
శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న 'శేయోన్' సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. ఆయన పుట్టినరోజున ప్రోమోను కూడా విడుదల చేశారు. దీనికి దర్శకుడు శివకుమార్ మురుగేశన్. శివకుమార్ కథ చెప్పగానే శివకార్తికేయన్కు బాగా నచ్చేసిందట. వెంటనే నటించడానికి ఓకే చెప్పి, డేట్స్ కూడా ఇచ్చేశాడు. ఈ సినిమాకు 'సేయాన్' అని పేరు పెట్టారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
కథకు కారణం: మధురైలోని ఉసిలంపట్టి దగ్గర కరుమాత్తూర్ అనే ప్రాంతంలో విరుమాండి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని కులదైవంగా భావించే వాళ్లు మురుగన్ను పూజించరు. దీని వెనుక ఓ పెద్ద కథే ఉంది. కరుమాత్తూర్కు కావలి దైవంగా పేయ్కామన్ అనే అతను ఉండేవాడు. అప్పుడు పేచ్చియమ్మన్ ఆ ఊరికి వచ్చింది. ఆ ఊరు ఆమెకు బాగా నచ్చడంతో, అక్కడి ప్రజలకు కావలి దైవంగా ఉండాలని కోరుకుంది. కానీ పేయ్కామన్ ఆమెను అడ్డుకున్నాడు. దీంతో కోపగించుకున్న పేచ్చియమ్మన్, పేయ్కామన్ను నాశనం చేయడానికి శివుడి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుంది. కానీ శివుడు ధ్యానంలో ఉండటంతో, ఆమె తన గోడు వెళ్లబుచ్చుకోలేక వెనుదిరిగింది.
పేచ్చియమ్మన్ అన్న విరుమాండి, మలయాళ దేశంలో (కేరళ) కొలువై ఉన్నాడు. మలయాళ దేశంలో ఆయన చాలా శక్తిమంతుడని చెబుతారు. పేచ్చియమ్మన్ ఆయన దగ్గరకు వెళ్లి, జరిగినదంతా చెప్పి సహాయం కోరింది. దానికి విరుమాండి, 'నేను నీకోసం అక్కడికి వస్తాను. కానీ నువ్వు నాకు రోజూ బలిగా ఒక గర్భిణిని, ఒక గర్భంతో ఉన్న ఆవును ఇవ్వాలి' అని షరతు పెట్టాడు. ఇది సాధ్యం కాదని తెలిసినా, పేయ్కామన్ను నాశనం చేయాలనే పట్టుదలతో పేచ్చియమ్మన్, 'నువ్వు అడిగింది ఇస్తాను' అని అబద్ధం చెప్పి విరుమాండిని తనతో పాటు తీసుకొచ్చింది.
ఇక్కడికి వచ్చాక విరుమాండి, పేయ్కామన్తో గొడవకు దిగాడు. పోరాటం తీవ్రమవుతున్నప్పుడు, విరుమాండి పేయ్కామన్ గుర్రం కాలు విరగ్గొట్టాడు. గొడవ తారస్థాయికి చేరడంతో, మధురై నగరం తట్టుకోలేదని భావించిన చొక్కన్ (శివుడు), మీనాక్షి, మురుగన్ ఆ గొడవను ఆపడానికి వచ్చారు. చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. దానికి మురుగన్ నాయకత్వం వహించాడు. పేయ్కామన్కు, విరుమాండికి మధ్య ఒక పందెం పెట్టారు. కరుమాత్తూర్ నుంచి మీనాక్షి అమ్మవారి గోపురాన్ని తాకాలని మురుగన్ చెప్పాడు. అయితే, విరుమాండి అప్పటికే పేయ్కామన్ గుర్రం కాలు విరగ్గొట్టడంతో, మురుగన్ గుర్రాలను మార్చేశాడు. పేయ్కామన్ గుర్రాన్ని విరుమాండి తీసుకోవాలని చెప్పాడు.
విరుమాండిని ఊరికి తీసుకొచ్చి, గొడవ ముగిశాక, అతను కోరిన బలి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేయాలో తెలియని పేచ్చియమ్మన్, తన ఉంగరాన్ని తీసి ఓ బావిలో పడేసింది. 'అన్నా, నా ఉంగరం ఆ బావిలో పడిపోయింది, తీసి ఇవ్వు' అని అడిగింది. విరుమాండి ఆ బావిలోకి దూకగానే, పేచ్చియమ్మన్ ఆ బావిని ఒక గొలుసుతో కట్టి, పైన ఒక రాయి పెట్టి మూసేసింది.
'అన్నా, నీకోసం నేను ఈ బావిలో దూకితే, నన్ను ఇలా బంధించావేంటి?' అని విరుమాండి అడిగాడు. దానికి పేచ్చియమ్మన్, 'అన్నా, నువ్వు అడిగిన గర్భిణిని, గర్భంతో ఉన్న ఆవును నేను ఇవ్వలేను. నీకోసం నేను గర్భంతో ఉన్న ఒక మేకను మాత్రం బలిగా ఇస్తాను. అది కూడా ఆడి మాసంలో వచ్చే శుక్రవారం (ఆడి వెళ్ళి) మధ్యాహ్నం పూజ రోజున మాత్రమే ఇస్తాను' అని చెప్పి అతన్ని శాంతింపజేసింది. ఆ ఒక్కరోజు మాత్రమే విరుమాండి ఆ బావిలో నుంచి బయటకు వచ్చి, ఆ మేకను బలిగా స్వీకరిస్తాడని నమ్ముతారు. ఈ కథే సినిమాకు ప్రేరణ.
కథలో ఉన్నట్లుగా, విరుమాండిని పూజించేవాళ్లు మురుగన్ను కూడా పూజిస్తారా? లేదా, అలా పూజించకుండా అడ్డుకునే వారి వల్ల వచ్చే సమస్యలను చూపిస్తారా? అనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దర్శకుడు శివకుమార్ ఈ కథను ఎలా తెరకెక్కిస్తాడో వేచి చూడాలి. ఇదిలా ఉంటే ఇది `గాడ్ ఆఫ్ వార్` అనే కథ నుంచి తీసుకున్నట్టుగా తెలుగు నాట ప్రచారం జరుగుతుంది. ఇదే కథతో త్రివిక్రమ్.. అల్లు అర్జున్తో మూవీ చేయాలనుకున్నారు. మరి ఇది, అది ఒక్కటేనా అనేది సస్పెన్స్ గా మారింది.