
స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా.. ఇవన్నీ నేటి పిల్లల జీవితంలో భాగమైపోయాయి. చదువుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, ఆటలు ఆడటం, స్నేహితులతో మాట్లాడటం, తమ ఆలోచనలు, భావాలను వ్యక్తం చేయడం వంటి ఎన్నో అవకాశాలను డిజిటల్ ప్రపంచం చిన్నారులకు అందిస్తోంది. అయితే ఇదే డిజిటల్ ప్రపంచంలో వారిని వెంటాడే ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ బెదిరింపులు, ఆన్లైన్ గ్రూమింగ్, ఫొటోలు, వీడియోల ద్వారా దుర్వినియోగం, తప్పుడు సమాచారం, గోప్యత ఉల్లంఘనలు, డిజిటల్ లైంగిక వేధింపులు వంటి సమస్యలు పిల్లల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో చిన్నారులను ఆన్లైన్లో మరింత సురక్షితంగా ఉంచేందుకు చైల్డ్ రైట్స్ అండ్ యు (CRY) అనే NGO ‘టింగ్ టాంగ్’ పేరుతో అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. ఆన్లైన్లో ఏదైనా చేసే ముందు కాస్త ఆగి, రెండుసార్లు ఆలోచించాలనే సందేశాన్ని ఈ క్యాంపెయిన్ ద్వారా అందిస్తోంది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాలను CRY విశ్లేషించగా చిన్నారులపై సైబర్ నేరాల తీవ్రత స్పష్టమవుతోంది. 2017 నుంచి 2024 మధ్య దేశవ్యాప్తంగా పిల్లలపై నమోదైన సైబర్ నేరాలు దాదాపు 20 రెట్లు పెరిగాయి. 2017లో 88 కేసులు నమోదు కాగా.. 2024 నాటికి ఆ సంఖ్య 1,753కు చేరింది.
ఇందులో చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (CSAM)కు సంబంధించిన కేసుల పెరుగుదల మరింత ఆందోళన కలిగిస్తోంది. 2017లో దేశవ్యాప్తంగా CSAMకు సంబంధించిన కేసులు కేవలం 7 ఉండగా.. 2024లో అవి 1,099కు పెరిగాయి. అంటే ఈ విభాగంలో కేసుల సంఖ్య దాదాపు 157 రెట్లు పెరిగినట్లు CRY విశ్లేషణ వెల్లడిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లోనూ పరిస్థితి ఆందోళన కలిగించే విధంగానే ఉంది. 2017లో పిల్లలపై సైబర్ నేరాలకు సంబంధించి రాష్ట్రంలో ఒక్క కేసు మాత్రమే నమోదైంది. 2024లో ఈ సంఖ్య 55కు చేరింది. దేశవ్యాప్తంగా ఈ కేటగిరీలో నమోదైన కేసుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 3 శాతంగా ఉండగా.. రాష్ట్రం 11వ స్థానంలో నిలిచింది.
అయితే ఏపీలో సైబర్ నేరాల సంఖ్య 2022లో అత్యధికంగా 124 కేసులకు చేరిన తర్వాత తగ్గుతూ వచ్చింది. 2023లో 83 కేసులు నమోదు కాగా.. 2024లో 55 కేసులు నమోదయ్యాయి. అంటే గరిష్ట స్థాయితో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గినప్పటికీ, 2017తో పోలిస్తే మాత్రం ఇప్పటికీ చాలా ఎక్కువగానే ఉంది.
ముఖ్యంగా 2024లో నమోదైన 55 కేసుల్లో 38 కేసులు CSAMకు సంబంధించినవే. అంటే మొత్తం కేసుల్లో దాదాపు 70 శాతం ఈ విభాగానివే కావడం గమనార్హం. NCRB వీటిని ‘సైబర్ పోర్నోగ్రఫీ/చిన్నారులతో కూడిన అశ్లీల లైంగిక చిత్రాలను పెట్టడం లేదా ప్రచురించడం’ అనే విభాగంలో నమోదు చేస్తోంది.
నెల్లూరు, కాకినాడలో ఎక్కువ CSAM కేసులు
2024లో ఆంధ్రప్రదేశ్లో నమోదైన 38 CSAM కేసులను జిల్లాల వారీగా పరిశీలిస్తే కొన్ని ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నట్లు కనిపిస్తోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 9 కేసులు నమోదయ్యాయి. కాకినాడలో 8 కేసులు నమోదయ్యాయి. అంటే ఈ రెండు జిల్లాల్లోనే కలిపి 17 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 38 CSAM కేసుల్లో ఇది దాదాపు 45 శాతం.
తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో నాలుగేసి కేసులు నమోదయ్యాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మూడేసి కేసులు, ఏలూరులో రెండు కేసులు నమోదయ్యాయి. అనంతపురం, అన్నమయ్య, శ్రీకాకుళం, తిరుపతి, వైఎస్ఆర్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది.
ఫోన్ చేతిలో ఉన్నంత మాత్రాన భద్రత ఉన్నట్లు కాదు
డిజిటల్ ప్రపంచం పిల్లలకు అందిస్తున్న అవకాశాలతో పాటు, వారి భద్రతకు సంబంధించిన సవాళ్లు కూడా పెరుగుతున్నాయని CRY సౌత్ రీజినల్ డైరెక్టర్ జాన్ రాబర్ట్స్ పేర్కొన్నారు. పిల్లల భద్రత, శ్రేయస్సును కేవలం వారి చుట్టూ ఉన్న భౌతిక వాతావరణంతో మాత్రమే చూడలేమని ఆయన అన్నారు. పిల్లల చేతుల్లోని ఫోన్లు, ఇతర డిజిటల్ స్క్రీన్లపై జరిగే ఘటనలు కూడా వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయని గణాంకాలు సూచిస్తున్నాయని వివరించారు.
అంతేకాకుండా ఆన్లైన్లో తమకు ఎదురైన హానికరమైన అనుభవాలను పిల్లలు చాలాసార్లు బయటకు చెప్పకుండా మౌనంగా భరిస్తున్న పరిస్థితి కూడా ఉందని ఆయన తెలిపారు. తమను తప్పుపడతారనే లేదా తమనే శిక్షిస్తారనే భయంతో పిల్లలు సమస్యలను వెల్లడించకపోవచ్చని చెప్పారు.
పిల్లలపై సైబర్ నేరాలను అరికట్టేందుకు కేవలం నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం సరిపోదు. నేరాలను ముందుగానే గుర్తించడం, హానికరమైన కంటెంట్ను తొలగించడం, ఫిర్యాదు చేసే విధానాలను సులభతరం చేయడం, పిల్లలకు డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యం.
ఈ ఆలోచనతోనే CRY ‘టింగ్ టాంగ్’ ప్రచారాన్ని ముందుకు తీసుకొచ్చింది. డిజిటల్ నోటిఫికేషన్ లేదా అలర్ట్ శబ్దాన్ని గుర్తు చేసే ‘టింగ్ టాంగ్’ను పిల్లలు ఆన్లైన్లో తమకు తాము వేసుకునే ఒక హెచ్చరిక సంకేతంగా ఉపయోగించుకోవాలని క్యాంపెయిన్ సూచిస్తోంది.
నమ్మే ముందు – టింగ్ టాంగ్.
క్లిక్ చేసే ముందు – టింగ్ టాంగ్.
షేర్ చేసే ముందు – టింగ్ టాంగ్.
అంటే ఏదైనా సమాచారం, వ్యక్తి లేదా లింక్ను వెంటనే నమ్మడం, క్లిక్ చేయడం లేదా ఇతరులకు పంపడం కాకుండా.. ఒక్క క్షణం ఆగి ఆలోచించాలన్నదే ఈ ప్రచారం ప్రధాన సందేశం.
ఏపీలో సైబర్ భద్రత కోసం చర్యలు
చిన్నారుల ఆన్లైన్ భద్రతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పలు చర్యలను పరిశీలిస్తోంది. ముఖ్యంగా 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై వయోపరిమితులు విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. వయసు ధృవీకరణ కోసం డిజిలాకర్ ‘ఏజ్ టోకెన్స్’ను ఉపయోగించే విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన కూడా ఉంది.
అదే సమయంలో రాష్ట్ర పోలీసు విభాగం ‘ఏపీ సైబర్ గార్డ్’ వ్యవస్థ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్రాకింగ్ టూల్స్, ప్రత్యేక బృందాలు, సైబర్ వార్ రూమ్లను సమన్వయం చేస్తోంది. మహిళలు, పిల్లల రక్షణ కోసం రూపొందించిన శక్తి (SHAKTHI) భద్రతా వ్యవస్థకు డిజిటల్ పర్యవేక్షణను అనుసంధానించే చర్యలు కూడా ఉన్నాయి. ఫిర్యాదులు, అత్యవసర సహాయం కోసం జీరో ఎఫ్ఐఆర్ విధానంతో పాటు 1098 చైల్డ్ హెల్ప్లైన్, 1930 సైబర్ హెల్ప్లైన్, 112 అత్యవసర సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉంది.
