పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన తొలి చిత్రం `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`. ఈవీవీ సత్యానారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చేసే రియల్ సాహసాలు హైలైట్గా నిలిచాయి. ఆయన తన చేతులపై 25కార్లు వెళ్లనివ్వడం, అలాగే పెద్ద బండరాళ్లని తన బాడీపై పెట్టుకుని పగల గొట్టడం హైలైట్గా నిలిచింది.
`అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` సినిమాలో ఆయా సీన్లే హైలైట్గా నిలుస్తుంది. అయితే ఇది హీరోయిన్తో పందెంలో భాగంగా పవన్ కళ్యాణ్ చేస్తాడు. పవన్ గురించి కాలేజీలో ఫ్రెండ్స్ అంతా అతిగా చెప్పడం, తరచూ పందెలు ఆడుతూ కనిపించడంతో హీరోయిన్కి మండి ఆమె పెద్ద పందేలు వేస్తుంది. అదే బండరాళ్లని పగలగొట్టుకోవడం, కార్లని చేతులపై నుంచి వెళ్లనివ్వడం చేస్తాడు పవన్.
మరి ఇంతకి ఆ హీరోయిన్ ఎవరో కాదు సుప్రియ యార్లగడ్డ. ఈ సినిమాతోనే ఇటు పవన్, అటు సుప్రియ టాలీవుడ్కి జంటగా పరిచయం అయ్యారు. జంటగా నటించి మెప్పించారు. ఆ తర్వాత సుప్రియ సినిమాలకు దూరమయ్యింది. పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా ఎదిగాడు. పవర్ స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా రాజకీయాల్లో విజయం సాధించి, ఏపీలో డిప్యూటీ సీఎం అయ్యారు.
తాజాగా ఈ జంట కలుసుకుంది. సుమారు 28ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు కలుసుకోవడం విశేషం. ఈ అరుదైన కలయికకి విజయవాడలోని క్యాంప్ కార్యాలయం వేదికైంది. సోమవారం టాలీవుడ్ నిర్మాతలు డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ని కలిసిన విషయం తెలిసిందే. ఇందులో సుప్రియ కూడా ఉండటం విశేషం. ఆమె కూడా అన్నపూర్ణ స్టూడియో తరఫున నిర్మాతగా పవన్ని కలవడానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు కలిసి ఫోటో దిగారు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 28ఏళ్ల తర్వాత కలిసిన `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` జంట అంటూ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఇది చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు.
సుప్రియ ఇప్పుడు నిర్మాతగా రాణిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోని తనే చూసుకుంటుంది. ప్రొడక్షన్లోనూ ఇన్వాల్వ్ అవుతుంది. నాగార్జునతో నిర్మించే సినిమాల్లో ఆమె ముందుండి చూసుకుంటుంది. నిర్మాతగా బిజీగా ఉంది. ఆ మధ్య `గూఢచారి` చిత్రంలోనూ ఓ పవర్ఫుల్ రోల్లో మెరిసిన విషయం తెలిసిందే.