
ఎన్టీఆర్ బాలీవుడ్ రంగప్రవేశానికి అంతా సిద్దమైంది. 'వార్ 2'తో బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్నాడు. నందమూరి కుటుంబ వారసుడికి హిందీలో మంచి ఫాలోయింగ్ ఉందని అర్దం చేసుకున్న హిందీ నిర్మాణ సంస్దలు ఆయన్ని తమ సినిమాల్లో చేయమని అడుగుతున్నారు. ఇదంతా ఎన్టీఆర్ తాజా చిత్రం దేవర బిజినెస్ కు కలిసి వస్తోంది. అక్కడ మీడియా ఇప్పుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతోంది. దాంతో ఎన్టీఆర్ దేవర కొనటానికి అక్కడ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఇదేమీ ఇప్పుటికిప్పుడు వచ్చిన క్రేజ్ కాదు. ఆర్.ఆర్.ఆర్ కంటే ముందే ఎన్టీఆర్ కు ఈ క్రేజ్ ఉందంటే నమ్ముతారా.
అవును..ఎన్టీఆర్ లాస్ట్ రిలీజ్ 'RRR'తో నార్త్ లో సెన్సేషన్ క్రియేట్ చేసారు. అక్కడ ఓ రేంజిలో అతనికి అవసరమైన మైలేజ్ , గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే 'RRR' కంటే ముందు ఎన్టీఆర్ హిందీ సినిమా ప్రేక్షకులలో బాగా ఫేమస్ అయ్యారు. హిందీ డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడి మరీ ఎన్టీఆర్ సినిమాలను కొనుగోలు చేసి హిందీ టీవీ ఛానెల్లలో మంచి డబ్బు సంపాదించేవారు,.
ఎన్టీఆర్ నటించిన "ఊసరవల్లి,' 'అశోక్', 'అల్లరి రాముడు', 'నాగ' "బృందావనం', 'బాద్షా', 'జనతా గ్యారేజ్' వంటి కొన్నింటిని హిందీలో డబ్ చేసి ప్రేక్షకుల రేటింగ్స్ని చూశారు. హిందీ ఛానల్ ప్రేక్షకులకు ఖచ్చితంగా చూడాల్సిన సినిమాల హీరోగా మారాడు. "అశోక్" వంటి అతని సినిమాలు కొన్ని తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడకపోయినా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. , ఎన్టీఆర్ చిత్రాలన్నీ గత రెండు దశాబ్దాలుగా హిందీ ఛానెల్ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆ క్రేజ్ ఇప్పుడు రెట్టింపు కాబోతోంది. ఇదంతా గమనించే యష్ రాజ్ ఫిల్మ్స్ వారు తమ సినిమాలో కీ రోల్ ఆఫర్ చేసారు.
హిందీ డిస్ట్రిబ్యూటర్ ఒకరు మీడియాతో మాట్లాడుతూ, “బాలీవుడ్కు వెళ్లాలనే ఎన్టీఆర్ నిర్ణయం సరైనది, ఎందుకంటే గత రెండు దశాబ్దాలుగా అతను సంపాదించిన హిందీ సినిమా ప్రేక్షకుల సంఖ్యను ఒకటిగా చేయాలి. . “ఎన్టీఆర్ చాలా తెలుగు సినిమాలు హిందీలో డబ్ చేయబడ్డాయి. ప్రతి చిత్రం హిందీ ఛానెల్లలో మంచి రేటింగ్లను చూసింది. ఎన్టీఆర్ తన ఆవేశాన్ని చూపించే పాత్రలు, డాన్స్ లు అంటే హిందీ వాళ్లకు బాగా ఇష్టం. అక్కడ వాళ్ళు అతన్ని ఓన్ చేసుకున్నారు వైవిధ్యమైన సినిమాలలో అద్భుతమైన డ్యాన్స్ స్కిల్స్తో హిందీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు, ”అని ఆయన చెప్పారు.
