
ఇటీవల కాలంలో వరుసగా సెలబ్రిటీలు కన్నుమూస్తున్నారు. యంగ్ ఏజ్లో ఉన్న తారలే హఠాన్మరణం చెందుతున్నారు. ఇప్పుడు తారకరత్న, ఏడాదిన్నర క్రితం పునీత్ రాజ్కుమార్,సింగర్ కేకే, నటుడు సిద్ధార్థ్ శుక్లా, సిద్దాంత్ వీర్ సూర్యవంశీ, రాజు శ్రీవాస్తవ, వీరితోపాటు రాజకీయ నాయకులు మేకపాటి గౌతమ్రెడ్డి. వీళ్ల మరణానికి కారణం మాత్రం ఒక్కటే. అదే గుండెపోటు. హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ పేరేదైనా వీరిని బలితీసుకున్నది మాత్రం గుండెపోటే. అయితే ఐదు పదుల వయసులోపే, అప్పటి వరకు యాక్టివ్గా ఉండి ఉన్నట్టుండి కుప్పకూలి మరణించడం అత్యంత బాధాకరం.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నుంచి ఈ సెలబ్రిటీల మరణాల పరంపర కొనసాగుతూ వస్తోంది. 2021 అక్టోబర్ 29న పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. ఉదయం ఆయన తన జిమ్లో వర్కౌట్ చేస్తూ కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఆ లోపే ఆయన తుదిశ్వాస విడిచారు. అప్పటికి ఆయన వయసు 46ఏళ్లే. అప్పుగా కన్నడ ప్రజలు పిలిచుకునే పునీత్ అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
అంతకంటే నెల రోజుల ముందే బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో కన్నుమూశారు. 2021 సెప్టెంబర్ 21న ఆయన రాత్రి పది గంటలకు దాదాపు మూడుగంటల పాటు జిమ్లో వర్కౌట్స్ చేశారు. అనంతరం డిన్నర్ చేసి పడుకోగా, నిద్రలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అప్పటికీ ఆయన వయసు 40ఏళ్లు. రాత్రి సమయంలో చాతిలో నొప్పిగా ఉందని ఓ టాబ్లెట్ వేసుకుని పడుకున్నారు. ఇక తిరిగి లేవలేదు. బాలికా వధు, బిగ్ బాస్ షో ల ద్వారా పాపులర్ అయ్యారు నటుడు సిద్ధార్థ్ శుక్లా.
పునీత్ చనిపోయిన మూడు నెలలకే(2022 ఫిబ్రవరి 21) ఏపీ ఐటీ శాకమంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మృత్యువాత పడ్డారు. ఆయన కూడా జిమ్లో వర్కౌట్స్ చేసే సమయంలోనే గుండెపోటుకు గురై చనిపోయారు. ఆరోగ్యం విషయంలో అత్యంత కేరింగ్తో ఉండే ఆయన గుండెపోటుతో కన్నుమూయడం ఏపీ ప్రజలను కలచివేసింది. ఫిట్గా, యాక్టివ్గా ఉన్న హఠాన్మరణంతో అంతా షాక్కి గురయ్యారు. రోజు వారి వ్యాయామాలు చేస్తూ చురుకుగా ఉండే వీరికి గుండెపోటు రావడమే అందరిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది.
సింగర్గా ఎంతో పాపులారిటీని పొందారు కేకే. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ ఇలా అనేక భాషల్లో వేల పాటలు పాడి అలరించిన సింగర్ కేకే(కృష్ణకుమార్ కున్నత్) గతేడాది మే 31న గుండెపోటుతో మరణించారు. కోల్కతాలోని ఓ కాలేజ్ ఫెస్ట్ లో ప్రదర్శన ఇస్తూ ఆయన స్టేజ్పైనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించి ఆయన్ని ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూశారు. ఆయన వయసు 53ఏళ్లు. కానీ యంగ్ అండ్ ఎనర్జిటిక్గా ఉంటారు కేకే. ఆయన చనిపోవడానికి కారణం గుండెపోటు. పాట పాడే క్రమంలో ఆయనకు కార్డియక్ అరెస్ట్ కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అభిమానులను తీరని శోకంలో ముంచెత్తారు.
మరో హిందీ టీవీ నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ సైతం 46ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. 2022 నవంబర్ 11న ఆయన జిమ్లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, మధ్యలోనే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఫిట్నెస్కి కేరాఫ్గా నిలిచే సిద్ధాంత్ మరణంతో హిందీ బుల్లితెర షాక్లోకి వెళ్లిపోయింది.
బాలీవుడ్లో స్టాండప్ కమెడియన్గా పాపులర్ అయ్యారు రాజు శ్రీవాస్తవ్. ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్ ద్వారా ఆయన గుర్తింపు పొందారు. రాజు శ్రీవాస్తవ్ 59ఏళ్ల వయసులో జిమ్లోనే వర్కౌట్స్ చేస్తూ గుండెపోటుకి గురయ్యారు. వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 41 రోజులపాటు ప్రాణాలతో పోరాడిన ఆయన చివరికి 2022 సెప్టెంబర్ 21న తుదిశ్వాస విడిచారు.
ఇక ఇప్పుడు వీరి జాబితాలో తెలుగు నటుడు తారకరత్న కూడా చేరడం అత్యంత బాధాకరం. 40ఏళ్ల వయసున్న తారకరత్న హీరోగా మెప్పించి, ఇప్పుడిప్పుడే విలన్గా టర్న్ తీసుకుంటున్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ యాక్టివ్ కాబోతున్నారు. వచ్చే ఏడాది ఏపీలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అందులో భాగంగా రాజకీయాల్లో యాక్టివ్గా మారాలనే ఉద్దేశంతో జనవరి 27న నారా లోకేష్ ప్రారంభించిన `యువగళం` పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రారంభమైన కాసేపటికే పాదయాత్రలోనే తారకరత్న కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన అనుచరులు, బాలకృష్ణ స్థానిక కుప్పం ఆసుపత్రికి తరలించారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని నిర్ధారించారు.
ఆ రోజు కుప్పం ఆసుపత్రిలో చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయలకు తరలించారు. అక్కడ ఏ క్లాస్ డాక్టర్లు, ప్రత్యేక డాక్టర్ల బృందం పర్యవేక్షణ, విదేశీ వైద్యుల ట్రీట్మెంట్ ఇచ్చినా లాభం లేదు. దాదాపు 23 రోజులు పోరాడి చివరికి శనివారం సాయంత్రం(18-2-2023) తుదిశ్వాస విడిచారు. అటు టాలీవుడ్, ఇటు నందమూరి ఫ్యామిలీని శోక సంద్రంలో ముంచెత్తారు. ఇలా దాదాపు 18 నెలల్లో ఏడుగురు సెలబ్రిటీలు గుండెపోటుతో కన్నుమూయడం బాధాకరం.