
ఎన్టీఆర్ ఇటీవల `వార్ 2`లో నటించారు. హృతిక్ రోషన్ తో కలిసి నటించిన ఈ స్పై యాక్షన్ మూవీ ఆడియెన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. మొత్తంగా డిజాస్టర్గా నిలిచింది. దీంతో ఎన్టీఆర్ చేయాల్సిన చాలా సినిమాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. `దేవర 2` ఆగిపోయిందనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు హిందీలో చేయాల్సిన మరో స్పై యాక్షన్ థ్రిల్లర్ ని కూడా పక్కన పెట్టారట. మరోవైపు నెల్సన్ దిలీప్ కుమార్తో సినిమా ఉంటుందా? లేదా అనేది డౌట్గా మారింది. ఈ క్రమంలో ఇప్పుడు త్రివిక్రమ్ మూవీ కూడా ఆగిపోయింది.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో `అరవింద సమేత` మూవీ వచ్చింది. ఇది బాగానే ఆడింది. ఆ తర్వాత మరో సినిమా అనుకున్నారు. `ఆర్ఆర్ఆర్` తర్వాత త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ మూవీని ప్రకటించారు. కానీ అది ఆగిపోయింది. ఆ స్థానంలో కొరటాల శివతో సినిమాకి కమిట్ అయ్యాడు తారక్. అలా `దేవర` సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇది సౌత్లో అంతగా ఆడలేదు, కానీ నార్త్ లో మాత్రం బాగానే ఆడింది.
అయితే మరోసారి ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా సెట్ అయ్యింది. మైథలాజికల్ మూవీగా దీన్ని రూపొందించేందుకు ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు రాని ఓ కథని ఇందులో చూపించబోతున్నారట. త్రివిక్రమ్ రైటింగ్ వేరే లెవల్ అని నిర్మాత నాగవంశీ చెప్పారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమా ఉంటుందని చెప్పారు. `గాడ్ ఆఫ్వార్` అనే బుక్ ప్రధానంగా ఈ మూవీని రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఈ పుస్తకాన్ని పట్టుకుని ఎన్టీఆర్ చాలా రోజుల తిరిగారు. రెండు మూడుసార్లు ఆ పుస్తకంతో ఎయిర్పోర్ట్ లో కనిపించారు. దీంతో ఈ సినిమా ఓకే అయ్యిందని అంతా భావించారు. ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ ఇదే అని అనుకున్నారు.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ మరోసారి క్యాన్సిల్ అయ్యింది. ఎన్టీఆర్ చేయాల్సిన మూవీ ఇప్పుడు అల్లు అర్జున్ వద్దకు వెళ్లింది. నిజానికి త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో చాలా రోజుల క్రితమే సినిమా రావాలి. `అల వైకుంఠపురములో` తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ మధ్యలో ఆగిపోయింది. బన్నీ.. అట్లీతో సినిమాకి కమిట్ కావడంతో త్రివిక్రమ్ని పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ని కాదని మళ్లీ బన్నీతోనే సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు మాటల మాంత్రికుడు. బన్నీ కూడా ఈ మైథాలజీ కథకి ఓకే చెప్పారట. దీంతో త్రివిక్రమ్.. తారక్కి హ్యాండిచ్చాడని సమాచారం. ఈ మూవీని కూడా నాగవంశీనే నిర్మించబోతున్నారు.
అయితే ఎన్టీఆర్ నుంచి ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ వద్దకు వెళ్లడానికి అసలు కారణం వేరే ఉందట. కథలోని పాత్రకి ఎన్టీఆర్ సూట్ కావడం లేదట. ఎన్ని రకాలుగా చూసినా సెట్ కావడం లేదని, అందుకే ఆయన్ని వద్దు అనుకుంటున్నారని సమాచారం. అందుకే ఇది బన్నీ వద్దకు వెళ్లిందని సమాచారం. మరి కారణం ఇదేనా? తెరవెనుక ఇంకా ఏదైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. దీంతో ఇప్పుడు ఒక్కసారిగా తారక్ ఖాళీ అయిపోయారు. ఆయన చేతిలో ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ ఒక్కటే ఉంది. ఆ తర్వాత సినిమాలకు సంబంధించి క్లారిటీ లేదు. పైగా అన్నీ సస్పెన్స్ లో ఉన్నాయి. ఒక పాన్ ఇండియా హీరోకి ఇలాంటి పరిస్థితి రావడం ఆశ్చర్యంగా మారింది. ఇదంతా అనుకోకుండా జరుగుతుందా? కావాలని జరుగుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రస్తుతం త్రివిక్రమ్.. వెంకటేష్ హీరోగా `ఆదర్శ కుటుంబం`(హౌజ్ నెం 47) అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. షార్ట్ గా `ఏకే 47` పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఆ మధ్యనే గ్రాండ్గా ప్రారంభమైన ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో దీన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. అనంతరం బన్నీ సినిమాని ప్రారంభిస్తారట మాటల మాంత్రికుడు. ఫిబ్రవరి నుంచి ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం.