
ప్రభాస్ తాజాగా తనలోని కొత్త కోణాన్ని చూపించారు. ఇటీవల కాలంలో చాలా సీరియస్గా కనిపించిన ఆయన ఇప్పుడు మాత్రం చాలా జోష్తో కనిపించారు. తాను నటించిన `ది రాజాసాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫుల్ జోష్తో కనిపించడం విశేషం. అభిమానులను అలరించేలా మాట్లాడారు. ఒక రోజు మీరు ఊహించినట్టుగా, మీరంతా షాక్ అయ్యేలా స్టేజ్పై రచ్చ చేస్తానని తెలిపారు. త్వరలో కొత్తగా చూస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి, దర్శకుడు, హీరోయిన్ల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అదే సమయంలో తాను పనిచేసిన దర్శకుల గురించి కూడా క్రేజీ కామెంట్స్ చేశారు ప్రభాస్.
చాలా రోజుల తర్వాత అభిమానులను కలుస్తున్న నేపథ్యంలో ఆనందంగా ఉందన్నారు ప్రభాస్. సంజయ్ దత్తో పనిచేయడం అద్భుతమైన ఫీలింగ్ అని, ఆయన స్క్రీన్ మొత్తాన్ని తినేస్తారని తెలిపారు. ఇందులో నానమ్మగా చేసిన జరీనా వహాబ్ గురించి చెబుతూ, ఆమెతో వర్క్ చాలా ఫన్నీగా సాగిందని తెలిపారు. ఈ క్రమంలో సినిమా కథేంటో లీక్ చేశారు. ఇది నాన్నమ్మ, మనవడి మధ్య బాండింగ్ నేపథ్యంలో సాగే సినిమా అని తెలిపారు. హీరోయిన్ల గురించి చెబుతూ, మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్లు ఇందులో నటించారని, రిద్ధి కుమార్ చాలా హార్డ్ వర్కింగ్ అని, సినిమా కోసం చాలా కష్టపడిందన్నారు. మాళవిక మోహనన్ కళ్లు చాలా బాగుంటాయని, ఆమె మూడున్నరేళ్లు సినిమా కోసం కష్టపడిందని చెప్పారు. అలాగే నిధి అగర్వాల్ సెట్లో అందరి ఫేవరేట్ అని తెలిపారు.
నిర్మాత విశ్వప్రసాద్ గురించి చెబుతూ, ఆయనే ఈ సినిమాకి హీరో అని, ఆయన ధైర్యాన్ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు ప్రభాస్. మూడేళ్లు ఎలా తీశారని, మీ గట్స్ కి హ్యాట్సాఫ్ అన్నారు. థమన్ ఈ మూవీకి మరో పిల్లర్ అని, ఈ రేంజ్లో ఆర్ఆర్ ఇండియాలోనే ఇంకెవ్వరూ ఇవ్వరని, ఇప్పుడు సినిమాని ఆయన చేతిలో పెట్టామని, అదిరిపోయేలా బీజీఎం ఇచ్చారని తెలిపారు. మూడేళ్లు ఈ సినిమా కోసం ఎంతో ఒత్తిడి, బాధ, పెయిన్ భరించారని దర్శకుడు మారుతి గురించి తెలిపారు. వరుసగా సీరియస్ ఫిల్మ్స్ అవుతున్నాయి, మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్ చేయాలి డార్లింగ్ అంటే మారుతి ఈ మూవీ కథ ప్రిపేర్ చేశారని తెలిపారు. హర్రర్ కామెడీ థ్రిల్లర్గా దీన్ని రూపొందించారని, మూడేళ్లు ఏదేదో చేశాడు, ఇలా కాదు, అలా కాదు అని మొత్తంగా మంచి హర్రర్ కామెడీ మూవీని రూపొందించాడని తెలిపారు.
ఇందులో క్లైమాక్స్ గురించి చెప్పారు ప్రభాస్. ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ రాలేదని, ఎప్పుడూ చూసి ఉండరని, చాలా కొత్తగా ఉంటుందన్నారు. మారుతి పెన్తో రాశాడా? మెషిన్ గన్తో రాశాడో అర్థం కావడం లేదని, క్లైమాక్స్ ఎవరూ ఊహించరు అని, వేరే లెవల్లో ఉంటుందని మూవీపై హైప్ ఇచ్చాడు డార్లింగ్. 15ఏళ్ల తర్వాత ఎంటర్టైనింగ్ ఫిల్మ్ చేశానని, అది కూడా సంక్రాంతికి వస్తుంది, ఇక చూసుకోండి అంటూ అభిమానుల్లో జోష్ని నింపారు ప్రభాస్. సంక్రాంతికి చిరంజీవి, రవితేజ వంటి సీనియర్ల మూవీస్ కూడా వస్తున్నాయి. దీంతో తన మూవీతోపాటు సంక్రాంతికి వచ్చే అన్ని సినిమా ఆడాలని తెలిపారు. `సీనియర్లు సీనియర్లే, వాళ్లుముందుండాలి, వాళ్ల నుంచే మేం నేర్చుకున్నాం, అన్ని సినిమాలు ఆడాలి` అని చెప్పారు ప్రభాస్.
ఇక యాంకర్ సుమ `ది రాజాసాబ్` ఈవెంట్లో ప్రభాస్ని కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆయన పనిచేసిన దర్శకుల గురించి ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే ఏం చెబుతారని అడిగింది. సందీప్ రెడ్డి వంగా, పూరీ జగన్నాథ్ ల గురించి క్రేజీ కామెంట్ చేశారు ప్రభాస్. నాగ్ అశ్విన్ చాలా స్ట్రాంగ్ అని, ప్రశాంత్ నీల్ బ్యూటీఫుల్ పర్సన్ అని, రాజమౌళి జీనియస్ గారు అని, మారుతి క్యూట్ అని, హను రాఘవపూడి మోస్ట్ హార్డ్ వర్కర్ అని, సుజీత్ స్మార్ట్ అని, పూరీ జగన్నాథ్.. క్రియేటివ్ జీనియస్ అని, కొత్త ట్రెండ్ సృష్టిస్తాడని తెలిపారు. ఇక ఫైనల్గా సందీప్ రెడ్డి గురించి చెబుతూ, కల్ట్ డైరెక్టర్ అని, ఇప్పుడు ఆయనతోనే పనిచేస్తున్నానని, కల్ట్ వేరే లెవల్ అని తెలిపారు ప్రభాస్. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.