వరుసగా ఆరు హిట్లు.. అయినా ఆ స్థాయి సినిమాలకు దూరంగా అడివి శేష్.. ఇకనైనా మొదలెడుతారా?

First Published Dec 13, 2022, 12:40 PM IST

టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నారు. వరుసగా ఆరు హిట్ చిత్రాలను ఖాతాలో వేసుకున్నారు. నిజంగా ఇది రికార్డే. అయినా పెద్ద బ్యానర్లలో భారీ బడ్జెట్ చిత్రాలు రాకపోవడం ఆసక్తికరంగా మారింది.
 

టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏండ్లు దాటినా నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తున్నారు. కేరీర్ మొదట్లో ఓర్పుగా అవకాశాలను దక్కించుకుంటూ తన సత్తా చాటారు. 
 

2002లో ‘సొంతం’ సినిమాతో చిన్న పాత్రలో వెండితెరకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతూ వస్తున్నారు. నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా, రచయితగా తనను తాను నిరూపించుకున్నాడు. ‘కర్మ’,‘కిస్’ చిత్రాలకు రచనదర్శకత్వం వహించి గుర్తింపు తెచ్చుకున్నాడు. 
 

అడివి శేష్ కేరీర్ ను మలుపుతిప్పింది మాత్రం 2016లో రిలీజ్ అయిన ‘క్షణం’. అప్పటి నుంచి వరుసగా  హిట్ చిత్రాలనే అందుకుంటున్నారు. ‘క్షణం, అమీ తుమీ, గూఢాచారి, ఎవరు, మేజర్, హిట్ 2’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ ఆరు సినిమాలతో సక్సెస్  అందుకుని డబుల్ హ్యాట్రిక్ సాధించారు. ఇటీవల కాలంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత ఆ ఘనత అడివి శేష్ కే దక్కింది. 
 

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవడం.. అందులోనూ వరుసగా ఆరు హిట్ చిత్రాలను తన ఖాతాలోకి చేర్చడం నిజంగా రికార్డుగానే భావించాలి. ఇన్ని హిట్లు అందుకుంటున్నా.. అడివిశేష్ మాత్రం స్టార్ హీరోల జాబితాలోకి చేరలేకపోయాడు. ఇంకా మధ్య తరహా చిత్రాలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 

ప్రస్తుతం అడివి శేష్ స్థాయికి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించాల్సి ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. హిట్ బై హిట్ వస్తున్నా.. ఆ విషయం వెనకే ఉన్నారంటూ అభిప్రాయపడుతున్నారు. విభిన్న కథలను ఎంచుకోవడంతో పాటు స్క్రీన్ పై అడివి శేష్ అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇస్తుండటంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గట్టిగానే పెరిగిపోయింది. దీంతో అడివి శేష్ కూడా భారీ బడ్జెట్ సినిమాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
 

అడివి శేష్ సినిమాల్లో ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ ను దక్కించుకున్న చిత్రం ‘గూఢాచారి’. ప్రస్తుతం దీనికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు. అయితే ‘గూఢాచారి 2’ను మాత్రం పాన్ ఇండియా సినిమా.. భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ తో శేష్ అలరించగా.. సీక్వెల్ తోనూ గట్టి హిట్ కొడతాడని ఆశిస్తున్నారు. 
 

click me!