
నవంబర్ నెల ఈ వారంతో ముగియబోతుంది. అయితే ఈ నెలలో పెద్దగా హిట్ అయిన చిత్రాలేవీ లేవు. ఒకటి రెండు చిన్న చిత్రాలు తప్ప దాదాపు అన్నీ డిజప్పాయింట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు నవంబర్ నెల చివర్లో పెద్ద సినిమాలు రాబోతున్నాయి. అందులో రామ్ పోతినేని హీరోగా నటించిన మూవీ ఉంది. దీంతోపాటు మహేష్ బాబు సినిమా రీ రిలీజ్ అవుతుంది. అలాగే మరో నాలుగు చిన్న చిత్రాలు ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాయి. ఆ చిత్రాలేంటో తెలుసుకుందాం.
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో ప్రధానంగా ఉంది ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన `ఆంధ్రా కింగ్ తాలూకా` సినిమా ఉంది. మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న గురువారమే విడుదలవుతుంది. అయితే రామ్ కి హిట్స్ లేక చాలా రోజులవుతుంది. ఈ సినిమాతో అయినా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. ఓ హీరో, అభిమాని మధ్య జరిగే కథ ఇది. చాలా కొత్తగా ఉండబోతుందని టీజర్, ట్రైలర్ని బట్టి అర్థమవుతుంది. మరి ఈ సినిమా అయినా రామ్కి హిట్ ఇస్తుందా అనేది చూడాలి.
ఈ శుక్రవారం విడుదల కాబోతున్న చిత్రాల్లో కీర్తిసురేష్ `రివాల్వర్ రీటా` కూడా ఉంది. తమిళంలో రూపొందిన ఈ సినిమాని అదే పేరుతో ఈ నెల 28న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇందులో రాధికా శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా, సునీల్ విలన్గా నటించారు. జేకే చంద్రు దర్శకత్వం వహించారు. తెలుగు తెరపై కీర్తి సురేష్ కనిపించి రెండేళ్లు అవుతుంది. చివరగా ఆమె `భోళాశంకర్`లో నటించింది. ఆ తర్వాత కీర్తి మరే తెలుగు సినిమా చేయలేదు. అదే సమయంలో కీర్తిసురేష్కి సక్సెస్ లేక కూడా చాలా రోజులే అవుతుంది. దీంతో యాక్షన్ కామెడీగా రూపొందిన ఈ మూవీ అయినా మహానటికి హిట్ ఇస్తుందా అనేది చూడాలి.
ఈ శుక్రవారం యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన `మరువ తరమా` సినిమా కూడా విడుదల కాబోతుంది. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా దీన్ని రూపొందించారు. ఇందులో హరీష్ ధనుంజయ, అతుల్య చంద్ర అవంతి హరి నల్వాల ప్రధాన పాత్రలు పోషించారు. చైతన్య వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్పై రమణ మూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్, వి విజయ్ కుమార్ రాజు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచాయి. నవంబర్ 28న థియేటర్లలో `మరువ తరమా` సినిమా గ్రాండ్గా రిలీజ్ కానుంది. పొయెటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా అనేది చూడాలి.
ఈ శుక్రవారం విడుదల కాబోతున్న చిత్రాల్లో రాయ్ లక్ష్మి నటించిన `జనతా బార్` కూడా ఉంది. ప్రదీప్ సింగ్ రావత్, దీక్షా పంత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రామణ మొగిలి దర్శకుడు. ఓ లేడీ రివల్యూషనరీ జర్నీ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాని ఈ నెల 28న ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. చాలా రోజులనాటి ఈ సినిమాని ఇప్పుడు విడుదల చేయడం గమనార్హం. సక్సెస్ లేక ఫేడౌట్ అయిన రాయ్ లక్ష్మికిది బౌన్స్ బ్యాక్ అయ్యే సినిమా అవుతుందా అనేది చూడాలి.
కోలీవుడ్ హీరో ధనుష్ `సార్`, `కుబేర` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. అలాగే ఇటీవల `ఇడ్లీకొట్టు` చిత్రంతో అలరించారు. కానీ ఈ చిత్రం ఆడలేదు. ఇప్పుడు మరో మూవీతో తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నారు. ఆయన హిందీలో `తేరి ఇష్క్ మే` అనే చిత్రంలో నటించారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధనుష్ సరసన కృతి సనన్ నటిస్తోంది. ఈ సినిమా హిందీతోపాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో దీన్ని `అమర కావ్యం` పేరుతో విడుదల చేస్తున్నారు. నవంబర్ 28 న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఇది తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా అనేది చూడాలి.
ఈ వారం పోటీలోకి మహేష్ బాబు కూడా వచ్చారు. ఆయన హీరోగా నటించిన `బిజినెస్మేన్` మూవీ 2012లో విడుదలై ఆకట్టుకుంది. భారీ విజయాన్ని సాధించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో కాజల్ హీరోయిన్గా నటించగా, సోనూ సూద్ విలన్గా నటించారు. ముంబాయి గ్యాంగ్ స్టర్ కథతో తెరకెక్కిన ఈ మూవీ పెద్ద హిట్ అయ్యింది. రెండేళ్ల క్రితం రీ రిలీజ్ చేశారు. అప్పుడు దాదాపు ఐదు కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఇప్పుడు మళ్లీ 4కేతో రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 29న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మరి ఇప్పుడు ఏ స్థాయిలో వసూళ్లని రాబడుతుందో చూడాలి.