సుకుమార్ కెరీర్ ప్రారంభమై ఇరవై ఏళ్లు అవుతుంది. మంగళవారంతో ఈ మూవీ ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. సుకుమార్ కెరీర్ కూడా ఈ మూవీతోనే ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో `20ఏళ్ల ఆర్య` పేరుతో పెద్ద సెలబ్రేషన్ ఈవెంట్ని నిర్వహించారు. ఇందులో `ఆర్య` టీమ్ అంతా పాల్గొన్నారు. ఒక్క హీరోయిన్ తప్ప.
ఈ సందర్భంగా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అంతా ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఎమోషనల్ అయ్యారు. అప్పటి ఫన్నీ విషయాలను చెప్పుకుని నవ్వుకున్నారు. ఈ క్రమంలో సుకుమార్ మాట్లాడుతూ, ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. `ఆర్య` జ్ఞాపకాలను పంచుకున్నారు సుకుమార్. ఇందులో ఐటెమ్ సాంగ్ గురించి చెప్పుకొచ్చారు. ముందు ఐటెమ్ సాంగ్ లేదట.
మణిరత్నం సినిమాలోని చెలియా చెలియా లాంటి సాంగ్ పెట్టాలనుకున్నారు సుకుమార్. కానీ దిల్ రాజు కారణంగా ఐటెమ్ సాంగ్ పెట్టారట. `అ అంటే అమలాపురం` అలా వచ్చిందే అని చెప్పారు. దానికి ముందు దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ ఇవ్వగా, వేటూరి రొమాంటిక్ పదాలతో ఐటెమ్ సాంగ్ లిరిక్ ఇచ్చారట. కానీ తాను అనుకున్నది ఇది కాదు కదా అని అనుకున్నారట. అయితే రిలీజ్ అయ్యాక పెద్ద హిట్ కావడంతో ఇకపై తన అన్ని సినిమాల్లోనూ ఐటెమ్ సాంగ్ పెట్టాల్సి వస్తుందన్నారు.
మరోవైపు సంఘటన ఇందులో షేర్ చేసుకున్నారు. ఈ సాంగ్ కోసం ముంబయి నుంచి ఓ హీరోయిన్ని బుక్ చేశారట. ఆమె బిజినెస్ క్లాస్లో రావాల్సి ఉంది. ఆ బిజినెస్ క్లాస్ టికెట్ వేయలేక వద్దన్నాడట దిల్ రాజు. దీంతో ఆ కొరియోగ్రాఫర్ పక్కనే ఉన్న ఓ అమ్మాయిని సెట్ చేశారు. ఆమెనే అభినయ శ్రీ. ఆమె చేసిన డాన్స్ కి అంతా ఫిదా అయిపోయారట. ఆ ఎనర్జీకి తాను షాక్ అయనట్టు చెప్పారు బన్నీ. ఐదు నిమిషాల్లో టేక్ చేసి వెళ్లిపోతుందట. అలా అభినయ ఇందులో ఐటెమ్ సాంగ్ చేసిందని చెప్పారు.
ఇక సుకుమార్ మరో ఆసక్తికర సంఘటన పంచుకున్నారు. సినిమా రిలీజ్కి ఇంకా మూడు రోజులే ఉంది. డబ్బింగ్, మిక్సింగ్ జరుగుతున్నాయి. ఫైనల్ కరెక్షన్స్ లో ఉన్నారు. ఆ సమయంలో బన్నీని పిలిచి మాంటేజ్ సాంగ్ తీశారట. ఒక్క నిమిషం సీన్ కోసం రెయిన్లో ఆ షూట్ చేశారట. అయితే సినిమా అప్పటికే అయిపోయింది. మళ్లీ షూటింగ్ ఏంటి అనేది దిల్ రాజుకి పెద్ద ప్రశ్న. తాను మొదట ఒప్పుకోలేదట.
దీంతో మాట మాట పెరిగి ఇద్దరికి పెద్ద గొడవ అయ్యిందట. నువ్వేంటి అనే మాట కూడా వాడాడట సుకుమార్. చివరికి ఏం చేయలేక దిల్ రాజు కాళ్ల మీద పడ్డాడట. అలా మూడు సార్లు దిల్ రాజు కాళ్ల మీద పడ్డానని తెలిపారు సుకుమార్. చివరికి ఆయన విని ఓకే చెప్పారని తెలిపారు సుకుమార్. అలా మూడు రోజుల ముందు మాంటేజ్ సాంగ్తీసి పెట్టినట్టు తెలిపారు సుకుమార్.
అంతకు ముందు తాను మణిరత్నంలా, కృష్ణవంశీలా, ఆర్జీవీలా సెట్లో బిల్డప్ కొట్టాలి, షూటింగ్ క్యాన్సిల్ చేయాలని అనుకునేవాడట. కానీ ప్రాక్టికల్ గా సీన్ వేరు ఉంటుందని, అంతా యాటిట్యూడ్ అనుకుంటారు, కానీ ఎన్నో దెబ్బలు తిని, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో పస్తులుండి ఇక్కడి వరకు వచ్చి ఉంటామని తెలిపారు సుకుమార్. ఎంతో అడ్జెస్ట్ మెంట్లు ఉంటాయని, ఎంతో రాజీపడితేనే ఇవన్నీ సాధ్యమవుతుందని తెలిపారు. ఇప్పుడు వచ్చే దర్శకులు ఇవన్నీ గుర్తుంచుకోవాలని తెలిపారు సుకుమార్.