
చిత్ర పరిశ్రమలో ఒక సినిమా షూటింగ్ ప్రారంభించుకుని ముగిసే వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.
అనేక కారణాలతో సినిమాలు ప్రారంభ దశలోనే ఆగిపోవడం, ప్రకటనతోనే ఆగిపోవడం, షూటింగ్ మధ్యలోకి వచ్చి ఆగిపోవడం, షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కి నోచుకోకపోవడం కూడా జరగొచ్చు. కొన్నిసార్లు స్టార్స్ కూడా మారిపోవచ్చు.
అయితే ఇలా నటి, మాజీ మంత్రి రోజా భర్తతో వెంకటేష్ ఓ మూవీ చేయాల్సింది. అది ఆగిపోవడానికి కారణమేంటి? అసలేం జరిగిందనేది ఇందులో తెలుసుకుందాం.
వెంకటేష్ అనుకోకుండా హీరో అయ్యారు. ఆయన విదేశాల్లో చదువుకుని బిజినెస్ పెట్టుకోవాలనుకున్నారు. కానీ నిర్మాత రామానాయుడికి సూపర్ స్టార్ కృష్ణ హ్యాండివ్వడంతో విదేశాల్లో ఉన్న వెంకటేష్ని పిలిపించి హీరోని చేశారు.
అలా `కళియుగ పాండవులు` చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు వెంకీ. ఆ తర్వాత వరుసగా విజయవంతమైన మూవీస్ చేస్తూ విక్టరీ వెంకటేష్గా పేరు తెచ్చుకున్నారు.
వెంకీ చాలా వరకు రీమేక్ సినిమాలు చేసి, సక్సెస్ కొట్టారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే చిత్రాలతో మెప్పించారు. శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్ కి అంతగా కనెక్ట్ అయిన హీరోగా వెంకీ నిలవడ విశేషం.
ఇదిలా ఉంటే వెంకటేష్.. రోజా భర్త ఆర్కే సెల్వమణి కాంబినేషన్లో ఓ సినిమా రావాల్సింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టార్ హోటల్లో ఈ మూవీని ప్రకటించారు.
ఇందులో వెంకటేష్ పైలట్ ఆఫీసర్గా కనిపిస్తారని తెలిపారు. ఈ సినిమాకి `గీతాంజలి` వంటి హిట్ మూవీని నిర్మించిన సీఎల్ నరసారెడ్డి నిర్మాత. ఆయనే వెంకటేష్, రామానాయుడు, ఆర్కే సెల్వమణి సమక్షంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
వెంకటేష్, సెల్వమణి కాంబినేషన్లో అదిరిపోయే సినిమా చేస్తున్నామని, ఇందులో వెంకీ పైలట్ ఆఫీసర్గా కనిపిస్తారని వెల్లడించారు.
ఈ ప్రెస్మీట్లో ఉన్న వెంకీ ఫాదర్ రామానాయుడు కూడా ఉత్సాహంతో ఆర్కే సెల్వమణితో తమ బ్యానర్లోనూ ఓ సినిమా చేయాలని ఉందని వెల్లడించారు. అయితే వెంకీ, సెల్వమణి కాంబినేషన్లో మూవీ పట్టాలెక్కలేదు.
కారణం స్క్రిప్ట్ అనే తెలిసింది. కథ సరిగా రాలేదని, వెంకీకి తగ్గట్టుగా మార్పులు చేసేందుకు దర్శకుడు నో చెప్పాడని. దీంతో సినిమానే ఆపేశారని తెలుస్తోంది. ఇలా రోజా భర్త సెల్వమణి, వెంకటేష్ కాంబినేషన్లో మూవీ కేవలం ప్రకటనకే పరిమితమయ్యింది. ఈ మూవీకి సంబంధించిన ప్రకటన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే ఇది 1990-95 మధ్యలో జరిగిందని సమాచారం. అప్పటికే సెల్వమణి `పోలీస్ అధికారి`(పూలన్ వసరణై), `కెప్టెన్ ప్రభాకర్` వంటి చిత్రాలను రూపొందించారు. అవి మంచి హిట్ అయ్యాయి.
ఇక దర్శకుడు సెల్వమణి తమిళంలో ఎక్కువగా సినిమాలు చేశారు. విజయకాంత్, మమ్ముట్టి, ప్రశాంత్, అర్జున్ వంటి వారితో ఆయన మూవీస్ చేశారు. ఆయన రూపొందించిన చిత్రాలు తెలుగులోనూ డబ్ అయి విడుదలయ్యాయి.
అంతేకాదు తెలుగులోనూ ఓ సినిమా చేశారు. రమ్యకృష్ణ మెయిన్ రోల్లో `దుర్గ` అనే సినిమాని రూపొందించారు. ఆయన తీసి ఏకైక తెలుగు సినిమా ఇది. మంచి ఆదరణే పొందింది.
వెంకటేష్ చాలా ఏళ్ల తర్వాత భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సంక్రాంతికి ఆయన `సంక్రాంతికి వస్తున్నాం` అనే చిత్రంతో వచ్చారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకుడు.
పండగ టైమ్లో వచ్చి నిర్మాతలకు కాసుల పంట పండించింది. ఈ చిత్రం ఏకంగా రూ.350కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. వెంకీ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది.
ఇప్పుడు ఆయన చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న `మెగా 157`లో గెస్ట్ రోల్ చేస్తున్నారు. దీంతోపాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు వెంకీ. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది.