
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘గద్దర్ అవార్డులు 2025’లో ‘దండోరా’ మూవీ సత్తా చాటింది. మూడు కేటగిరీల్లో ‘దండోరా’ అవార్డుల్ని కొల్లగొట్టేసింది. ఉత్తమ ద్వితీయ చిత్రం, ఉత్తమ సహాయ నటుడు(శివాజీ), ఉత్తమ సంగీత దర్శకుడు(మార్క్ కే రాబిన్) లకు అవార్డులు వరించాయి. ఈ క్రమంలో చిత్ర బృందం తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీకి థ్యాంక్స్ చెప్పింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సహాయ నటుడిగా అవార్డు అందుకున్న శివాజీ మాట్లాడుతూ, ఈ మూవీ ఇంతటితో ఆగదని మున్ముందు మరిన్ని అవార్డులను గెలుచుకుంటుందని తెలిపారు.
ఆయన మాట్లాడుతూ, ``దండోరా` సినిమాని గుర్తించి అవార్డుల్ని ఇచ్చిన జ్యూరీకి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది. ఎన్టీఆర్ గారు వేసిన ట్వీట్తో తెలుగు వారందరికీ ఈ చిత్రం దగ్గరైంది. మార్క్ కె రాబిన్కి అవార్డు రావడం ఆనందంగా ఉంది. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన బెన్నీకి థాంక్స్. ఈ మూవీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఈ అవార్డుల్లో భాగం ఉంటుంది. తెలుగు వాళ్ల ప్రతిభను, సత్తాను చాటే చిత్రమిది. మురళీగారు ‘దండోరా’ కథని, మూవీని మా కోసమే తీశాడనిపిస్తుంది. ఈ పాత్ర కోసం, లుక్ కోసం నేను చాలా వరకు రాత్రి పూట రెండు, మూడు గంటలే నిద్రపోయేవాడ్ని. నటన అంటే దైవంతో సమానం. దేవుడుకి నాకు ఆ వరం ఇచ్చాడు. దీంతో ప్రపంచంలో ఎక్కడైనా బతికేస్తాను. రాధ్య అనే పాప పాత్ర లేకపోయి ఉంటే ఈ సినిమా నేను చేసే వాడ్ని కాదు. నవదీప్, నందు, బిందు మాధవి ఇలా అందరూ ఫైనెస్ట్ యాక్టర్స్. వారికి ధన్యవాదాలు` అని తెలిపారు.
దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ, మా `దండోరా` సినిమాకు ఇలాంటి గుర్తింపు ఇచ్చిన జ్యూరీకి, ప్రభుత్వానికి థాంక్స్. ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన నా టీంలోని ప్రతీ ఒక్కరికీ థాంక్స్. కొత్త దర్శకుడిని అయినా సరే నా టీం అంతా నన్ను నమ్మింది. ఎంతో అనుభవం ఉన్న యాక్టర్స్ సైతం నాకు చాలా సపోర్ట్ చేశారు. మార్క్ కె రాబిన్ మా సినిమాకి ప్రాణం. ఆయన, నేను కలిసి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి సినిమాకు పని చేశాం. ఇలాంటి అవార్డులు, గుర్తింపు వచ్చిన సమయాల్లోనే మన వద్ద ఉన్న టాలెంట్ గురించి అందరికీ తెలుస్తుంది. శివాజీ వల్లే ఈ చిత్రం ఈ స్థాయికి వచ్చింది. ఈ సినిమా చూసి ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్లు పర్సనల్గా నాకు ఫోన్ చేసి అభినందించారు. ఇలాంటి గుర్తింపు, అవార్డులు వస్తే మరింత మంచి చిత్రాల్ని, సందేశాత్మాక సినిమాల్ని తీయాలనే ప్రోత్సాహం లభిస్తుంది’ అని అన్నారు.
నిర్మాత రవీంద్ర బెనర్జీ మాట్లాడుతూ, `దండోరా` సినిమాని గుర్తించి, అవార్డుల్ని ఇచ్చిన జ్యూరీ మెంబర్లకి, తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్. మా ‘దండోరా’ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా ప్రయాణంలో తోడుగా నిలిచిన సాహు గారికి, నాగవంశీ గారికి థాంక్స్’ అని అన్నారు. సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్ మాట్లాడుతూ, `గద్దర్ అన్న పాటలు చిన్నప్పటి నుంచి వింటూ ఉండేవాడ్ని. ఈ రోజు గద్దర్ అవార్డుల్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా అవార్డ్ రావడం నాకు పెద్ద గౌరవం లాంటిది. ‘దండోరా’ అద్భుతమైన కథ. ఇలాంటి కథను నా వద్దకు తీసుకు వచ్చిన మురళీకి థాంక్స్’ అని అన్నారు. నటుడు నందు మాట్లాడుతూ, `గద్దర్ అవార్డులు సాధించిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్. సినిమాకి అందరూ కలిసి పని చేస్తేనే ఫలితం వస్తుంది. ఉత్తమ చిత్రం అనే దాంట్లో దర్శకుడు, నిర్మాత కూడా వస్తారు. ఉత్తమ నిర్మాత అనే కేటగిరీని కూడా మున్ముందు పెట్టాలని కోరుకుంటున్నాను` అని అన్నారు.