
ఒకప్పుడు హీరోగా రాణించిన శివాజీ మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చారు. రాజకీయాలవైపు టర్న్ తీసుకున్నారు. ఆ తర్వాత `బిగ్ బాస్ తెలుగు` షోలో పాల్గొన్నాడు. ఈ షో విశేషమైన క్రేజ్ని తీసుకొచ్చింది. మళ్లీ ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యారు. వరుసగా వెబ్ సిరీస్లు, సినిమాలతో మెప్పిస్తున్నారు. ఇటీవల ఆయన `కోర్ట్` మూవీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో మంగపతి పాత్రలో అదరగొట్టారు. సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు `దండోరా` అనే చిత్రంతో రాబోతున్నారు. ఇది ఈ నెల 25న విడుదల కాబోతుంది.
`దండోరా` మూవీలో శివాజీతోపాటు నవదీప్, నందు, రవికృష్ణ, బింద మాధవి మనికా చిక్కాల, రాధ్య, అదితి భావరాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మురళీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. సినిమా రిలీజ్కి రెడీ అవుతున్న నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించారు నటుడు శివాజీ. ఆయన సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ చిత్రంలో కులం ప్రస్తావన ఉండబోతుందని చెప్పారు. సమాజంలోని అనేక అంశాలను చర్చించేలా సినిమా ఉంటుందని తెలిపారు. అన్ని భావోద్వేగాల సమాహారంగా సినిమా సాగుతుందని తెలిపారు.
‘దండోరా’ పూర్తిగా సందేశాత్మక చిత్రం కాదు. అన్ని రకాల కమర్షియల్ అంశాలను, భావోద్వేగాలను జోడించి తెరకెక్కించిన సినిమా. ఇదొక అద్భుతమైన సినిమా. ఇందులో గొప్ప స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎంతో సహజంగా ఉంటుంది. ఇందులో నా పాత్ర డిఫరెంట్గా ఉంటుంది. మంచోడా? చెడ్డోడా? అని చూసే ప్రేక్షకుడికి సరిగ్గా అర్థం కాదు. సినిమా చూసిన తరువాత ఆడియెన్స్ నా పాత్ర గురించి మాట్లాడుకుంటారు, ఇందులో నేను వ్యవసాయదారుడిగా కనిపిస్తాను. సినిమాలో అన్ని కారెక్టర్స్ నా చుట్టూనే తిరుగుతాయి. అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పాత్ర. `కోర్ట్`లోని మంగపతి పాత్రకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో అంతే రెస్పాన్స్ ‘దండోరా’లోని పాత్రకి కూడా వస్తుంది. నటుడిగా ఎంతో అదృష్టం ఉంటే తప్పా ఇలాంటి పాత్రలు రావు. ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉన్న కారెక్టర్ లభించింది. ఎన్నో రకాల ఎమోషన్స్ చూపించే పాత్ర దొరికింది. అద్భుతమైన కంటెంట్తో ఎమోషనల్గా సాగే చిత్రమిది. ఇలాంటి చిత్రాలు, కథలు, పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఏదో అలా వచ్చి వెళ్లినట్టుగా ఏ పాత్ర కూడా ఉండదు. అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది` అని తెలిపారు శివాజీ.
ఈ సందర్భంగా కులం గురించి ఆయన చెబుతూ, కులం అనేది మనిషికి ఒక ముసుగు మాత్రమే అని, మిడిల్ క్లాస్, చిన్న స్థాయిలో ఉన్న వాళ్లు మాత్రమే ఇలా కులాలు అని పట్టుకుని వెలాడుతుంటారు, అదే పెద్ద వాళ్లు, డబ్బున్న వాళ్లు ఇలాంటివి పట్టించుకోరు, డబ్బున్న వాళ్లే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు. డబ్బున్న వాళ్లు డబ్బున్న వాళ్లతోనే రిలేషన్ పెట్టుకుంటారు. అక్కడ కులం అడ్డురాదు, డబ్బు మాత్రమే పనిచేస్తుంది. పచ్చిగా, నిజం చెప్పాలంటే సమాజంలో అసలు కులం అనేది కాదు, డబ్బే మనుషుల మధ్య అడ్డుగోడను నిర్మిస్తుంది` అని తెలిపారు శివాజీ.
ఈ సందర్భంగా ఐబొమ్మ రవిపై తాను చేసిన కామెంట్లపై వివరణ ఇస్తూ, ఐబొమ్మ రవి చేసింది వందకి వందశాతం తప్పే, కానీ అతనిలో అంతటి టాలెంట్ ఉంది, అతను తప్పుదారిలో ఉపయోగించాడు, కానీ దాన్ని సరిగ్గా వాడుకోవాలని మాత్రమే చెప్పాను, తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు, తన మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను, ఏమాత్రం రియలైజ్ కావడం లేదు. ఇప్పుడు థియేటర్లలో పాప్కార్న్, కాఫీ ల రేట్లు దారుణంగా పెరిగాయి. వాటిని నియంత్రించాలి. అదేసమయంలో ఏడాదికి ఐదారు సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం వల్ల మిగిలిన 290 సినిమాల రేట్లు కూడా అలానే ఉంటాయనుకుంటున్నారు. దీంతో థియేటర్కి వచ్చి సినిమా చూసే ఆడియెన్స్ శాతం తగ్గిపోతుంది. సినిమా రంగం ప్రజల సొత్తు. వాళ్లకి దీనిపై విపరీతమైన మమకారం ఉంది. మారుతున్న సమాజాన్ని దృష్టిలోపెట్టుకుని ఇండస్ట్రీలోని వారిలో కూడా మార్పు రావాలి. టికెట్ ధరలు తక్కువగా ఉంటే ప్రేక్షకులు థియేటర్కి క్యూ కడతారు. గతంలో ప్రతి సినిమాని థియేటర్కి వచ్చి చూసేవాళ్లు, నిర్మాతకుడబ్బులు మిగిలేవి. సినిమాని థియేటర్లలో చూసిన ఫీల్ ఎక్కడా రాదు. కానీ టికెట్ రేట్లు పెంచడం వల్ల ఒక్కశాతం ఆడియెన్స్ మాత్రమే సినిమాని చూస్తున్నాను, మిగిలిన 99శాతం దూరమవుతున్నారు` అని తెలిపారు శివాజీ.