దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దాసరి నారాయణరావు తర్వాత అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఆయన ఎంతో మందిని స్టార్లని చేశారు. ఎన్టీఆర్ నుంచి, శ్రీదేవి, చిరంజీవి, ఏఎన్నార్ వంటి ఎంతో మందికి అనేక కమర్షియల్ హిట్స్ అందించారు. తెలుగు సినిమాని కమర్షియల్ బాట పట్టించారు. కలెక్షన్ల వర్షాలు కురిపించారు.
రాఘవేంద్రరావు.. అతిలోక సుందరి శ్రీదేవికి కూడా లైఫ్ ఇచ్చాడు. బాలనటి నుంచి హీరోయిన్గా చేసి కెరీర్ బ్రేక్ ఇచ్చాడు. అనేక సూపర్ డూపర్ హిట్స్ అందించాడు. తిరుగులేని నటిగా, చివరికి అతిలోక సుందరిగానూ మార్చేశాడు. శ్రీదేవికి `అతిలోక సుందరి` అనే ట్యాగ్ తెచ్చిన `జగదేక వీరుడు అతిలోక సుందరి` మూవీని కూడా రాఘవేంద్రరావునే రూపొందించడం విశేషం.
అయితే అసిస్టెంట్గా ఉన్నప్పుడు రాఘవేంద్రరావు చేసిన పని, శ్రీదేవి ప్రాణాల మీదకు వచ్చిందట. ఆమెకి యాక్సిడెంట్ అయ్యిందట. జస్ట్ మిస్లో శ్రీదేవి తప్పించుకుందట. లేదంటే ఇప్పుడు ఈ అతిలోక సుందరిని మనం ఇప్పుడు చూసేవాళ్లం కాదని చెప్పారు రాఘవేంద్రరావు. మరి ఇంతకి ఏం జరిగింది? యాక్సిడెంట్ ఎలా అయ్యింది అనేది చూస్తే.
కె రాఘవేంద్రరావు తండ్రి ప్రకాష్ రావు కూడా దర్శకుడే. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, సినిమాటోగ్రాఫర్గా ఆయన చాలా సినిమాలు చేశారు. తండ్రి వద్ద అసిస్టెంట్గా పనిచేశాడు రాఘవేంద్రరావు. శ్రీదేవి బాలనటిగా ఓ సినిమా షూటింగ్ సమయంలో కొన్ని సీన్లని రాఘవేంద్రరావు షూట్ చేస్తుండేవాడట. అలా శ్రీదేవిపై ఓ సీన్ చేస్తున్నారట. అయితే తండ్రి వద్ద మార్కులు కొట్టేయాలని చెప్పి రాఘవేంద్రరావు సొంత ప్రయత్నం చేశాడు.
photo source- soundarya lahari
శ్రీదేవి రన్నింగ్ షాట్ తీస్తున్నారు. రాఘవేంద్రరావు రోడ్డు దాటే సీన్ చెప్పారు. అది రియల్గానే చేశారు. దీంతో చిన్న పిల్ల అయిన శ్రీదేవి రాఘవేంద్రరావు చెప్పగానే మరో మాటలేకుండా పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు దాటాల్సి ఉంటుంది. అయితే శ్రీదేవి బాగానే పరిగెత్తుకుంటూ వచ్చింది.
photo source- soundarya lahari
కానీ అమాయకత్వం, తెలియని తనంలో రోడ్డుపై వెహికల్స్ వస్తున్నాయా? లేదా చూసుకోలేదు. అలానే పరిగెత్తుకుంటూ వచ్చింది. దీంతో అటుగా వేగంగా వస్తున్న కారు శ్రీదేవిని ఢీ కొట్టింది. దీంతో ఆమె కిందపడిపోయింది. అయితే ఆ కారు శ్రీదేవి కాలు చివర్లో గుద్దేసింది. కొద్దిపాటి గాయంతో అతిలోక సుందరి ప్రాణాలతో బయటపడింది.
శ్రీదేవి రన్నింగ్లో ఒక్కసెకన్ లేట్ అయినా, ఘోర ప్రమాదం జరిగేది, జరగరానిది ఏదైనా జరిగి ఉంటే మనం అతిలోక సుందరిని చూసేవాళ్లమే కాదు, ఆమె ఒక లెజెండ్గా ఎదిగేది కాదు. ఇండియన్ సినిమాని ఊపేసేది కాదు. ఇండియన్ ఆడియెన్స్ ఓ అందాల తారని మిస్ అయ్యేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
`సౌందర్యలహరి` అనే టాక్ షోలో రాఘవేంద్రరావు ఈ విషయాన్ని వెల్లడించారు. శ్రీదేవి పాల్గొన్న షోలో ఈ విషయం చెప్పాడు. ఇందులో రామ్గోపాల్ వర్మ కూడా పాల్గొన్నారు. ఈ యాక్సిడెంట్ మాట విన్న ఆర్జీవీ.. అది జరిగి ఉంటే నేను మిమ్మల్ని చంపేసేవాడిని అంటూ కామెంట్ చేసి బాంబ్ పేల్చాడు వర్మ. ఇది నవ్వులు పూయించింది. ఆద్యంతం ఆకట్టుకుంటూ ఇప్పుడు వైరల్గా మారింది.
శ్రీదేవి హీరోయిన్గా పీక్ కెరీర్ని చూసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడలో సినిమాలు చేసి మెప్పించింది. తిరుగులేని లేడీ సూపర్ స్టార్గా ఎదిగింది. నిర్మాత బోనీ కపూర్ని వివాహం చేసుకున్నా ఆమెకి ఇద్దరు కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ జన్మించారు.
కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె రీ ఎంట్రీ ఇచ్చి తిరిగి పుంజుకునే సమయంలోనే 2018లో దుబాయ్లో ఓ హోటల్లో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఓ ఫంక్షన్ కోసం ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లారు. అందులో బాత్ రూమ్లో కాలు జారి బాత్ టబ్లో పడి కన్నుమూసింది శ్రీదేవి. ఆమె అభిమానులను శోక సంద్రంలో ముంచేసింది. కానీ ఆమె లేకపోయినా ఆమె సినిమాలతో, అద్భుతమైన పాత్రలో సజీవంగానే ఉంది అతిలోక సుందరి.