పిల్లల ఆన్లైన్ భద్రతలో తల్లిదండ్రుల పాత్ర కీలకం
చిన్నారుల సైబర్ భద్రత బాధ్యత ఒక్క పోలీసు శాఖతోనో, ప్రభుత్వంతోనో ముగిసే విషయం కాదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలలు, కౌన్సెలర్లు, టెక్నాలజీ సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, సమాజం.. ఇలా ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది.
పిల్లలకు కేవలం ‘ఫోన్ వాడొద్దు’ అని చెప్పడం కంటే.. ఏ సమాచారాన్ని నమ్మాలి, ఏ లింక్ను క్లిక్ చేయకూడదు, వ్యక్తిగత ఫొటోలు లేదా వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదు, అనుమానాస్పద ప్రవర్తన ఎదురైతే వెంటనే విశ్వసనీయ పెద్దలకు చెప్పాలి వంటి విషయాలపై అవగాహన కల్పించడం ముఖ్యమని CRY చెబుతోంది. ఉపాధ్యాయులు, కౌన్సెలర్లకు తగిన శిక్షణ ఇవ్వడం, తల్లిదండ్రులు–పిల్లల మధ్య నిరంతర సంభాషణ కొనసాగించడం, పిల్లలకు అనుకూలంగా ఫిర్యాదు వ్యవస్థలను రూపొందించడం కూడా అవసరం.
టెక్నాలజీ సంస్థలకూ బాధ్యత
పిల్లల ఆన్లైన్ భద్రతలో సోషల్ మీడియా, టెక్నాలజీ ప్లాట్ఫారమ్ల పాత్ర కూడా కీలకమే. వయసు ధృవీకరణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం, పిల్లలకు సంబంధించిన ప్రమాదకర కంటెంట్ను వేగంగా గుర్తించి తొలగించడం, ఫిర్యాదు చేసే ప్రక్రియను సులభతరం చేయడం వంటి చర్యలు అవసరం అని CRY అభిప్రాయపడుతోంది.
సాంకేతిక నిఘా, నియంత్రణలతో పాటు పిల్లలకు డిజిటల్ అక్షరాస్యత పెంచడం కూడా సమానంగా ముఖ్యమని జాన్ రాబర్ట్స్ పేర్కొన్నారు. సైబర్ నేరాలు జరిగిన తర్వాత కఠిన చర్యలు తీసుకోవడం ఎంత అవసరమో.. అవి జరగకుండా ముందుగానే నివారించడం కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు.
‘టింగ్ టాంగ్’.. ఒక చిన్న అలవాటు పెద్ద రక్షణ
CRY చేపట్టిన ‘టింగ్ టాంగ్’ క్యాంపెయిన్ పిల్లలు, తల్లిదండ్రులు, సంరక్షకులు, ఉపాధ్యాయుల్లో డిజిటల్ భద్రతపై అవగాహన పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. పాఠశాలలు, సమాజ కేంద్రంగా జరిగే చిన్నారుల రక్షణ కార్యక్రమాల్లో ఆన్లైన్ భద్రతను భాగం చేయడం, పిల్లలకు డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా ఉండేందుకు అవసరమైన జ్ఞానం, ఆత్మవిశ్వాసాన్ని అందించడం దీని ఉద్దేశాల్లో ఉన్నాయి.
అలాగే వివిధ ప్లాట్ ఫామ్స్ తో భాగస్వామ్యాల ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, పాలనా–విధాన చర్చల్లో పిల్లల ఆన్లైన్ భద్రతను అత్యవసర అంశంగా నిలబెట్టడం కూడా క్యాంపెయిన్లో భాగంగా ఉంది.
డిజిటల్ ప్రపంచం నుంచి పిల్లలను పూర్తిగా దూరం చేయడం సాధ్యం కాదు. అంతేకాదు.. అది అవసరం కూడా కాదు. కానీ వారు ఆన్లైన్లోకి వెళ్లిన ప్రతిసారీ సురక్షితంగా వ్యవహరించేలా వారికి అవగాహన, ఆత్మవిశ్వాసం కల్పించడం మాత్రం అత్యవసరం. అందుకే నమ్మే ముందు, క్లిక్ చేసే ముందు, షేర్ చేసే ముందు.. ఒక్కసారి ‘టింగ్ టాంగ్’ అంటూ ఆగి ఆలోచించడం చిన్నారుల డిజిటల్ భద్రతలో ఒక ముఖ్యమైన అలవాటుగా మారాల్సిన అవసరం ఉంది.