హీరోయిన్ అంటే హీరోతో డ్యూయెట్లు పాడుకోవడం మాత్రమే కాదు, సినిమాని నడిపించడం కూడా అని అంటున్నారు నయా హీరోయిన్లు. సినిమాని తమ భుజాలపై మోయగలమని నిరూపిస్తున్నారు. ఇక హీరోతో పనిలేదంటున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు శ్రీకారం చుడుతున్నారు. నిజానికి ఈ మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాల ట్రెండ్ చాలా కాలంగానే నడుస్తుంది. కానీ హీరోయిన్గా సీనియర్ అయ్యాక, కమర్షియల్ సినిమాలు చేయలేని పరిస్థితుల్లో, హీరోలకు దీటుగా ఇమేజ్ని పెంచుకున్నాక ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసేవాళ్లు.
కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. కెరీర్ ముగింపు దశ వరకు కాదు, మధ్యలోనే చేస్తున్నారు. ఓ వైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నారు. మెప్పిస్తున్నారు. కీర్తి సురేష్ ఎప్పుడో ఈ ట్రెండ్ ప్రారంభించింది. కొనసాగిస్తుంది. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, మరోవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూ, కమర్షియల్ చిత్రాలు చేస్తుంది.
ఇప్పటికే `మహానటి`, `పెంగ్విన్`, `మిస్ ఇండియా`, `గుడ్ లక్ సఖీ`, `సానీ కాయిదమ్` చిత్రాలు చేసింది. ఇప్పుడు `రఘు తాత`, `రివాల్వర్ రీటా` సినిమాల్లో నటిస్తుంది. తమిళంలోనే నాలుగు సినిమాలు చేస్తుండగా, అందులో మూడు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కావడం విశేషం. ఓ రకంగా ఈ విషయంలో కీర్తి సురేష్ స్పీడుమీదుందని చెప్పొచ్చు. ఈ చిత్రాలన్నీ ఈ ఏడాది రిలీజ్ కాబోతున్నాయి. ఓ రకంగా ఏడాది మొత్తం కీర్తిసురేష్ రచ్చ నెక్ట్స్ లెవల్ లో ఉండబోతుందని చెప్పొచ్చు.
ఈ జాబితాలో లేటెస్ట్ గా పూజా హెగ్డే కూడా చేరింది. ఇన్నాళ్లు కమర్షియల్ చిత్రాలతో మెప్పించింది. లక్కీ లెగ్నుంచి, ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ని ఫేస్ చేసింది. దీంతో ఇప్పుడు రూట్ మార్చింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. తాజాగా ఈ భామ తమిళంలో మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. `కోబ్రా` ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తుంది. ఇందులో ఆమె పాత్ర చాలా బోల్డ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇది త్వరలోనే ప్రారంభం కానుందని, ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుందని తెలుస్తుంది. ఈ ఏడాది పూజాని లేడీ ఓరియెంటెడ్ కథలో చూడబోతున్నామని చెప్పొచ్చు.
దీంతోపాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా ఈ జాబితాలో చేరింది. ఆమె ఓ వైపు పాన్ ఇండియా చిత్రాలతో దుమ్మురేపుతుంది. అంతలోనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. `రెయిన్బో`, అలాగే `ది గర్ల్ ఫ్రెండ్` అనే చిత్రంలో నటిస్తుంది. రెండు ప్రేమ కథ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ మూవీస్. ఇందులోనూ రష్మికనే మెయిన్ లీడ్. `రెయిన్బో` చిత్రానికి శాంతరుబన్ దర్శకుడు. `ది గర్ల్ ఫ్రెండ్` చిత్రానిక రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్. ఈ రెండు చిత్రీకరణలో ఉన్నాయి.ఈ ఏడాది థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
సమంత.. ఇప్పటికే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో రాణిస్తుంది. `యశోద`, `యూటర్న్`, `శాకుంతలం` వంటి సినిమాల్లో నటించింది. `ది ఫ్యామిలీ మ్యాన్ 2`తోనూ మెప్పించింది. ఇప్పుడు `సిటాడెల్` వెబ్ సిరీస్లో నటించింది. ఇది షూటింగ్ పూర్తయ్యింది. ఈ సమ్మర్లో విడుదల కాబోతుంది. ఇందులో వరుణ్ ధావన్ మెయిన్ లీడ్గా చేస్తున్నా, డామినేటింగ్ అండ్ ఎలివేటింగ్ రోల్ సమంతదే. ఓ రకంగా తనే వెబ్ సిరీస్ కి లీడ్. ఇలా ఈ ఏడాది సమంత కూడా మరోసారి లేడీ ఓరియెంటెడ్ వెబ్సిరీస్తో మెప్పించబోతుందని చెప్పొచ్చు.