కామాఖ్య ఆలయంలో జంతుబలులు
అస్సాంలోని ప్రముఖ శక్తిపీఠం కామాఖ్య ఆలయం తాంత్రిక శక్తి పూజలకు పెట్టింది పేరు. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన పూజా విధానాల్లో జంతు బలులు ఇచ్చే సంప్రదాయం ఉంది. ఈ ఆలయంలోని పూజా విధానాలు శక్తి, తాంత్రిక సంప్రదాయాలతో చారిత్రకంగా ముడిపడి ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్లోని తారాపీఠంలో తారా దేవికి చేపలు, మేక మాంసం సమర్పిస్తారు. కొన్ని తాంత్రిక పూజల్లో ఆల్కహాల్ కూడా పెడతారు. అలాగే కోల్కతాలోని కాళీఘాట్ కాళీ ఆలయంలో కూడా జంతు బలి అనేది కొన్ని పూజల్లో చారిత్రకంగా భాగం. అయితే ఇక్కడ శాకాహార నైవేద్యాలు కూడా సమర్పిస్తారు.
తాజాగా దేవాలయాల వద్ద మాంసాంహారంపై వివాదం సాగుతున్నవేళ్ల స్వయంగా బెంగాల్ సీఎం సువేందు అధికారి మాంసాహారాన్ని ప్రసాదంగా తీసుకున్నారు. కేశికి అమావాస్యను పురస్కరించుకుని కాళీఘాట్ లోని కాళీమాత ఆలయాన్ని ఆయన సందర్శించారు... ఈ సందర్భంగా అమ్మవారికి సమర్పించే 'భోగ్' (చేప తల, ప్రైడ్ ఫిష్ తో చేసే వంటకం) ప్రసాదం తీసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దక్షిణేశ్వర్ ఆలయంలో చేపల కూర ప్రసాదం
కోల్కతాలోని మరో ఫేమస్ టెంపుల్ దక్షిణేశ్వర్ కాళీ ఆలయం. ఇక్కడ భవతారిణి దేవికి పెట్టే ప్రసాదంలో చేపల కూర ఉంటుంది. కానీ బెంగాల్లోని ఇతర కాళీ ఆలయాలకు భిన్నంగా ఇక్కడ జంతు బలులు ఇవ్వరు. దీన్నిబట్టి ఒకే ప్రాంతంలోని గుళ్లలో కూడా ఆచారాలు వేర్వేరుగా ఉంటాయని అర్థమవుతుంది.
పూరీ విమల ఆలయం
ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ ప్రాంగణంలో ఉన్న విమల ఆలయం ఒక శక్తి పీఠం. ఇక్కడ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అమ్మవారికి చేపలు, మేక మాంసం నైవేద్యంగా పెడతారు. ఇక కేరళలోని పరశ్శినికడవు ముట్టప్పన్ ఆలయంలో అయితే ఏకంగా ఎండు చేపలు, స్థానికంగా దొరికే కల్లును స్వామికి సమర్పిస్తారు.
మునియాండి స్వామి ఆలయం
తమిళనాడులో మధురై దగ్గర ఉన్న మునియాండి స్వామి ఆలయంలో ఏటా జరిగే జాతర చాలా స్పెషల్. ఇక్కడ చికెన్, మటన్ బిర్యానీ వంటి మాంసాహార పదార్థాలు వండి భక్తులకు ప్రసాదంగా పంచుతారు. ఇది స్థానిక దేవతల ఆరాధనకు, ఆహార సంస్కృతికి ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది.
ఆల్కహాల్ నైవేద్యంగా పెట్టే కాల భైరవ ఆలయం
మధ్య ప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న కాల భైరవ ఆలయంలో దేవుడికి మందు (ఆల్కహాల్) సమర్పించడం చాలా ప్రసిద్ధి. వారణాసిలోని కాల భైరవ పూజల్లో కూడా ఇలాంటి విభిన్న నైవేద్యాల ప్రస్తావన ఉంది. ఇవి భైరవుడి ఆరాధన, కొన్ని తాంత్రిక పద్ధతులతో ముడిపడి ఉంటాయి.
హిందూ మతంలో ఆహార నియమాలు..
చరిత్రలో కొన్ని వేదాల్లో జంతు బలుల ప్రస్తావన ఉన్నప్పటికీ, మాంసాహారమే హిందూ సంప్రదాయం అని చెప్పలేం. ప్రాంతం, సమాజం, కొలిచే దేవుడు, స్థానిక సంస్కృతిని బట్టి హిందూ ధర్మంలోని ఆచారాలు ఎంతో విభిన్నంగా ఉంటాయి. కాబట్టి చేపలు, మాంసం, ఆల్కహల్ నైవేద్యంగా పెట్టే ఈ గుళ్లలోని ఆచారాలను మొత్తం హిందూ మతానికి ఆపాదించకుండా, మన దేశంలోని అపారమైన సాంస్కృతిక వైవిధ్యంలో ఒక భాగంగా చూడటమే సరైనది.