
ఈ శుక్రవారం ఐదారు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. అందులో అల్లరి నరేష్ `12ఏ రైల్వే కాలనీ`, ప్రియదర్శి `ప్రేమంటే`, రాజ్ తరుణ్ `పాంచ్ మినార్` నోటెడ్గా ఉన్నాయి. అయితే వీటితోపాటు ఓ రియల్ లవ్ స్టోరీ బేస్డ్ గా రూపొందిన `రాజు వెడ్స్ రాంబాయి` మూవీ కూడా విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతుంది. అల్లరి నరేష్, ప్రియదర్శి, రాజ్ తరుణ్ ల చిత్రాలకు చుక్కలు చూపిస్తోంది. ఈ హీరోల సినిమాలు కలెక్షన్ల పరంగా కోటి, రెండు కోట్ల దగ్గరే ఆగిపోతే `రాజు వెడ్స్ రాంబాయి` ఏకంగా పది కోట్లకు చేరుకోవడం విశేషం.
అల్లరి నరేష్ జోనర్ మార్చి సినిమాలు చేస్తున్నారు. కామెడీ కాకుండా థ్రిల్లర్స్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు `12ఏ రైల్వే కాలనీ` చిత్రంలో నటించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటించింది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ మూవీ నాలుగు రోజులు రెండు కోట్ల(రూ.2.83cr) కలెక్షన్లు దాటింది. కేవలం కోటిన్నర షేర్ మాత్రమే రాబట్టింది. సోమవారం నుంచి దారుణంగా పడిపోయింది. అల్లరి నరేష్ గత చిత్రాలతో పోల్చితే ఈ మూవీ చాలా డ్రాప్లో ఉంది. దీంతో ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలవబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాని నిర్మించారు.
ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన `ప్రేమంటే` మూవీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇది నాలుగు రోజుల్లో కేవలం కోటిన్నర(రూ.1.65) మాత్రమే వసూలు చేసింది. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీసు వద్ద వద్ద డిజాస్టర్గా నిలవబోతుంది. నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రాన్ని పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (SVCLLP) బ్యానర్పై రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పణలో నిర్మించారు. దీంతోపాటు విడుదలైన రాజ్ తరుణ్ `పాంచ్ మినార్` మూవీ కోటీ కలెక్షన్ల దగ్గరే ఆగిపోయింది.
ఈ సినిమాలకు పెద్ద ఝలక్ ఇచ్చింది స్వచ్ఛమైన విలేజ్ లవ్ స్టోరీ `రాజు వెడ్స్ రాంబాయి` మూవీ. ఇది బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతుంది. నాలుగు రోజుల్లోనే సుమారు రూ.9కోట్లు దాటింది. ఐదో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ తో పది కోట్లు దాటేసింది. కేవలం మూడు కోట్లతో రూపొందిన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే దానికి మూడు రెట్లు వసూళ్లని సాధించడం విశేషం. అంతేకాదు రోజు రోజుకిది పుంజుకుంటోంది. ఇది యాభై కోట్ల వరకు వెళ్తుందని అంచనా వేస్తున్నారు నిర్మాతలు.
ఇందులో అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించారు. కొత్త దర్శకుడు సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ సినిమాని వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ థియేటర్లో విడుదల చేశారు. తక్కువ బడ్జెట్తో రూపొంది భారీ వసూళ్ల దిశగా వెళ్తోంది. ఇల్లందులోని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. విలేజ్ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథ. ఆ విలేజ్లో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథ ఆద్యంతం కట్టిపడేస్తుందని చెప్పొచ్చు. పరువు కోసం హీరోయిన్ తండ్రి చేసిన దారుణం ఈ మూవీలో హైలైట్గా నిలుస్తుంది. క్లైమాక్స్ లో గుండెని బరువెక్కిస్తుంది. నటీనటులు కూడా అంతే సహజంగా నటించి సినిమాకి ప్రాణం పోశారు, దర్శకుడు టేకింగ్ ఇందులో మరో హైలెట్గా చెప్పాలి. యూత్తోపాటు 90కి కిడ్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.