గతంలో ఎన్టీఆర్ నటించిన సినిమాలు టీవి శాటిలైట్ హక్కులు నాలుగైదు హిందీ ఛానల్స్ కు ఇచ్చేవారు. అప్పుడు నార్త్ బెల్ట్ లో థియేటర్ రిలీజ్ లేదు. అయితే "పుష్ప' ద్వారా గేమ్ ఛేంజ్ అయ్యింది. అటు టీవీల్లో, ఇటు ఓటిటిల్లో, మరో ప్రక్క థియేటర్ లలో సమాంతరంగా విడుదలై, బాక్సాఫీస్ను షేక్ చేసింది. అందుకే ఇప్పుడు నార్త్ డిస్ట్రిబ్యూటర్ బెల్ట్ మొత్తం ఎన్టీఆర్ 'దేవర' కోసం ఎదురుచూస్తోంది. దాని డబ్బింగ్ హక్కులు ఫ్యాన్సీ ధరలను కోట్ చేస్తున్నారు.
మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, యుపి , బీహార్ లలో ఎన్టీఆర్ కు మార్కెట్ ఎక్కువ. అక్కడ 400- పైగా థియేటర్లలో 'దేవర' విడుదల కావచ్చని అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ సినిమా డిస్టిబ్యూట్ చేస్తే బాగా డబ్బు సంపాదించవచ్చు అని నమ్మకంతో ఉన్నారు. "దేవర చాలా హైప్ క్రియేట్ చేస్తోంది. అందులోనూ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ని సీన్ లోకి తీసుకురావటం కూడా కలిసొచ్చింది. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ హిందీ బెల్ట్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టి, తన తెలుగు ప్రత్యర్థి హీరోలను మించిపోతాడు" అని నమ్మకంగా ఉన్నారు.
తెలుగులో నెక్ట్స్ పెద్ద సినిమాల్లో ఒకటి దేవర. ఈ సినిమాను ప్రకటించిన తేదీకు గ్రాండ్ గా ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు షూటింగ్,ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. మధ్యలో కొన్ని ఊహించని కారణాల వలన బ్రేకులు పడుతున్నప్పటికీ కొరటాలు మాత్రం వీలైనంతవరకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ తోనే వర్క్ ఫినిష్ చేస్తున్నాడు. అయితే అనుకోని అవాంతరాలు మధ్యలో వస్తున్నాయి. విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడడం అలాగే కొన్ని షూటింగ్ పనులు అనుకున్న సమయానికి పూర్తిగా కాకపోవడం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం నుంచి పెద్ద అప్డేట్ ని అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా తంగం అనే పాత్రలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తోంది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి తరహాలో తన అందంతో మెస్మరైజ్ చేస్తున్న జాన్వి దేవరలో మాత్రం చాలా కీలకమైన పాత్రలోనే కనిపించబోతోందని అర్దమైంది. ఈ క్రమంలో అభిమానుల మొర ఆలకించి ఓ పెద్ద అప్డేట్ ని ఇవ్వమని టీమ్ ని ఎన్టీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20న సాంగ్ టీజర్ రావచ్చు అని అలాగే ఓ కొత్త పోస్టర్ ని కూడా వదులుతారని తెలుస్తోంది. అయితే ఈ లోగా మాత్రం టీమ్ ఎటువంటి అప్డేట్స్ ఇవ్వదుట.
ఇదిలా ఉంటే దేవర సినిమా ఫస్ట్ పార్ట్ ని అక్టోబర్ 10న రిలీజ్ అవ్వచ్చని ప్రొడక్షన్ టీమ్ నుంచి హింట్స్ అందుతున్నాయి. అయితే పుష్ప 2 కనుక రిలీజ్ డేట్ మార్చుకుంటే కనుక ఆగస్ట్ 15 న రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న చిత్రం 'దేవర' .ఈ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతోంది. ఎక్సపెక్టేషన్స్ పెరిగాయి.
ఇప్పటికే విడుదల చేసిన లుక్, గ్లింప్స్ లో చేతిలో ఆయుధంతో ఎన్టీఆర్ లుక్ ఫెర్రోషియస్గా ఉంది. ఈ గ్లిప్స్ చూసిన వారంతా ఎన్టీఆర్ కెరియర్ లో దేవర బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫిక్షనల్ కథాంశంతో సిద్ధమవుతోన్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల రైట్స్ కు ఓ రేంజిలో పోటీ నెలకొని ఉంది. అలాగే తాజాగా ఓవర్ సీస్ రైట్స్ డీల్ క్లోజ్ చేసినట్లు సమాచారం.
‘దేవర’లో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు.
రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.